SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, AFP via Getty Images
అప్డేట్ అయ్యింది 2 ఫిబ్రవరి 2026
టీ20 ప్రపంచ కప్ 2026లో ఫిబ్రవరి 15న భారత్తో జరిగే మ్యాచ్ను తమ జట్టు బహిష్కరిస్తుందని పాకిస్తాన్ ప్రకటించింది. అయితే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీసుకున్న నిర్ణయంపై ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) హెచ్చరించింది.
‘‘అన్ని పక్షాల ప్రయోజనాలను పరిరక్షించే, అందరికీ ఆమోదయోగ్యమయ్యే పరిష్కారాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కనుక్కుంటుందని ఆశిస్తున్నాం’’ అని ఐసీసీ తెలిపింది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకలలో మొదలుకానుంది.
బంగ్లాదేశ్ను టీ20 ప్రపంచకప్ నుంచి తప్పించడాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇటీవల విమర్శించింది. ఈ నేపథ్యంలోనే భారత్తో మ్యాచ్ ఆడవద్దన్న నిర్ణయం పాకిస్తాన్ నుంచి వెలువడింది.
“ఐసీసీ టి20 ప్రపంచ కప్ 2026లో పాల్గొనడానికి పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రభుత్వం ఆమోదించింది. అయితే, ఫిబ్రవరి 15, 2026న భారత్తో జరగనున్న మ్యాచ్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు మైదానంలోకి దిగదు” అని పాకిస్తాన్ ప్రభుత్వం ఎక్స్లో రాసింది.
ఫొటో సోర్స్, Getty Images
గతవారం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్తో సమావేశం తర్వాత ‘‘అన్ని అవకాశాలు పరిశీలించి సమస్యను పరష్కరించుకోవాలని ప్రధాని ఆదేశించారు’’ అని నఖ్వీ చెప్పారు .
పాకిస్తాన్ ప్రకటన తర్వాత, సోషల్ మీడియా హోరెత్తింది. క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే ఈ నిర్ణయం గురించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.
”పాకిస్తాన్ ప్రపంచకప్లో పాల్గొని భారత్తో మ్యాచ్ ఆడకపోతే ఐసీసీ స్పందన ఎలా ఉంటుందో చూడాలని ఉంది. దీనికి సంబంధించి లీగల్ గా ఏం జరుగుతుందో, దాని పరిణామాలు ఎటు వెళతాయో తెలియదు. కానీ తనకు కలిగే నష్టాన్ని పాకిస్తాన్-ఐసీసీ రెవెన్యూషేర్ నుంచి భర్తీ చేయాలని ప్రసారకర్తను ఐసీసీ అడిగితే ఆశ్చర్యపోను. అలాగే ఫైనల్లో ఇండియా, పాకిస్తాన్ తలపడాల్సి వస్తే ఏం చేస్తారు? ” అని ఆయన రాశారు.

ఫొటో సోర్స్, X
ఫొటో సోర్స్, Getty Images
ఇండియా ఏం చేస్తుంది?
ఫిబ్రవరి 15న రెండు దేశాల మధ్య జరగాల్సిన మ్యాచ్ కోసం భారత జట్టు ఐసీసీ ప్రోటోకాల్స్ను పాటిస్తుందని బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది .
ఈ కథనం ప్రకారం, భారత జట్టు షెడ్యూల్కు కట్టుబడి ఉంటుంది. విలేఖరుల సమావేశాలు నిర్వహిస్తుంది. సమయానికి స్టేడియానికి చేరుకుంటుంది. మ్యాచ్ రద్దు అయ్యిందని రిఫరీ ప్రకటించే వరకు వేచి ఉంటుంది.
ఇక భారత్తో జరిగే మ్యాచ్కు పాకిస్తాన్ రాకపోతే, ఆ దేశం రెండు పాయింట్లు కోల్పోవాల్సి ఉంటుంది.
ఐసీసీ నిబంధనల ప్రకారం, మ్యాచ్ను బహిష్కరించిన జట్టు నెట్ రన్రేట్ కూడా ప్రభావితమవుతుంది. అయితే, ఆ మ్యాచ్లో ప్రత్యర్ధి జట్టు(ఇక్కడ భారత జట్టు) నెట్ రన్ రేట్పై ఎలాంటి ప్రభావం ఉండదు.
ఫొటో సోర్స్, AFP via Getty Images
పాక్ పూర్తిగా ఆడకపోతే ఐసీసీ ఏం చేయగలదు?
పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ అసలు ఆడకపోతే, ఐసీసీ పలు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని కొన్ని వర్గాలు చెప్పినట్టు ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలిపింది.
“అంతర్జాతీయ జట్లతో ద్వైపాక్షిక సిరీస్లు ఆడటంపై నిషేధం విధించవచ్చు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఆడేందుకు విదేశీ ఆటగాళ్లకు ఎన్వోసీ జారీ చేయరు. ఆసియా కప్ నుంచి కూడా పాకిస్తాన్ను బహిష్కరించవచ్చు” అని పేర్కొంది.
పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ ఆడకపోతే ఐసీసీ నుంచి అందే వార్షిక ఆదాయంపైనా ప్రభావం పడుతుంది.
“పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్లో ఆడటానికి నిరాకరిస్తే, ఐసీసీ నుంచి పీసీబీకి వచ్చే వార్షిక ఆదాయం ఆగిపోతుంది” అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక అధికారి హిందూస్తాన్ టైమ్స్తో అన్నారు.
నిజానికి 2023లో ఆదాయ పంపిణీని నిర్ణయించినప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మండలి మొత్తం ఆదాయం 55వేల 70 కోట్లరూపాయలు (600 మిలియన్ డాలర్లు). 2024-27లో 38.5 శాతం వాటా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)కు వెళ్లాలని డర్బన్లో నిర్ణయించారు.
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 6.89 శాతం, క్రికెట్ ఆస్ట్రేలియా 6.25 శాతం పొందుతాయి.
ఐసీసీ నుంచి అత్యధికంగా ఆదాయం పొందే నాలుగో సభ్యదేశం పాకిస్తాన్. 5.75 శాతం వాటా లేదా దాదాపు 34.51 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 3,160కోట్లు) పాకిస్తాన్ అందుకుంటుంది.
గతంతో పోలిస్తే పీసీబీ వాటా రెట్టింపు అయింది. అయితే ఐసీసీ ఆదాయ పంపిణీ ప్రమాణాలలో స్పష్టత లేకపోవడంపై బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. తగినంత పారదర్శకత లేదని పీసీబీ భావిస్తోంది.
టీ20 ప్రపంచ కప్ నుంచి పాకిస్తాన్ వైదొలిగితే ఐసీసీ నుంచి లభించే భారీ మొత్తం ఆగిపోతుంది. దీని వల్ల క్రికెట్ బోర్డు ఆర్థిక ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.
“పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగా లేదు. ఐసీసీ నుంచి వచ్చే డబ్బు దానికి అవసరం. టోర్నమెంట్ను పాకిస్తాన్ బహిష్కరిస్తే ఈ భారీ మొత్తం అందదు. అప్పుడు పీసీబీ ఆర్థిక ఇబ్బందుల్లో పడే అవకాశముంది” అని సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, రచయిత్రి నీరూ భాటియా అన్నారు.
“ఇప్పుడు పాకిస్తాన్ టీ20 వరల్డ్కప్ను బహిష్కరిస్తే, అది భవిష్యత్తులో జరిగే ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచ కప్, టెస్ట్ చాంపియన్షిప్ కూడా ఆడలేకపోవచ్చు” అని ఆమె చెప్పారు.
వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే పాకిస్తాన్ టోర్నమెంట్కు దూరంగా ఉండే రిస్క్ తీసుకుంటుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రస్తుతానికైతే భారత్తో మ్యాచ్ ఆడబోమని మాత్రం ప్రకటించింది పాకిస్తాన్.
ఫొటో సోర్స్, AFP via Getty Images
ఐసీసీకి కూడా నష్టమే
టీ 20 వరల్డ్కప్లో ఆడడానికి పాకిస్తాన్ పూర్తిగా నిరాకరిస్తే ఐసీసీ కూడా నష్టపోవచ్చు. పాకిస్తాన్లో టెలివిజన్, డిజిటల్ ప్రసార హక్కులను 2027 వరకు పీటీవీ (పాకిస్తాన్ టెలివిజన్), మైకోలకు కొన్ని నెలల కిందట ఐసీసీ ఇచ్చింది. అయితే ఈ ఒప్పందం ఎంత మొత్తమన్నది ఐసీసీ వెల్లడించలేదు.
భవిష్యత్తులో ఈ ఒప్పందం ఆగిపోతే ఐసీసీకి నష్టాలు రావొచ్చు. ఆ మొత్తం ఎంతన్నది అంచనా వేయడం కష్టం.
పాకిస్తాన్ ఆడకపోతే ఐసీసీ ఆదాయంపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. టోర్నమెంట్లో పాకిస్తాన్ ఆడితే భారత్తో మ్యాచ్లో తలపడాల్సిఉంటుంది. ఐసీసీకి ఎక్కువ ఆదాయం అందే మ్యాచ్ ఇది.
ప్రసారకర్తలు, ప్రకటనదారులకు భారతదేశం-పాకిస్తాన్ మ్యాచ్ చాలా ముఖ్యమైనది.
”పాకిస్తాన్ ప్రపంచ కప్ ఆడకపోతే ప్రసార సంస్థ చాలా ఇబ్బందుల్లో పడుతుంది. పాకిస్తాన్ స్థానాన్ని ఏ జట్టు భర్తీ చేస్తుంది? భారత్ వేరే జట్టుతో ఆడితే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ను చూసేంత మంది ఆ మ్యాచ్ను చూస్తారా?” అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ది గేమ్ ప్లాన్ అనే యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ప్రశ్నించారు.
భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఎఫ్ఐసీసీఐ) ప్రకారం గత 20 ఏళ్లలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్లు 10వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయని అంచనా.
“ఐసీసీ నష్టాలు చవిచూడటం సహజం. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే టికెట్లు పెద్ద సంఖ్యలో అమ్ముడుపోయాయి. టీవీలో వచ్చే భారీ ప్రకటనలు, స్పాన్సర్షిప్ల రూపంలో కూడా నష్టం ఉంది” అని నీరూ భాటియా అంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS



