SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Global Witness
ఇండోనేషియాలోని రాజా అంపట్ ద్వీపసమూహంలో కొన్నేళ్లుగా నికెల్ లోహం కోసం మైనింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి డ్రోన్ చిత్రాలను పర్యావరణ కార్యకర్తలు బీబీసీతో షేర్ చేసుకున్నారు.
ఆ ప్రాంతంలో మైనింగ్ ఎంతటి విధ్వంసం సృష్టిస్తుందో, నీటిని ఎలా కలుషితం చేస్తుందో ఈ ఫోటోలు చూపుతున్నాయి.
ప్రపంచంలోని అత్యంత జీవవైవిధ్య సముద్ర ప్రాంతాలలో రాజా అంపట్ ఒకటి.
“అమెజాన్ ఆఫ్ ది సీస్”గా పిలిచే ఈ ద్వీపసమూహం ఇండోనేషియాలోని నైరుతి పాపువా ప్రావిన్స్లో ఉంది.
నికెల్ను ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, స్టెయిన్లెస్ స్టీల్లో ఉపయోగిస్తారు. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో మైనింగ్ పెరిగిందని గ్లోబల్ విట్నెస్ సంస్థ పేర్కొంది.
ఈవారం, ఇండోనేషియా ప్రభుత్వం అక్కడి ఐదు మైనింగ్ కంపెనీలలో నాలుగింటికి అనుమతులను రద్దు చేసింది. ఈ చర్యను పర్యావరణ కార్యకర్తలు స్వాగతించారు.


ఫొటో సోర్స్, Global Witness
ప్రభుత్వం ఏమంటోంది?
రాజా అంపట్ జీవవైవిధ్యం ప్రపంచ సంపద అని, దానిని రక్షించాల్సిన అవసరం ఉందని ఇండోనేషియా పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అక్కడ మైనింగ్ కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నామనీ చెప్పింది.
కానీ, ఆ ప్రాంతంలో ఇప్పటికే జరిగిన నష్టాన్ని చూపించే ఫోటోలను గ్లోబల్ విట్నెస్ బయటపెట్టింది. అడవుల నరికివేత, పగడాలతో సమృద్ధిగా ఉన్న సముద్రాలలోకి బురద నీరు ప్రవహిస్తున్నట్లు ఫోటోలు చూపించాయి.
2020, 2024 మధ్య రాజా అంపట్లోని మైనింగ్ భూమి 500 హెక్టార్లకు (సుమారు 700 ఫుట్బాల్ మైదానాలు) విస్తరించిందని గ్లోబల్ విట్నెస్ సంస్థ బీబీసీతో చెప్పింది.
అయితే, మైనింగ్ కంపెనీలు కోర్టులో కేసు వేసి ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చే ప్రమాదం ఉందని గ్రీన్పీస్ సంస్థతో పాటు కొందరు పర్యావరణ పరిరక్షకులు ఆందోళన చెందుతున్నారు.
నికెల్ నిక్షేపాలు సమృద్ధిగా ఉన్న గాగ్ ద్వీపంలోని ఒక కంపెనీకి ప్రస్తుతం మైనింగ్ అనుమతి ఉంది. అయితే, అక్కడి పర్యావరణ నష్టాన్ని కంపెనీ ద్వారానే సరిదిద్దిస్తామని ప్రభుత్వం అంటోంది.
అనుమతుల రద్దుపై “చాలా సంతోషంగా” ఉన్నానని పగడపు దిబ్బల(కోరల్ రీవ్స్) నిపుణుడు డాక్టర్ మార్క్ ఎర్డ్మాన్ అన్నారు. ఆయన రాజా అంపట్లో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు.
రాజా అంపట్ “సముద్ర జీవవైవిధ్యానికి అంతర్జాతీయ కేంద్రం” అని ఎర్డ్మాన్ బీబీసీతో చెప్పారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న నష్టంపై గొంతెత్తిన ఇండోనేషియా ప్రజలను ఆయన అభినందించారు.
కాగా, ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీలలో ఉపయోగించే లోహాలకు పెరుగుతున్న డిమాండ్ ఎలా ప్రకృతికి హాని కలిగిస్తుందో ఈ వివాదం ఒక ఉదాహరణ.

ఫొటో సోర్స్, Global Witness
వరదలకూ కారణం..
ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ 2023 రిపోర్టు ప్రకారం, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వెలికితీస్తున్న నికెల్లో సగానికి పైగా ఇండోనేషియా నుంచే వస్తోంది.
రాజా అంపట్ అందం, జీవవైవిధ్యం ఈ సమస్యపై ప్రపంచ దృష్టిని ఆకర్షించినప్పటికీ, ఇండోనేషియాలోని ఇతర ప్రాంతాలలో కూడా ఇదే సమస్య ఉంది.
అడివికి మైనింగ్ వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని ఫారెస్ట్ వాచ్ ఇండోనేషియా-2024 అధ్యయనం తెలిపింది. స్థానికంగా మరిన్ని వరదలు, కొండచరియలు విరిగిపడటానికి ఈ మైనింగ్ కారణమైందని చెప్పింది.

ఫొటో సోర్స్, Global Witness
నికెల్ డిమాండ్తో..
ముఖ్యమైన ఖనిజాల డిమాండ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిర్ణయాలను ప్రభావితం చేస్తోంది. ఇదే అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ను అంతర్జాతీయ జలాల్లో లోతైన సముద్ర మైనింగ్ కోసం ఒత్తిడి చేయడానికి దారితీసింది. ఈ చర్య చట్టవిరుద్ధమని చైనా చెబుతోంది.
ఇండోనేషియా కఠిన సవాలును ఎదుర్కొంటుందని డాక్టర్ మార్క్ ఎర్డ్మాన్ అభిప్రాయపడ్డారు. దేశానికి ఆర్థిక వృద్ధి అవసరమే కానీ, దాని పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలని ఆయన సూచించారు.
“ఇక్కడ చాలా నికెల్ ఉంది. ఎలాగైనా, దానిలో కొంత భాగాన్ని తవ్వుతారు” అని ఎర్డ్మాన్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Global Witness
ఇండోనేషియాలో నికెల్ ఎక్కువగా ఉన్న సులవేసిలోని కమ్యూనిటీలలో మైనింగ్ ప్రభావంపై 2024లో కెంట్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ మైఖేలా గువో యింగ్ లో అధ్యయనం చేశారు.
మైనింగ్ వల్ల పేదరికంలో స్వల్ప తగ్గుదల కనిపించింది కానీ, పర్యావరణానికి హాని కూడా వాటిల్లిందని అధ్యయనం తెలిపింది. ఈ ప్రాంతంలో వాయు కాలుష్యం పెరిగిందని, నీరు కూడా ఎక్కువ చేరుతోందని చెప్పింది.
“ప్రపంచ నికెల్ మార్కెట్లో ఇండోనేషియా స్థానం సంపాదించుకుంటోంది కానీ, ఇది స్థానికంగా కలిగించే నష్టాన్ని మర్చిపోకూడదు” అని డాక్టర్ గువో యింగ్ అన్నారు.

ఫొటో సోర్స్, Global Witness
‘లోతట్టు తీరాలే’
జకార్తాలోని జాతం సంస్థకు చెందిన పర్యావరణ కార్యకర్త ఇమామ్ షోఫ్వాన్ బీబీసీతో మాట్లాడుతూ “వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి నికెల్ సహాయపడుతుందని వారంటున్నారు కానీ, అది అటవీ నిర్మూలనకు, వ్యవసాయ భూములకు నష్టం కలిగిస్తోంది” అని అన్నారు.
నికెల్ అధికంగా ఉన్న చాలా ప్రాంతాలు లోతట్టు తీరాలలోనివేనని, వాతావరణ మార్పు కారణంగా సముద్ర మట్టాలు పెరగడంతో అవి ఇప్పటికే ప్రమాదంలో ఉన్నాయని షోఫ్వాన్ హెచ్చరించారు.
మైనింగ్ ఎప్పుడూ ప్రకృతికి హాని కలిగిస్తుందని మార్క్ ఎర్డ్మాన్ అభిప్రాయపడ్డారు.
‘‘విద్యుత్ సాంకేతికత అవసరమే అయినప్పటికీ, మనం ఎంతవరకు పర్యావరణ నష్టాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నాం?’ అని ఆయన ప్రశ్నించారు.
ఈ విషయంపై స్పందించేందుకు ఇండోనేషియా ప్రభుత్వాన్ని బీబీసీ సంప్రదించింది, కానీ సమాధానం రాలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)