SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, AP
వియత్నాం యుద్ధంలో నాపామ్ బాంబులతో గాయపడిన ఓ బాలిక బాధతోనూ, భయంతోనూ రోడ్డుపై దుస్తులు లేకుండా మిగిలిన పిల్లలతో కలిసి పరుగు పెడుతునప్పుడు తీసిన ఫోటోపై వివాదం అలుముకుంది.
వియత్నాం యుద్ధ తీవ్రతకు ప్రతీకగా నిలిచిన ఈ ఫోటో వియత్నాం ఫోటో జర్నలిస్టులకు ఒక గర్వకారణంగా, స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆ ఫోటో తీసిన నిక్ ఉట్కు పులిట్జర్ బహుమతి లభించింది. ఇప్పటిదాకా ఈ అవార్డు పొందిన ఏకైక వియత్నాం ఫోటోగ్రాఫర్ నిక్ ఉట్ మాత్రమే.
”చారిత్రక క్షణాన్ని బంధించేందుకు నిక్ ఉట్ను కాలం ఎన్నుకుంది’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని వియత్నాం ఫోటోగ్రాఫర్ ఒకరు చెప్పారు.
గురువుస్థాయిలో గౌరవం అందుకునే నిక్ ఉట్ తరచుగా స్వదేశానికి వెళ్లి వియత్నాం ఫోటో జర్నలిస్టులకు ఫోటోగ్రఫీలో టెక్నిక్స్ చెబుతుంటారు.
అయితే నాపామ్ గర్ల్ అనే చరిత్రాత్మక ఫోటో తీసి 50 ఏళ్లు గడిచిపోయింది. కానీ ఇన్నేళ్ల తరువాత ఈ ఫోటో ఎవరు తీశారనే విషయాన్ని ‘ది స్ట్రింగర్’ అనే కొత్త డాక్యుమెంటరీ సవాలు చేసింది. జనవరిలో జరిగిన సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించారు.


ఫొటో సోర్స్, Getty Images
డాక్యుమెంటరీలో ఏముంది?
ఈ ఫోటోను తీసింది నింగ్వెన్ హాన్ ఎన్ అనే ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ అని ఆధునిక సాంకేతిక సాయంతో ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నింగ్వెన్ వయసు 87 ఏళ్లు.
ఆ డాక్యుమెంటరీ తర్వాత వరల్డ్ ప్రెస్ ఫోటో(డబ్ల్యుపీపీ) దర్యాప్తు ప్రారంభించింది. ఆ ఫోటో తీసింది నిక్ ఉట్ అనే ఘనతను ఆపాదించడాన్నినిలిపివేసింది. ఇది ఫోటో జర్నలిజం వర్గాలలో తీవ్ర అలజడి సృష్టించింది.
”ఒక హీరో స్థాయి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి, అందుకు ఒప్పించగల సాక్ష్యాలుండాలి” అని ఒక వియత్నాం ఫోటో జర్నలిస్ట్ బీబీసీకి చెప్పారు.
ఈ డిజిటల్ కాలంలో ఒక ఫోటో ఆ స్థాయిలో ప్రభావం చూపడం అరుదని ఆయన అభిప్రాయపడ్డారు. ”మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వివాదం అంతటి ప్రాముఖ్యమున్న ఫోటో గొప్పతనాన్ని దెబ్బదీయకూడదు. ఎవరికీ బాధ కలిగించకూడదు”
”ఆ ఫోటో ఎవరు తీశారన్నది ప్రశ్న కాదు. ఆ వివాదం భావోద్వేగానికి కారణమవుతుంది. ఎందుకంటే ఆ ఫోటోగ్రాఫర్ పేరు కూడా ‘చరిత్రలో భాగం”’ అని కీత్ గ్రీన్వుడ్ చెప్పారు. మిస్సోరి యూనివర్శిటీలో ఆయన ఫోటో జర్నలిజం అసోసియేట్ ప్రొఫెసర్.
”ఆ యుద్ధం చరిత్ర చాలా సంక్లిష్టమైనది. ఇప్పటికీ బలమైన భావోద్వేగాలను కలిగిస్తుంది. ఆ ఫోటోను ప్రశ్నించడం వల్ల ఆ భావోద్వేగాల్లో కొన్నింటిని కూడా ప్రశ్నించినట్టవుతుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.
వీడియోలో మసక మసకగా కనిపిస్తున్న వ్యక్తిని ఉట్గా భావిస్తున్నారు. ఆయన ”నాపామ్ గర్ల్”కు కాస్త దూరంలో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images/World Press Photo
ఫోటో ఎలా తీశారంటే..
దక్షిణ వియత్నాం వైమానిక దళం 1972 జూన్ 8న ట్రాంగ్ బాంగ్ గ్రామంపై నాపామ్ దాడిచేసిన తర్వాత ఈ ఫోటో తీశారు. ఫోటోలో కీలకంగా కనిపించే కిమ్ ఫుక్ నాపామ్ దాడి జరిగిన సమయంలో ఆలయ ఆవరణలో తన సోదరునితోనూ, కజిన్స్తోనూ ఆడుకుంటున్నారు.
ఆ సమయంలో ఉట్ అసోసియేటెడ్ ప్రెస్(ఏపీ)లో పనిచేస్తున్నారు. పేలుడు తర్వాత గ్రామస్థులు దగ్గరలోని హైవే వెంట పరుగులు తీశారని ఆయన చెప్పారు. తొలుత మృతశిశువును చేతుల్లో పట్టుకున్న ఓ అమ్మమ్మను ఫోటో తీసిన తర్వాత ఉట్, కిమ్ ఫుక్ గాల్లో చేతులూపుతూ పరిగెత్తడాన్ని చూశారు.
ఫోటోలు తీసేందుకు ఆయన బాలిక వైపు పరుగులు తీశారు. ఆమె చర్మం కాలిపోయి, తోలు ఊడిపోతోందని అప్పుడాయన గుర్తించారు. తర్వాత ఆయన బాలికపై నీళ్లు చల్లారు. పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్లారు.
డిజిటల్ కెమెరాలు, ఫోటోగ్రాఫర్ల కాలానికి ముందు ఫ్రీ లాన్సర్లయినా, స్టాఫర్లయినా తమ ఫిల్మ్లను ఆఫీసులో ఇవ్వాలి. డార్క్ రూమ్ ఎడిటర్ ఆ ఫిల్మ్లు ఎవరెవరు ఇచ్చారో లాగ్బుక్లో రికార్డు చేస్తారు. అయితే ప్రధాన కార్యాలయానికి ఏ ఫోటో పంపించాలో ఫోటో చీఫ్ నిర్ణయిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫోటో తీసింది స్టాఫరా…ఫ్రీ లాన్సరా..
”నేను ఆఫీసుకు తిరిగి వెళ్లగానే..’నా దగ్గర చాలా ప్రత్యేకమైన ఫోటో’ ఉందని నేను పెద్దగా అరిచా. అందరూ నా వైపు తిరిగి చూశారు.’’ అని ఉట్ జనవరిలో బీబీసికి చెప్పారు. డార్క్రూమ్ ఎడిటర్ యుయిచి జాక్సన్ ఇషిజకి మాత్రమే ఫోటో డెస్క్ దగ్గర ఉన్నారని ఉట్ తెలిపారు. ఇషిజకి ఫిల్మ్ను డెవలప్ చేస్తున్నప్పుడు ఉట్ ఆయన పక్కనే ఉన్నారు. ఇషిజకి తర్వాత ఆ ఫిల్మ్కి ఉట్ పేరు లేబుల్ వేశారు. ఫోటో తయారయింది.
”ప్రతి ఒక్కరూ ఆ ఫోటో చూశారు. మధ్యాహ్న భోజనానికి వెళ్లిన మా ఫోటో చీఫ్ హోస్ట్ ఫాస్ను త్వరగా వెనక్కి రావాలంటూ ఎవరో పిలిచారు” అని ఉట్ గుర్తుచేసుకున్నారు.
ఫోటో ఎడిటర్ కార్ల్ రాబిన్సన్ రావడం కంటే ముందే ఫాస్ వచ్చారు. ఈ ఫోటోను బయటపెట్టాలా లేదా అనేదానిపై వాదన జరిగింది. తరువాత రాబిన్సన్..ఫోటోలో నగ్నత్వం ఉందని, ఈ ఫోటోను బయటకు తేకూడదని వాదించారు. కానీ ఆ వాదనను మిగిలినవారు అంగీకరించలేదు.
కానీ రాబిన్సన్ బీబీసీ దగ్గర పూర్తి భిన్నమైన వాదన వినిపించారు.
ఇషిజకీ, ఓ టెక్నీషియన్ను మాత్రమే తాను లంచ్ తర్వాత డార్క్ రూమ్లో చూశానని ఆయన చెప్పారు. అప్పటికే ఫిల్మ్స్ను డెవలప్ చేసి, రివ్యూ కోసం ఉంచారు. ఒకే విధమైన రెండు ఫోటోలున్నాయి. ఒకటి సైడ్ యాంగిల్ నుంచి తీసిన ఫోటో కాగా, ఇంకొకటి ముందు నుంచి తీసింది. ఇద్దరు ఫోటోగ్రాఫర్లు రెండు వేరు వేరు ఫిల్మ్ రోల్స్ ఇచ్చారని చెప్పారు.
లాగ్బుక్లో అంతగా పరిచయం లేని పేరును రాబిన్సన్ చూశారు, ఆ ఫ్రీలాన్సర్ అసోసియేటెడ్ ప్రెస్కు అంత ఎక్కువగా పనిచేయడం లేదు. ”వియత్నాం స్ట్రింగర్ల మీద మాకు సమగ్ర అవగాహన ఉంది. వాళ్లు సాధారణ పౌరులు లేదా కొన్నిసార్లు అదనపు ఆదాయం సంపాదించే సైనికులు” అని ఆయన చెప్పారు.
కాసేపటి తర్వాత ఫాస్ తిరిగి వచ్చారని, ఏ ఫోటో పంపాలనే వాదనేమీ జరగలేదని రాబిన్సన్ చెప్పారు. ఫోటో ఎంపిక ప్రక్రియ సమయంలో ఉట్ అక్కడ లేరని చెప్పారు ‘‘నిర్ణయం కోసం ఎదురుచూస్తూ తలుపు బయట ఆయనేమీ నిల్చుని లేరు’’ అని తెలిపారు.
తాను ఫోటోకు క్యాప్షన్ రాస్తున్నప్పుడు ఫాస్ తనకు దగ్గరగా వచ్చి అసోసియేటెడ్ ప్రెస్ స్టాఫర్ అయిన ఉట్కు క్రెడిట్ ఇవ్వాలని తన చెవిలో చిన్నగా చెప్పినట్టు రాబిన్సన్ చెప్పారు. ”దీన్ని సవాలు చేసే ధైర్యం నాకు లేదు. ఎందుకంటే వియత్నామీ అయిన నా భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నేను సైగన్లో ఉండాలనుకుంటున్నా” అని ఆయన తెలిపారు.
తర్వాత ఫాస్, ఇషిజాకి ఇద్దరూ చనిపోయారు. నిక్ ఉట్, కిమ్ పుక్ 2022లో నాపామ్ గర్ల్ ఫోటో 50వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి పోప్ ఫ్రాన్సిస్ను కలిశారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఏ పరిణామాన్నయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా’
రాబిన్సన్ ఈ విషయంలో దశాబ్దాలుగా అన్యమనస్కంగానే ఉన్నారు. ఆ ఫోటోగ్రాఫర్కు క్షమాపణ చెప్పాలని అనుకున్నారు. ”కానీ ఆయన పేరు నాకు గుర్తు లేదు. 2015లో అసోసియేటెడ్ ప్రెస్ మాజీ ఉద్యోగి సాయంతో ఆయన పేరు నింగ్వెన్ అని గుర్తించగలిగాం గానీ, ఆయన ఎక్కడున్నారో మాత్రం కనిపెట్టలేకపోయాం” అని రాబిన్సన్ తెలిపారు.
. ”నేను దీన్నంతటినీ ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నా. నేను దీన్నుంచి వెనక్కి వెళ్లలేను. మర్చిపోలేను.” అని రాబిన్సన్ అన్నారు.
రాబిన్సన్ మరో ఫోటో జర్నలిస్ట్ గేరీ నైట్ను కలుసుకున్నారు. ఆయన్ను ఇంటర్వ్యూ చేయడానికి గేరీ నైట్ ఒప్పుకున్నారు. ద స్ట్రింగర్ అలా ప్రారంభమయింది.
కొన్ని రోజుల తర్వాత ఆ బృందం నింగ్వెన్ను కనుగొంది. సైగన్ పతనం తర్వాత ఆయన శరణార్థిలా అమెరికా వెళ్లారు. అయితే 2002లో ఆయన తిరిగి స్వదేశానికి వచ్చారు.
”నేను మౌనంగా ఉన్నా. మాట రావడం లేదు. బాధతో ఉన్నా-భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతున్నా” అని నింగ్వెన్ చెప్పారు. ”నిజం కన్నా ఏదీ ముఖ్యమైనది కాదు.”

ఫొటో సోర్స్, Getty Images
దర్యాప్తులో ఏం తేలింది?
ఈ డాక్యుమెంటరీ గురించి తెలిసిన తర్వాత అందుబాటులో ఉన్న ఫుటేజ్ ఆధారంగా అసోసియేటెడ్ ప్రెస్ సొంత దర్యాప్తు మొదలుపెట్టింది. జీవించి ఉన్న సాక్షులతో ఇంటర్వ్యూలు, ఉట్ కెమెరాల పరిశీలన వంటివి చేసింది. జనవరి, మేనెలల్లో అది రెండు రిపోర్టులు ప్రచురించింది.
ఫోటో క్రెడిట్కు ఉట్ పేరు తొలగించడానికి కచ్చితమైన ఆధారాలు లేవని ఆ నివేదికల్లో తేలింది.
అయితే దీనిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
పెంటాక్స్ కెమెరాతో ఆ ఫోటో తీసి ఉండొచ్చని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. అయితే ఉట్ చెప్పింది దీనికి భిన్నంగా ఉంది. ఆ రోజు తన దగ్గర రెండు లీకా, రెండు నికోన్స్ కెమెరాలు ఉన్నాయని, లీకా కెమెరాతో ఆ ఫోటో తీశానని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. అసోసియేటెడ్ ప్రెస్ ప్రశ్నించినప్పుడు కెమెరా ఏ మోడల్ అన్నదానిపై తాను దృష్టిపెట్టలేదని, అయితే ఆ ఫోటో లీకా రోల్ నుంచి వచ్చిందని ఫాస్ తనకు చెప్పారని ఉట్ సమాధానమిచ్చారు.
ఆ రోజు ఎంఘే చేతిలో పెంటాక్స్ పోలిన కెమెరా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
అసోసియేటెడ్ ప్రెస్ వాదనేంటి?
ప్రస్తుతమున్న ఫుటేజ్, ఫోటోలు, శాటిలైట్ ఇమేజ్ల ఆధారంగా అసోసియేటెడ్ ప్రెస్, డాక్యుమెంటరీ అప్పటి టైమ్లైన్ను పునర్నిర్మించే ప్రయత్నం చేసింది. ‘‘నాపామ్ గర్ల్’ ఫోటో తీసిన వెంటనే చిత్రీకరించిన వీడియో ఫుటేజ్లో ఓ వ్యక్తి మసక మసకగా కనిపిస్తున్నారు. ఆయన్ను ఉట్గా భావిస్తున్నారు. పిల్లలకు ఆయన కొంచెం దూరంలో ఉన్నారు. వీడియో కెమెరాకు ఉట్ 60మీటర్ల దూరంలో ఉన్నట్టు డాక్యుమెంటరీ ఆరోపించింది. ఫోటో తీసిన తర్వాత ఉట్ అక్కడినుంచి పరుగు తీసుండాలి.
ఆ వ్యక్తి ఉట్ అయి ఉంటారనే వాదనతో అసోసియేటెడ్ ప్రెస్ అంగీకరించలేదు. 28.8 నుంచి 48 మీటర్ల మధ్య దూరాన్ని 20శాతం ఎర్రర్గా మార్క్ చేసింది. దూరం లెక్కింపుపై అనేక అంశాలు ప్రభావం చూపిస్తాయని, డాక్యుమెంటరీ కూడా కొంత ఫుటేజ్ను చూపించలేదని, దర్యాప్తులో ఉపయోగించిన రెండు సెట్ల ఫోటోలకు యాక్సెస్ లేదని అసోసియేటెడ్ ప్రెస్ వాదించింది.

ఫొటో సోర్స్, Getty Images
వివాదం ప్రస్తుతం ఏ దశలో ఉంది?
ఫోటోగ్రాఫర్ గుర్తింపుపై అసోసియేటెడ్ ప్రెస్గానీ, డబ్ల్యూపీపీగానీ ఎలాంటి నిర్థరణకు రాలేదు. ఇంకో ఫోటోగ్రాఫర్ సైతం ఫోటో తీసి ఉండొచ్చన్న అంశాన్ని డబ్ల్యుపీపీ లేవనెత్తింది.
ఆ డాక్యుమెంటరీపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘటనాస్థలంలో ఉన్న అనేకమంది జర్నలిస్టులు డాక్యుమెంటరీ చెబుతున్న విషయాలు ఆధారరహితమంటూ కొట్టిపారేస్తున్నారు. ఫిల్మ్లో భాగమయ్యేందుకు వారు నిరాకరిస్తున్నారు.
మరి ఫోటో ప్రింట్ సంగతేంటి? ఫాస్ తనకు ఒక ప్రింట్ ఇచ్చారని నింగ్వెన్ చెప్పారు. నిరాశా నిస్పృహల్లో ఉన్న తన భార్య దాన్ని చించేసిందని చెప్పారు.
ప్రచురితమైన ఫోటోకు హక్కులు తనవే అని ఉట్ భావిస్తున్నారు. పరువునష్టం దావా వేయాలనుకుంటున్నారు.
”ఈ ఫోటో వెనక నిజమేంటో తెలుసుకోవాలని ప్రజలు సహజంగా కోరుకుంటున్నారు” అని పేరు చెప్పడానికి ఇష్టపడని వియత్నాం ఫోటోగ్రాఫర్ అన్నారు. నిజంగా ఏం జరిగిందన్నది తెలుసుకోవడానికి మరింత సమయం, మరిన్ని ఆధారాలు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఫోటో తీసిన అనేక దశాబ్దాల తర్వాత కూడా నాపమ్ ఫోటో అంతే ప్రభావవంతంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ ఫోటో ఎవరు తీశారనే ఆరోపణలు మిస్టరీగా మారాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)