SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, EPA/Shutterstock
2 గంటలు క్రితం
చదివే సమయం: 2 నిమిషాలు
ఇరాన్లో కూలిన అమెరికా ఎఫ్-15 యుద్ధ విమానంలోని ‘గల్లంతైన పైలట్’ కోసం గాలింపు చర్యలు ఇప్పటికీ ‘పూర్తి స్థాయిలో’ కొనసాగుతున్నాయని ఇరాన్లోని దక్షిణ కోహ్గిలుయే ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ బోయెర్ అహ్మద్ తెలిపారు.
ఆ పైలట్ను గుర్తించేందుకు అమెరికా కూడా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను ఉపయోగించి “విస్తృత ప్రయత్నాలు” చేస్తోందని మీడియా రిపోర్టులు తెలిపాయి.
‘పోలీసులు, భద్రతా దళాలు, స్థానికులు పైలట్ను గుర్తించి, పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు’ అని డిప్యూటీ గవర్నర్ చెప్పినట్టు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ‘ఫార్స్’ తెలిపింది.
‘గల్లంతైన పైలట్’ గురించి ఏమైనా సమాచారం తెలిస్తే అధికారులకు తెలియజేయాలని డిప్యూటీ గవర్నర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
విమానం కచ్చితంగా ఎక్కడ కూలిపోయిందో తెలియలేదు. అయితే ఇరాన్ ప్రభుత్వ మీడియా ఇప్పటివరకు కోహ్గిలుయే-బోయార్ అహ్మద్, ఖుజెస్తాన్ ప్రావిన్సుల గురించి చెబుతోంది.

దక్షిణ ఇరాన్లో అమెరికా యుద్ధ విమానం ఎఫ్-15 కూల్చివేశారని శుక్రవారం(ఏప్రిల్ 3) వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని బీబీసీ అమెరికా భాగస్వామి అయిన సీబీఎస్ న్యూస్కు రెండు వర్గాలు ధృవీకరించాయి.
కూలిన ఎఫ్-15 యుద్ధ విమానంలోని సిబ్బందిలో ఒకరిని రక్షించినట్టు కూడా ఆ వర్గాలు సీబీఎస్ న్యూస్కు తెలిపాయి.
అమెరికా కంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్లు ఆ పైలట్ను రక్షించాయి.
ఫొటో సోర్స్, STATE MEDIA
రెండో పైలట్ కోసం విస్తృత గాలింపు
అమెరికా కంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ (సీఎస్ఏఆర్) మిషన్లను అమెరికా, దాని మిత్రదేశాలు నిర్వహించే అత్యంత సంక్లిష్టమైన సైనిక కార్యకలాపాలలో ఒకటిగా పరిగణిస్తారు.
అమెరికాలో వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విభాగాలు సీఎస్ఏఆర్ మిషన్ల కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందుతాయి. సంక్షోభం సమయంలో విమానాలు కూలిపోయే అవకాశం ఉన్న ప్రాంతాలకు సమీపంలో వారిని ముందుగానే మోహరిస్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)



