SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో ప్రీ ప్రైమరీ(పూర్వ ప్రాథమిక) విద్యను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26) నుంచే ఈ తరగతులు ప్రారంభం కానున్నాయి. తొలిదశలో 12 జిల్లాల్లోని 210 పాఠశాలల్లో వీటిని ప్రారంభిస్తున్నారు.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ జూన్ 11వ తేదీన ఆదేశాలు జారీ చేసింది.
”ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు ఎంపిక చేసిన పాఠశాలల్లో సంబంధిత ప్రధానోపాధ్యాయులు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించామని’’ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి బీబీసీతో చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
వయసుకు తగ్గట్టుగా తరగతుల ఎంపిక
సాధారణంగా ప్రీ ప్రైమరీలో నర్సరీ, ఎల్కేజీ (లోయర్ కిండర్ గార్టెన్), యూకేజీ(అప్పర్ కిండర్ గార్టెన్) తరగతులు ఉంటాయి.
కేంద్ర విద్యాశాఖ ఆదేశాల ప్రకారం ఒకటో తరగతిలో చేరే పిల్లలకు 6 ఏళ్లు నిండి ఉండాలి. దాని ప్రకారం నర్సరీలో చేర్చుకునే పిల్లల వయసు 3ఏళ్లు, ఎల్కేజీకి 4 ఏళ్లు, యూకేజీకి 5 ఐళ్లు నిండి ఉండాలి.
ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ నర్సరీలో చేర్చుకుంటారా, లేదా అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు.
ఇక ఈ తరగతులకు సిలబస్ ఎలా ఉంటుందనే విషయంపై “సాధారణంగా ప్రీ స్కూల్ దశలో నేర్పించే పాఠాలే ఇక్కడా బోధిస్తారు. పిల్లలకు ఆటపాటలతో బోధన ఉంటుంది. ఇందుకోసం సిలబస్ రూపొందుతోంది.” అని నర్సింహా రెడ్డి చెప్పారు.
ఈ విద్యా సంవత్సరంలో యూకేజీని ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉందని సమగ్ర శిక్ష అధికారులు చెబుతున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కానీ, నర్సరీ నుంచే తరగతులు ప్రారంభించే అవకాశం ఉందని బీబీసీతో చెప్పారు తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి.
”మేం గతంలో తెలంగాణలో విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. అందులో నర్సరీ నుంచి తరగతులు ప్రారంభించాలని సూచించాం. దాని ప్రకారమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం.” అని చెప్పారు.
ఈ ఏడాది యూకేజీ తరగతులు ప్రారంభించి, వచ్చే విద్యా సంవత్సరం నుంచి నర్సరీ తరగతులు ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉందని సమగ్ర శిక్ష అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.
యూకేజీలో గరిష్ఠంగా 30 మంది పిల్లల వరకు చేర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
వెయ్యి స్కూళ్లలో ప్రారంభించేలా ప్రణాళిక
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు దాదాపు వెయ్యి స్కూళ్లకు అనుమతి ఇవ్వాలని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను ఆదేశించారు. ఇందులో భాగంగా తొలివిడతలో 210 స్కూళ్లను ఎంపిక చేసినట్లుగా విద్యాశాఖాధికారి ఒకరు చెప్పారు.
త్వరలో మిగిలిన స్కూళ్లలో కూడా ప్రారంభించే ఆలోచనలో ఉంది విద్యాశాఖ. ఆ స్కూళ్లలో పిల్లలకు బోధించేందుకు ఒక విద్యా వాలంటీరు, ఒక ఆయాను నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రధానంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల చేరికను పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది.
ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ ప్రారంభిస్తే విద్యార్థుల సంఖ్య తప్పకుండా పెరుగుతుందని సికింద్రాబాద్ ఓల్డ్ నల్లగుట్ట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిన్నా బత్తిని శౌరి అభిప్రాయపడ్డారు. ఆయన తను పనిచేసే పాఠశాలల్లో స్వచ్ఛందంగా ప్రీ ప్రైమరీ ప్రారంభించడం ద్వారా విద్యార్థుల సంఖ్యను పెంచారు.
”2018లో ఓల్డ్ నల్లగుట్ట పాఠశాలకు నేను బదిలీపై వచ్చినప్పుడు ఇక్కడ 68 మంది పిల్లలు ఉండేవారు. ప్రీ ప్రైమరీ ప్రారంభించడంతో ఇప్పుడు విద్యార్థుల సంఖ్య 334కు చేరింది.” అని శౌరీ చెప్పారు. 2012లో కూడా ఆయన న్యూ బోయగూడలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించారు. దీనివల్ల మొదట్లో అక్కడ 70-80 మంది విద్యార్థులుండగా, తర్వాత రెండేళ్లలోనే ఆ సంఖ్య 280 మందికి చేరుకుంది.
”ప్రీ ప్రైమరీ తరగతులు ఉన్నట్లుగా తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలి. పిల్లలకు వారి వయసుకు తగ్గట్టుగా ఆటపాటలతో కూడిన బోధన అందించాలి. ఇలాంటివి మా పాఠశాలల్లో అమలు చేస్తుండటంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.” అని చెప్పారు శౌరి. ఈ ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు గతంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఎటువంటి నిధులు కేటాయించేది కాదు. స్వచ్ఛంద సంస్థల సాయంతో వాటిని నడిపించినట్లుగా శౌరి చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
అంగన్వాడీల పరిస్థితి ఏమిటి?
సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ప్రాథమిక పాఠశాలలు నడుస్తుంటాయి. పూర్వ ప్రాథమిక విద్య కోసం ప్రభుత్వ విభాగంలో అంగన్వాడీలు ఉన్నాయి.వీటిలో పనిచేసే సిబ్బంది విద్యార్థులకు అక్షరబుద్ధులు నేర్పేందుకే పరిమితం కాకుండా మిగిలిన పనులు కూడా ఉండటం వల్ల పిల్లలపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించే అవకాశం లేకుండా ఉందని విద్యా నిపుణులు చెబుతున్న మాట.
”అంగన్వాడీలో సిబ్బందికి ఆరు కేటగిరీల్లో విధులు కేటాయించారు. కేవలం ప్రీ స్కూల్ కోసమే వారు పనిచేయడం లేదు. గ్రామం లేదా వార్డు పరిధిలో గర్భిణులకు సేవలందించడం సహా వివిధ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. వీరిలో ఎక్కువమంది పదో తరగతి వరకు చదివిన వారే ఉన్నారు.” అని ఆకునూరి మురళి బీబీసీతో చెప్పారు.
అంగన్వాడీలకు పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని చెబుతున్నారాయన. ఏ మాత్రం డబ్బు ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉన్నా ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తున్నారు. అక్కడ నర్సరీలో చేర్పిస్తే, తర్వాత ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత తరగతులు కూడా ప్రైవేటు పాఠశాలల్లోనే చదువుతున్నారు.
” ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ స్కూల్ తరగతులు లేకపోవడంతో ఈ పాఠశాలలకు వచ్చే సంఖ్య కూడా తగ్గిపోతోంది. ఒక్కసారి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటుస్కూల్స్లో చేర్పిస్తే, అందులోనే కొనసాగిస్తున్నారు.” అని ఆకునూరి మురళి వివరించారు.

ఫొటో సోర్స్, UGC
ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభం
ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించడం మంచి నిర్ణయమే అయినా విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక మొదలుపెట్టడంపై తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
”పాఠశాలలు ప్రారంభించాక ప్రీ ప్రైమరీకి అడ్మిషన్లు తీసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్పించి ఉంటారు.” అని హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి సాయినాథ్ చెప్పారు.
పాఠశాలల ప్రారంభానికి కేవలం ఒక్కరోజు ముందు ప్రభుత్వం ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రీ ప్రైమరీ తరగతులకు అడ్మిషన్లు పూర్తవుతున్నాయి. దీనివల్ల ఎంత మంది పిల్లలు ఆయా పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులలో చేరతారనేది ప్రశ్నార్థకంగా మారింది.
తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించి పిల్లలను చేర్పించాల్సిన అవసరం ఉందని ఆకునూరి మురళి అభిప్రాయపడ్డారు.
విద్యా వాలంటీర్లతోనే..
ప్రీ ప్రైమరీ తరగతులు బోధించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు అందుబాటులో లేరు. విద్యా వాలంటీరును తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుండగా.. వారి నియామకాలు పూర్తి కావాల్సి ఉంది. అంతేకాదు, ప్రీ ప్రైమరీ విద్యార్థులకోసం ప్రత్యేక శిక్షణ కూడా అవసరం.
‘‘గతంలో ఎలిమెంటరీ గ్రేడ్ టీచర్లు పాఠశాలల్లో అందుబాటులో ఉండేవారు. వారికి ప్రత్యేకంగా చిన్నపిల్లలతో ఏ విధంగా మసలుకోవాలి..? వారికి ఏ విధంగా బోధించాలి..? వంటి అంశాలపై శిక్షణ ఉండేది. ఇప్పుడు నేరుగా విద్యా వాలంటీరు, ఆయాను నియమించి బోధన ప్రారంభించాలనుకుంటే, పిల్లలతో మెలిగే విధానంపై వారికి అవగాహన ఉండదు’’ అని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫ్రంట్(టీపీటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి ముత్యాల రవీందర్ బీబీసీతో అన్నారు.
”ఇప్పటికే పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. ముందుగా ప్రీ ప్రైమరీకి బోధించేలా ఎలిమెంటరీ ట్రైయిన్డ్ టీచర్లను నియమించాలి.” అని చెప్పారు. ఉపాధ్యాయులను నియమించి, చిన్న పిల్లల పరంగా అవసరమైన సౌకర్యాలు కల్పించిన తర్వాత ప్రీ ప్రైమరీ ప్రారంభించాలని ముత్యాల రవీందర్ తెలిపారు.
అలాగే ప్రీ ప్రైమరీ తరగతుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే పిల్లలకు అవసరమైన వసతులు కల్పించేందుకు వీలవుతుందని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో విద్యా ముఖచిత్రం ఇలా..
మొత్తం పాఠశాలలు – 41293
ప్రైవేటు పాఠశాలలు – 11,154
ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు – 26107
మేనేజ్మెంట్ పాఠశాలలు – 4,032
మొత్తం విద్యార్థులు – 60,22,484
ప్రైమరీ తరగతులు – 30,10,580
అప్పర్ ప్రైమరీ – 18,52,315
హయ్యర్ – 11,59,589
మొత్తం విద్యార్థులలో 60.76శాతం ప్రైవేటు విభాగంలో చదువుతుండగా, 38.11శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ విభాగంలోని పాఠశాలల్లో చదువుతున్నారు. మరో 1.08శాతం మంది ఎయిడెడ్ విభాగంలో, 0.05శాతం మంది ఇతర మేనేజ్మెంట్ పరిధిలో చదువుతున్నారు.
ఆధారం: కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, తెలంగాణ
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)