SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
5 గంటలు క్రితం
చదివే సమయం: 4 నిమిషాలు
ఇరాన్తో నేరుగా జరిపిన చర్చలతో భారత నౌకలు హార్ముజ్ జలసంధి మీదుగా వచ్చేందుకు మార్గం సుగమమైందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు.
ఈ కీలకమైన సముద్ర మార్గం ద్వారా నౌకల రాకపోకలను యథావిధిగా పునరుద్ధరించేందుకు యుద్ధనౌకలను పంపాలని డోనల్డ్ ట్రంప్ ఇతర దేశాలకు విజ్ఞప్తి చేసిన అదే సమయంలో, ఈ ప్రకటన కూడా వచ్చింది.
ఫైనాన్షియల్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జైశంకర్ మాట్లాడుతూ, భారత్ – ఇరాన్ చర్చల అనంతరం, శనివారం పర్షియన్ గల్ఫ్లోని హార్ముజ్ జలసంధి మీదుగా భారత జెండా కలిగిన రెండు గ్యాస్ ట్యాంకర్లు రాగలిగాయని అన్నారు.
“నేను ప్రస్తుతం వారితో (ఇరాన్) మాట్లాడుతున్నా, ఈ చర్చల వల్ల కొంత ఫలితముంది” అని ఆయన అన్నారు.

“భారత జెండా కలిగిన నౌకల రాకపోకలకు తాత్కాలిక లేదా శాశ్వత ఒప్పందమేమీ లేదు, ప్రతిఫలంగా ఇరాన్కు ఇచ్చిందేమీ లేదు” అని ఎస్. జైశంకర్ అన్నారు.
లిక్విడ్ నేచురల్ గ్యాస్తో వెళ్తున్న రెండు భారత ట్యాంకర్లు సురక్షితంగా హార్ముజ్ జలసంధిని దాటినట్లు వార్తలు వెలువడిన అనంతరం, చమురుతో వెళ్తున్న తమ ట్యాంకర్లు కూడా సురక్షింతంగా వెళ్లాయని ఇరాన్ అధికారులు ప్రకటించారు.
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ నేవీ కమాండర్ అలీరెజా తంగ్సీరీ భారత్ పేరు ప్రస్తావించకుండా.. ‘సముద్రంలో జరిగిన పోరాటంలో ఇరాన్ నేవీ సంకల్పం, చర్యలు సత్ఫలితాలిచ్చాయి. సరిహద్దుల నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఇరాన్ చమురును మోసుకెళ్తున్న ట్యాంకర్లను అనుమతించారు. బెదిరింపులు, ఆంక్షల ఎత్తివేతకు ఇది నిజమైన నమూనా’ అని ఎక్స్లో రాసినట్టు బీబీసీ పర్షియన్ పేర్కొంది.
జైశంకర్ ఏమన్నారు?
భారత్, ఇరాన్ మధ్య జరిగిన చర్చలతో భారత జెండా కలిగిన రెండు గ్యాస్ ట్యాంకర్లు శనివారం హార్ముజ్ జలసంధి మీదుగా రాగలిగాయని ఎస్.జైశంకర్ ఫైనాన్షియల్ టైమ్స్తో అన్నారు.
“నేను ప్రస్తుతం వారితో మాట్లాడుతున్నా, ఈ చర్చల వల్ల కొంత ఫలితముంది. ఈ చర్చల ప్రక్రియ కొనసాగుతోంది, ఫలితం ఉంటోంది కాబట్టి” అని ఆయన ఇంటర్వ్యూలో అన్నారు.
“భారత్ దృష్టిలో.. మనం చర్చలు జరపాలి, సమన్వయం చేసుకోవాలి, పరిష్కారం కనుగొనాలి. తద్వారా ఇతర దేశాలకు కూడా చర్చలకు మార్గం లభిస్తే, ప్రపంచానికి మరింత మంచి జరుగుతుంది” అని ఎస్.జైశంకర్ అన్నారు.
ఇంధన సరఫరాలను పునరుద్ధరించడానికి సాధ్యమైన దౌత్య పరిష్కారంపై తెహ్రాన్తో చర్చలు మొదలుపెట్టిన యూరోపియన్ దేశాలలో ఫ్రాన్స్, ఇటలీ కూడా ఉన్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది.
బ్రస్సెల్స్లో సోమవారం జరిగిన యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యే ముందు జైశంకర్ ఫైనాన్షియల్ టైమ్స్తో మాట్లాడారు.
భారత్ వంటి ఒప్పందాన్ని యూరోపియన్ దేశాలు చేసుకోగలవా లేదా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ” ప్రతి దేశ సంబంధాలు వేరు. కాబట్టి మరొకదేశ సంబంధాలతో పోల్చడం కష్టం. మేం ఏం చేస్తున్నామో యూరోపియన్ దేశాలతో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. వాటిలో చాలావరకు ఇరాన్తో చర్చలు జరిపాయని నాకు తెలుసు” అని అన్నారు.
“భారత జెండా ఉన్న నౌకలన్నీ రాకపోకలు సాగించేలా ఇరాన్తో ఒప్పందమేమీ లేదు, ప్రతి నౌకదీ ప్రత్యేకమైన కేసే” అని జైశంకర్ తెలిపారు.
అందుకు ప్రతిఫలంగా ఇరాన్కు ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదని, ఏమీ పొందలేదని, రెండు దేశాల మధ్యనున్న దీర్ఘకాల సంబంధాలే ఈ చర్చలకు ఆధారమని ఆయన అన్నారు.
“ఇది ఏ లావాదేవీకి సంబంధించిన విషయం కాదు. భారత్, ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు ఉన్నాయి. ఈ సంఘర్షణను మేం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం.”
“ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది, ఆ ప్రాంతంలో ఇంకా అనేక భారత నౌకలు ఉన్నాయి. అందువల్ల చర్చలు కొనసాగుతున్నాయి, ఆ దిశగా చర్చలు కొనసాగుతాయి” అని అన్నారాయన.
ఫొటో సోర్స్, AFP via Getty Images
ముడిచమురు ధరల పెరుగుదల
గతవారం ముడి చమురు ధరలు బ్యారెల్కు100 డాలర్ల(సుమారు రూ. 8,300) పైన ముగిశాయి. 2022 ఆగస్ట్ తర్వాత ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి.
ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడు మొజ్తబా ఖమేనీ చేసిన మొదటి ప్రకటనలో, హార్ముజ్ జలసంధిని ఆయుధంగా ఉపయోగిస్తామని చెప్పారు.
గతంలో ప్రపంచంలోని చమురు, గ్యాస్లో దాదాపు 20 శాతం ఈ మార్గం మీదుగానే వెళ్లేది.
భారత్ తన వినియోగంలో సుమారు 60% లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ను దిగుమతి చేసుకుంటోంది. అందులో దాదాపు 90% సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి గల్ఫ్ దేశాల నుంచి వస్తుంది.
ఈ ఇంధనంలో ఎక్కువ భాగం హార్ముజ్ జలసంధి గుండా వెళుతుంది.
భారత్లో 33 కోట్లకు పైగా ఇళ్లు వంట కోసం ఎల్పీజీపై ఆధారపడుతున్నట్లు ఒక అంచనా.
అనేక భారతీయ నగరాల్లో ఎల్పీజీ దుకాణాల బయట భారీ క్యూలు కనిపించాయి.
గ్యాస్ కొరత కారణంగా దేశంలో గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందనే ఆందోళనలు పెరగడంతో కొన్ని రెస్టారెంట్లు తాత్కాలికంగా మూసివేయాలని కూడా నిర్ణయించుకున్నాయి.
ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)



