SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
”ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందాను. ఇప్పుడు నా దగ్గర పెద్ద మొత్తంలో ఉన్న డబ్బులను ఒకేసారి పెట్టుబడి పెడదామనుకుంటున్నా. డబ్బులన్నింటినీ స్టాక్ మార్కెట్లో పెట్టాలా? లేదా ప్రాపర్టీ కొనాలా? లేకపోతే మరేదైనా ప్రభుత్వ పథకంలో ఇన్వెస్ట్ చేయాలా?”
వయసు మళ్లిన తర్వాత పెట్టే పెట్టుబడుల విషయంలో ప్రజలకు ఇలాంటి గందరగోళం తలెత్తుతూ ఉంటుంది.
ఎందుకంటే, పదవీ విరమణ తర్వాత కూడా పొదుపును మరో 20 నుంచి 30 ఏళ్లకు సరిపడేలా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరముంది.
మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, స్టాక్ మార్కెట్, బంగారం, రియల్ ఎస్టేట్ వంటి పలుమార్గాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు.
అయితే, పెట్టుబడి పెట్టే ముందు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే, ఒక వయసు తర్వాత, వైద్య ఖర్చులు పెరిగిపోతుంటాయి.
ఇలాంటి పరిస్థితిలో ఇన్వెస్టర్లు ఏ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలో ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు.
వయసు మళ్లిన తర్వాత పెట్టుబడి పెట్టేటప్పుడు, కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో చూద్దాం..


”పెట్టుబడి లక్ష్యాలు వయసురీత్యా మారుతూ ఉంటాయి. వృద్ధాప్యంలో అత్యధిక రాబడుల కోసం పరిగెత్తడం కంటే మూలధన (అసలుకు) భద్రత, నిరంతర ఆదాయం, ప్రశాంతమైన మనసు చాలా ముఖ్యం” అని సోహం క్యాపిటల్ సర్వీసెస్ పార్టనర్ ప్రియాంక్ ఠక్కర్ చెప్పారు.
”వయసు పైబడిన వారు పెట్టుబడి పెట్టేటప్పుడు తరచూ తప్పుడు సూచనలు లేదా కమిషన్ ఆధారిత అమ్మకాల బారిన పడుతుంటారు” అని అన్నారు.
”ఎక్కువ లాభాలు వస్తాయనే హామీ లేదా పెట్టుబడి పెట్టేందుకు ఇదే చివరి అవకాశం వంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు, కుటుంబ సభ్యులతో చర్చించాలి. లేదా నమ్మకస్తులైన ఆర్థిక సలహాదారులను సంప్రదించాలి. ప్రోడక్ట్ గురించి పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ఏ డాక్యుమెంట్లపై అయినా సంతకం పెట్టాలి” అని సూచించారు.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు.. నష్టం రావొచ్చన్న భయంతో కూడుకున్న పని.
”మీకు ఏళ్ల తరబడి అనుభవం, స్టాక్ మార్కెట్ గురించి అవగాహన ఉంటే, పెట్టుబడి పెట్టొచ్చు. కానీ, మీకు స్టాక్ మార్కెట్లో ఎలాంటి అనుభవం లేకపోయినా, ఇతరుల సలహా మేరకు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది” అని మనీప్లాంట్ ఫిన్మార్ట్ డైరెక్టర్ మెహుల్ షా చెప్పారు.
ఫొటో సోర్స్, Getty Images

మీరు ఏ వయసు వారైనా, ఆరోగ్య బీమాను నిర్లక్ష్యం చేయడం కాస్త ఇబ్బందితో కూడుకున్న విషయమే.
” కొంతమంది తమకు జీవితాంతం ఇన్సూరెన్స్ అవసరం పడలేదు కదా, ఇక ఈ వయసులో అత్యధిక ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని భావిస్తుంటారు. ఇలా ఆలోచిస్తూ ప్రీమియం చెల్లించడం ఆపేస్తారు. కానీ, ఇది వారికి చాలా ప్రమాదకరంగా మారొచ్చు” అని ఆర్థిక సలహాదారులు మెహుల్ షా చెప్పారు.
”వయసు పైబడిన తర్వాత అకస్మాత్తుగా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు వస్తుంటాయి. అవసరమైనప్పుడు 24 నుంచి 48 గంటల్లో డబ్బులు చేతుల్లోకి వచ్చేలా పెట్టుబడులు పెట్టాలి. డబ్బులన్నింటినీ దీర్ఘకాలానికి లాక్ అయ్యేలా ఇన్వెస్ట్ చేయకూడదు. వైద్య ఖర్చులకు, అత్యవసరాలకు వెంటనే నిధులు అందుబాటులోకి వచ్చేలా, వేరుగా వీటిని ఉంచుకోవడం చాలా ముఖ్యం” అని ప్రియాంక్ ఠక్కర్ అన్నారు.

కొందరు తరచూ వార్తా పత్రికల్లో ప్రకటనలను చదవడం ద్వారానో, లేదా సోషల్ మీడియాలో మార్కెటింగ్ మెసేజ్లతో ప్రభావితమవ్వడంతోనో.. పెట్టుబడుల విషయంలో రిస్క్లు తీసుకుంటుంటారు. ఇది కొన్నిసార్లు వారు డబ్బులు పోగొట్టుకునేలా చేస్తుంది.
”చాలామంది చిన్న వయసులో రిస్క్లు తీసుకోరు. ఆ తర్వాత వృద్ధాప్యంలో షేర్లలో లేదా మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో పెట్టుబడులు పెడతారు. గతంలో ఈ షేర్లు పెరిగాయి కదా, మ్యూచువల్ ఫండ్స్ పెరిగాయి కదా అనుకుంటూ.. భవిష్యత్లో కూడా ఆ షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్లు భారీ రాబడులను ఇస్తాయని భావిస్తారు. వయసు పైబడిన వారికి ఇది ప్రమాదకర వ్యూహం. కొన్నిసార్లు వారి అసలు పోయేలా చేస్తాయి. లాభాల ఆశతో అసలుకే మోసం వస్తే? అలాంటి పెట్టుబడులు అంత శ్రేయస్కరం కాదు” అని మెహుల్ షా చెప్పారు.
”రిటైర్మెంట్ డబ్బుల విషయంలో అసలు రాజీపడొద్దు. మీకు అనుభవం ఉన్నా, అర్థం చేసుకున్న ప్రొడక్టుల్లోనే పెట్టుబడులు పెట్టాలి” అని సూచించారు.
ఫొటో సోర్స్, Mehul Shah

రియల్ ఎస్టేట్లో, 60 నుంచి 65 ఏళ్ల వయసు తర్వాత పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండటం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఎందుకంటే, రియల్ ఎస్టేట్ను అంత త్వరగా నగదుగా మార్చుకోలేమని చెబుతున్నారు. ఇది అత్యంత తక్కువగా లిక్విడ్ అసెట్లోకి మారే సాధనంగా పేర్కొంటున్నారు.
”ఆస్తి అమ్మేందుకు చాలా సమయం పడుతుంది. మీకవసరం అయినప్పుడు వెంటనే చేతులోకి డబ్బులు రావు” అని సోహం క్యాపిటల్ సర్వీసెస్ ప్రియాంక్ ఠక్కర్ చెప్పారు.
అయితే, రియల్ ఎస్టేట్లో అద్దెల రూపంలో ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు.
”రియల్ ఎస్టేట్లో పెట్టుబడులకు తక్కువ లిక్విడిటీ ఉంటుంది. దీర్ఘకాలం డబ్బులు దానిలో లాక్ అవుతాయి. అవసరం అయినప్పుడు మీ సొంత డబ్బులనే మీరు వాడుకోలేరు” అని వివరించారు.
అయితే, రియల్ ఎస్టేట్లో ఆర్ఈఐటీ అనే ఆప్షన్ ఉంది, దానిలో పెట్టుబడులు పెట్టుకోవచ్చని సూచించారు.

వృద్ధాప్యంలో లిక్విడ్ (వెంటనే డబ్బుగా మార్చుకోవడం) రూపంలోకి మారే ఆస్తుల్లో పెట్టుబడి పెట్టుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
తద్వారా, అవసరమైనప్పుడు వెంటనే విత్డ్రా చేసుకోవచ్చని సూచిస్తున్నారు. బ్యాంక్ ఎఫ్డీలు, మ్యూచువల్ ఫండ్లు, బంగారం, ఈటీఎఫ్లు వంటివి ఈ కేటగిరీలోకి వస్తాయి.
”దీర్ఘకాల ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే, వాటిల్లో ఏమేర లిక్విడిటీ (డబ్బును వెనక్కి తీసుకునే వెసులుబాటు) ఉందో చూసుకోవాలి. చాలాసార్లు, జీవితాంతం డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి కుదరదు. కేవలం వడ్డీ రూపంలో మాత్రమే ఆదాయం లభిస్తుంది” అని మెహుల్ షా తెలిపారు.
”వయసు పైబడిన వారికి అసలుకు భద్రత, ఆదాయ కచ్చితత్వం చాలా అవసరం. అంటే, మీకవసరమైనప్పుడు వెంటనే మీరు డబ్బులను పొందగలగాలి” అని ప్రియాంక్ ఠక్కర్ అంటున్నారు.
ఫొటో సోర్స్, Priyank Thakkar

ఆర్థిక నిపుణులు ఒక విషయాన్ని మాత్రం అంగీకరిస్తున్నారు. అదేంటంటే.. ఏ వయసులో పెట్టుబడి పెట్టినా, డైవర్సిఫికేషన్ ఉండాలని పేర్కొంటున్నారు.
ఒకే ఆస్తిలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకూడదు. మీ పోర్టుఫోలియోలో షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బంగారం వంటివి ఉంచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
వయసు పైబడిన వారు బాండ్లలో పెట్టుబడులు పెట్టుకోవాలని, మ్యూచువల్ ఫండ్స్లో తక్కువ లేదా మధ్యస్త రిస్క్ ఉన్న పథకాలు, సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్లలో పెట్టుబడి పెట్టుకోవాలని మెహుల్ షా సూచిస్తున్నారు.
(గమనిక: ఈ వ్యాసంలో అందించిన సమాచారం ఆర్థిక పరిజ్ఞానం కోసమే. దీనిని ఆర్థిక సలహాగా భావించకూడదు. పాఠకులు ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సొంతంగా పరిశోధన చేసి లేదా ఆర్థిక సలహాదారుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నాం. ఈ సమాచారం ఆధారంగా చేసిన పెట్టుబడుల వల్ల కలిగే ఏదైనా ఆర్థిక నష్టానికి BBC తెలుగు బాధ్యత వహించదు.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)



