SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
2 గంటలు క్రితం
చదివే సమయం: 4 నిమిషాలు
ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో ఇంధన కొరత తీవ్రమయ్యే పరిస్థితులు నెలకొనడంతో ఇంధనాన్ని ఆదా చేసేందుకు.. ప్రభుత్వ సంస్థలకు ప్రతి బుధవారాన్ని సెలవు దినంగా ప్రకటించింది శ్రీలంక ప్రభుత్వం.
“ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందాం. మంచే జరుగుతుందని ఆశిద్దాం” అని సోమవారం ఉన్నతాధికారులతో జరిగిన అత్యవసర సమావేశంలో అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకె అన్నారు.
ఈ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి ప్రభావితం కావడంతో గల్ఫ్ దేశాల నుంచి ఆసియా దేశాలకు వచ్చే కోట్ల బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోయింది, దీంతో ఆసియా దేశాలు ఇంధన సంక్షోభ నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగా, శ్రీలంక ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రపంచంలోనే భారీగా దిగుమతి చేసుకుంటున్న ఆసియా దేశాలకు నిరుడు సరఫరా అయిన మొత్తం చమురు, గ్యాస్లో 90 శాతం.. ఈ జలసంధి మీదుగానే రవాణా అయింది.

ఇతర ఆసియా దేశాల్లోనూ ముందస్తు చర్యలు..
ఫొటో సోర్స్, Getty Images
ఆసియాలోని ఇతర దేశాల్లోనూ అధికార యంత్రాంగాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి.
బంగ్లాదేశ్లో విశ్వవిద్యాలయాలకు ముందుగానే రంజాన్ సెలవులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు.
థాయ్లాండ్ ప్రభుత్వం ఏసీల వినియోగం తగ్గించేందుకు సూట్లకు బదులు సాధారణ టీషర్టులు ధరించాలని సూచిస్తోంది. తద్వారా ఇంధన ఆదాకు ప్రయత్నిస్తోంది.
మియన్మార్లో ఇంధన వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రైవేట్ వాహనాలపై పరిమితులు విధించారు. వాహనాల నంబర్ ప్లేట్ ఆధారంగా రోజు మార్చి రోజు(సరిబేసి తరహాలో) మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతిస్తున్నారు.
ఫిలిప్పీన్స్లో, కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు వారానికి కనీసం ఒకరోజు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ప్రభుత్వ విభాగాల్లో అత్యవసరం కాని ప్రయాణాలపై అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ నిషేధం విధించారు.
వియత్నాం ప్రభుత్వం ప్రజలు ఎక్కువ సమయం ఇళ్లలోనే ఉండేలా ప్రోత్సహిస్తోంది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు సైకిళ్ల వినియోగం, కార్పూలింగ్ , ప్రజా రవాణాను ఉపయోగించడం, వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించడం వంటి చర్యలకు పిలుపునిచ్చింది.
ఫొటో సోర్స్, Getty Images
శ్రీలంకలో పరిస్థితేంటి?
శ్రీలంకలో కొత్తగా అమల్లోకి తెచ్చిన వారంలో నాలుగు రోజుల పనిదినాల విధానం పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు కూడా వర్తిస్తుంది. అయితే ఆరోగ్యం, వలసల వంటి అత్యవసర సేవల విభాగాలకు ఇది వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.
వరుసగా మూడు రోజులు ప్రభుత్వ కార్యాలయాలు మూతపడకుండా ఉండేందుకు అదనపు సెలవు రోజును శుక్రవారానికి బదులుగా బుధవారాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు.
ఇంధన వినియోగాన్ని నియంత్రించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా, వాహనదారులు ఇప్పుడు “నేషనల్ ఫ్యూయల్ పాస్” కోసం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక్కో వ్యక్తికి రేషన్ ప్రకారం ఇంధనాన్ని పరిమితం చేస్తుంది.
ప్రైవేట్ కార్లకు 15 లీటర్లు, బైకులకు 5 లీటర్ల కోటా చాలా తక్కువని కొందరి నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.
2022లో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో మొదటిసారి ఇలాంటి రేషన్ విధానం అమలు చేశారు. అప్పట్లో విదేశీ మారక నిల్వలు తక్కువై, అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోవడం, ఇంధనం కొనుగోలు చేయడం కష్టమైంది.
గత నెల చివర్లో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు మొదలుపెట్టినప్పటి నుంచి చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్కు సుమారు 100 డాలర్ల ధర పలుకుతోంది
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)



