SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మకోచి ఒకఫర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
-
4 జూన్ 2025
హెచ్చరిక: ఈ కథనంలో కొత్తగా జన్మించిన శిశువును వర్ణించే చిత్రం ఉంది
24 ఏళ్ల వయసులో నఫిసా సలహు నైజీరియాలో ప్రమాదకరమైన పరిస్థితి సూచించే గణాంకాల్లో భాగం కాబోతున్నారు. ఇక్కడ బిడ్డకు జన్మనిచ్చే మహిళల్లో సగటున ప్రతి 7 నిముషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఆసుపత్రిలో ఉన్నప్పటికీ, డాక్టర్లు సమ్మె చేస్తున్నప్పుడు లేబర్ రూమ్లోకి వెళ్లడం ప్రమాదంలాంటిదే. ఉత్తర నైజీరియాలోని కనో రాష్ట్రానికి చెందిన సలహు అలాంటి ప్రమాద స్థితిలోకి వెళ్లారు.
లేబర్ రూమ్లో ఆమె బిడ్డకు జన్మనిస్తున్నప్పుడు ఆ బిడ్డ తల ఇరుక్కుపోయింది. మూడు రోజులు ఆమె అలాగే లేబర్రూమ్లో ఉండాల్సి వచ్చింది.
బిడ్డను బయటకు తీసేందుకు సిజేరియన్ చేయాలని సూచించారు. ఆపరేషన్ చేసేందుకు ఒక డాక్టర్ను పట్టుకోగలిగారు.
“నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. దాదాపు చావు దగ్గరికి వెళ్లొచ్చాను. శరీరంలో శక్తేమీ మిగల్లేదు” అని బీబీసీతో అన్నారు సలహు.
ఆమె ప్రాణాలతో బయట పడ్డారు. కానీ బిడ్డ చనిపోయింది.
11 ఏళ్లు గడిచాయి. అనేకసార్లు బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆమె అదే హాస్పిటల్కు వెళ్లారు. ప్రతీసారి ప్రాణాంతక పరిస్థితులే ఎదురయ్యాయి.
“నాకు తెలుసు. ప్రతీసారి నేను చావు బతుకుల మధ్య ఉంటానని. అయితే భయపడలేదు” అని ఆమె చెప్పారు.
సలహు అనుభవం అక్కడ అసాధారణం ఏమీ కాదు.

అన్నింటికీ కొరతే
బిడ్డకు జన్మనిచ్చేందుకు నైజీరియా ప్రపంచంలోనే ప్రమాదకరమైన దేశం.
2023లో నైజీరియా విడుదల చేసిన లెక్కలను బట్టి, ఐక్యరాజ్య సమితి తాజా అంచనాల ప్రకారం…ప్రతీ వందమంది మహిళల్లో ఒకరు లేబర్ రూమ్లో లేదా ఆ తర్వాత చనిపోతున్నారు.
ఈ పోటీలో ఏ దేశం కూడా కోరుకోని అగ్రస్థానంలో నైజీరియా నిలిచింది.
2023లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ప్రసూతి మరణాల్లో 29శాతం నైజీరియాలోనే జరిగాయని తేలింది.
దీని ప్రకారం…ఒక ఏడాదిలో మొత్తం 75వేల మంది బిడ్డకు జన్మనిచ్చే సమయంలో చనిపోయారు. ఇది ప్రతీ 7 నిముషాలకు ఒకరి మరణాన్ని సూచిస్తోంది.

ఫొటో సోర్స్, Henry Edeh
రక్తస్రావం వల్లే ఎక్కువ మరణాలు
ఈ మరణాల్లో చాలా వరకు పిల్లలు పుట్టిన తర్వాత రక్త స్రావాన్ని ( ప్రసవానంతర రక్తస్రావం) ఆపలేకపోవడంలాంటి చిన్నచిన్న కారణాలతోనే కావడం చాలామందికి బాధ కలిగిస్తోంది.
ఐదేళ్ల క్రితం ఈశాన్య నైజీరియాలోని ఒంటిషా అనే పట్టణంలోని ఆసుపత్రిలో చినిన్యే న్వీజే అనే 36 ఏళ్ల మహిళ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత రక్తస్రావంతో చనిపోయారు.
“వైద్యులు రక్తం కావాలని చెప్పారు. వాళ్ల దగ్గరున్నది సరిపోలేదు. చాలా ప్రయత్నించారు. నా సోదరిని, ఒక మంచి స్నేహితురాలిని కోల్పోయా. నా కష్టం పగవాళ్లకు కూడా రాకూడదు” అని ఆమె సోదరుడు హెన్రీ ఈడెహ్ గుర్తు చేసుకున్నారు.
ఇష్టారీతిగా చేస్తున్న అబార్షన్లు, అధిక రక్తపోటు, ప్రసవ సమయంలో ఇబ్బందులు లాంటివి ప్రసూతి మరణాలకు కారణాల్లో మరికొన్ని.
నైజీరియాలో ప్రసూతి మరణాలు చాలా ఎక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయని ఆ దేశంలోని యునిసెఫ్ కార్యాలయంలో హెల్త్ మేనేజర్గా పని చేస్తున్న మార్టిన్ దోల్స్టెన్ చెప్పారు.
పేలవమైన మౌలిక వసతులు, వైద్యుల కొరత, ఖరీదైన వైద్యం, డాక్టర్లను విశ్వసించకుండా సురక్షితంకాని సంప్రదాయ పద్దతుల్ని పాటించడం వంటివి వాటిలో కొన్ని అని ఆయన చెప్పారు.
“బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు చనిపోవాలని ఏ మహిళా కోరుకోదు. ఆసుపత్రులకు వెళ్లడం వల్ల సమయం వృధా అని కొంతమంది గ్రామీణ మహిళలు భావిస్తున్నారు. దానికి బదులు ప్రాణాలకు ప్రమాదకరమైన సంప్రదాయ ప్రసవ విధానాలవైపు మళ్లుతున్నారు’’ అని విమెన్ ఆఫ్ పర్పస్ డెవలప్మెంట్ ఫౌండేషన్ సమన్వయకర్త మాబెల్ ఒన్యుమెనా అన్నారు.
రవాణా సౌకర్యం లేకపోవడంతో కొంతమంది మహిళలు ఆసుపత్రికి రాలేకపోతున్నారు. అయితే వారు కాస్త ముందుగా ప్లాన్ చేసుకుంటే సమస్యలు రాకుండా చూసుకోవచ్చని ఒన్వుమెనా భావిస్తున్నారు.
“చాలా ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేవు, ఔషధాలు లేవు. సుశిక్షితులైన సిబ్బంది లేరు. నాణ్యమైన సేవల్ని అందించడం కష్టం” అని ఆమె అన్నారు.
నైజీరియా ప్రభుత్వం తన బడ్జెట్లో ఆరోగ్యరంగానికి 5 శాతం నిధులు కేటాయిస్తోంది. 2001లో ఆఫ్రికన్ యూనియన్ ఒప్పందంలో భాగంగా నైజీరియా ఆరోగ్య రంగానికి 20 శాతం నిధులు కేటాయిస్తామని పేర్కొంది. ఒప్పందం ప్రకారం చూస్తే ఆరోగ్య రంగానికి కేటాయిస్తున్న నిధులు 15 శాతం తక్కువ.

ఫొటో సోర్స్, Getty Images
ఖరీదైన వైద్యాన్ని భరించలేక..
2021లో నైజీరియాలో 2.18 కోట్ల మంది ప్రజలకు 1.21 లక్షల మంది పురుడు పోసే వారు ఉండేవారు. దీంతో సగానికి పైగా ప్రసూతి కేసులు ఆరోగ్య నిపుణుల పర్యవేక్షణలో జరిగేవి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం నైజీరియా జనాభాకు 7 లక్షల మంది నర్సులు, పురుడు పోసే నిపుణులు అవసరం అని అంచనా.
డాక్టర్ల కొరత కూడా తీవ్రంగా ఉంది.
సిబ్బంది కొరత, సౌకర్యాల లేమి కారణంగా కొంతమంది నిపుణుల వద్దకు రావడం లేదు.
‘‘నేను ఆసుపత్రులను ఎక్కువగా నమ్మను. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం గురించి చాలా కథనాలు విన్నాను” అని జమీలా ఇషాక్ అనే మహిళ చెప్పారు.
“నా నాలుగో బిడ్డను ప్రసవించేటప్పుడు కొన్ని సమస్యలు వచ్చాయి. స్థానికంగా ఉన్న ఆరోగ్య కార్యకర్త ఒకరు ఆసుపత్రికి వెళ్లమని సలహా ఇచ్చారు. అయితే మేము హాస్పిటల్కు వెళితే అక్కడ సాయం చేసేందుకు హెల్త్ వర్కర్ ఎవరూ లేరు. తిరిగి ఇంటికి వెళ్లాల్సి వచ్చిది. ఇంట్లోనే బిడ్డను కన్నా” అని ఆమె వివరించారు.
కనో రాష్ట్రానికి చెందిన 28 ఏళ్ల మహిళ ఒకరు తన ఐదో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.
ఒక ప్రైవేట్ క్లినిక్కు వెళ్లాలని ఆమె అనుకున్నారు కానీ, ఖర్చులు కారణంగా తన ఆలోచనను విరమించుకున్నారు.
చిన్వెండూ ఒబిజెసి మూడో బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఆమెకు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖర్చుల్ని భరించే సామర్థ్యం ఉంది.
“బిడ్డను కనేందుకు ఇంకెక్కడకీ వెళ్లను” అని ఆమె చెప్పారు.
తన కుటుంబం, స్నేహితుల ఇళ్లలో ప్రసూతి మరణాలు తక్కువని, అయితే వాటి గురించి తాను తరచుగా వింటున్నానని చెప్పారు.
ఆమె సంపన్నులు ఉండే అబుజా నగరం శివారు ప్రాంతంలో ఉంటారు. అక్కడ మంచి రోడ్లు ఉన్నాయి. ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి. ఎమర్జెన్సీ సేవలు లభిస్తాయి. నగరంలోని అనేక మంది విద్యావంతులైన మహిళలు ఉన్నారు. వారికి ఆసుపత్రులు ఎంత ముఖ్యమో తెలుసు.
“నేను ప్రసవానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటిస్తాను. నా డాక్టర్లతో మాట్లాడుతుంటాను. ముఖ్యమైన టెస్టులు, స్కానింగులు చేయిస్తాను. నా ఆరోగ్యం, బిడ్డ ఆరోగ్యం గురించి తెలుసుకుంటాను” అని బీబీసీకి చెప్పారు ఒబిజెసి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతీ రోజూ 200 మంది తల్లుల మృతి
పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, అయితే కొన్ని సమస్యల పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు నేషనల్ ప్రైమరీ హెల్త్ కేర్ డెవలప్మెంట్ ఏజన్సీలో డైరెక్టర్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ నానా సనదహ్ అబు బకర్ చెప్పారు.
ప్రసూతి మరణాలను తగ్గించేందుకు 2024 నవంబర్లో నైజీరియా ప్రభుత్వం మెటర్నల్ మోర్టాలిటీ రిడక్షన్ ఇన్నోవేషన్ ఇనీషియేటివ్ ( మమీ) పేరుతో అమలు చేస్తున్న స్కీమ్లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది.
ఈ కార్యక్రమాన్ని ప్రసూతి మరణాల్లో సగానికి పైగా ఉన్న 33 రాష్ట్రాల్లోని 172 స్థానిక ప్రభుత్వ ప్రాంతాలకు విస్తరించనున్నారు.
“మేము ప్రతి గర్బిణీ స్త్రీని గుర్తిస్తున్నాము. ఆమె ఎక్కడ నివసిస్తున్నారు, గర్భందాల్చిన తర్వాత ఎలాంటి రక్షణ లభిస్తోంది. పిల్లలు పుట్టిన తర్వాత ఎలా ఉంది” లాంటి అంశాలను సేకరిస్తున్నట్లు డాక్టర్ సనదహ్ అబుబకర్ చెప్పారు.
ఇప్పటి వరకు ఆరు రాష్ట్రాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి 4 లక్షల మంది గర్భిణులను గుర్తించారు. గర్భిణుల కోసం నిర్వహిస్తున్న అవగాహన తరగతులకు వారు హాజరవుతువ్నారా లేదా అనేది తెలుసుకుంటున్నామని డాక్టర్ సనదహ్ తెలిపారు.
“అందరికి వైద్య సేవలు అందేలా చేయడం, అలాగే సురక్షితంగా బిడ్డకు జన్మనిచ్చేలా చూడటం..ఇదే మా లక్ష్యం” అని ఆయన అన్నారు.
మమీ స్కీమ్లో భాగంగా గర్బిణీలను ఆసుపత్రికి తీసుకువచ్చేలా స్థానిక రవాణా నెట్వర్క్ను ప్రోత్సహించనున్నారు. అలాగే తక్కువ ధరకే ప్రజలకు ఆరోగ్య బీమా అందిస్తూ, అది వారు తీసుకునేలా ప్రోత్సహించనున్నారు.
దీని వల్ల ప్రయోజనం ఉంటుందా అంటే ఇప్పుడే చెప్పడం తొందరపాటు కావచ్చు. అయితే నైజీరియా చిన్నగానైనా ప్రపంచంబాటలో నడుస్తుందని అధికారులు ఆశిస్తున్నారు.
వైద్యసేవలు విస్తరించి ప్రజలకు అందుబాటులోకి రావడం వల్ల 2000 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాలు 40శాతం తగ్గాయి. నైజీరియాలోనూ పరిస్థితి కొంత మెరుగుపడినా.. అది కేవలం 13 శాతానికే పరిమితం అయింది.
మమీ లాంటి స్కీములు ఆహ్వనించదగినవే అయినప్పటికీ, వైద్య రంగంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు మరెంతో చేయాల్సి ఉందని నిపుణులు భావిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS