SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
10 నిమిషాలు క్రితం
చదివే సమయం: 4 నిమిషాలు
బంగ్లాదేశ్ ఎన్నికల్లో ‘బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ'(బీఎన్పీ) విజయం సాధించిందంటూ ప్రపంచ దేశాల నుంచి అభినందనలు అందుతున్నాయి.
‘బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికల్లో బీఎన్పీని విజయం దిశగా నడిపించినందుకు తారిక్ రెహమాన్కు అభినందనలు’ అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.
‘మీ నాయకత్వంపై బంగ్లాదేశ్ ప్రజలకున్న నమ్మకాన్ని ఈ విజయం సూచిస్తోంది.. ప్రజాస్వామ్య, ప్రగతిశీల బంగ్లాదేశ్కు భారత్ మద్దతుగా ఉంటుంది. రెండు దేశాల ఉమ్మడి లక్ష్యాలు, సంబంధాల విషయంలో మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను’ అని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.
మరోవైపు బంగ్లాదేశ్లోని అమెరికా రాయబార కార్యాలయం ఫేస్బుక్ అకౌంట్గా చెబుతున్న ‘యూఎస్ ఎంబసీ ఢాకా’ అనే అకౌంట్లో తారిక్ రెహమాన్ను అభినందిస్తూ పోస్ట్ ఉంది. పాకిస్తాన్ కూడా తన అభినందనలు తెలియజేసింది.
తుది ఫలితాలు ఇంకా వెలువడనప్పటికీ బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్పీ ఆధిక్యంలో ఉందని ‘బీబీసీ బంగ్లా’ పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేత, బంగ్లాదేశ్ ప్రధాని కానున్న నేతగా అభినందనలు అందుకుంటున్న తారిక్ రెహమాన్ ఎవరు? బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఆయన పాత్ర ఏమిటి?
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది

బంగ్లాదేశ్ రాజకీయాలలో ‘క్రౌన్ ప్రిన్స్’ గా పిలిచే తారిక్ రెహమాన్.. మాజీ అధ్యక్షుడు జియా-ఉర్-రెహమాన్, మాజీ ప్రధాని ఖలీదా జియా దంపతుల ముగ్గురు సంతానంలో పెద్దవాడు.
1965 నవంబర్ 20న జన్మించిన తారిక్ రెహమాన్ బీఎన్పీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కావడానికి ముందు పార్టీలో సీనియర్ వైస్-చైర్మన్, సీనియర్ జాయింట్ సెక్రటరీ వంటి ముఖ్యమైన పదవులను నిర్వహించారు.
1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో, తారిక్ రెహమాన్ను ఆయన తల్లి ఖలీదా జియా, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులతో పాటు అరెస్ట్ చేశారు.
బంగ్లాదేశ్ స్వాతంత్య్ర యుద్ధ ఖైదీలలో అతి పిన్న వయస్కుడిగా తారిక్ రెహమాన్ను బీఎన్పీ అభివర్ణించింది.
ఫొటో సోర్స్, Getty Images
ఆయన తన ప్రాథమిక విద్యను ఢాకాలోని బీఏఎఫ్ షాహీన్ కాలేజ్లో పూర్తి చేశారు. ఆ తర్వాత 1980లలో ఢాకా యూనివర్శిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివారు.
కాలం గడిచేకొద్దీ, తారిక్ రెహమాన్ తన తల్లితో కలిసి రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టారు. ఆనాటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడానికి వీధుల్లోకి వచ్చి 1988లో బీఎన్పీ జనరల్ సభ్యుడయ్యారు.
ఆ సమయంలో ఆయన కింది స్థాయి కార్మికులను, మద్దతుదారులను సమీకరించి, హెచ్.ఎం. ఎర్షాద్ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో కీలక పాత్ర పోషించారు.
1991లో ఖలీదా జియా బంగ్లాదేశ్కు మొదటి మహిళా ప్రధానమంత్రి అయినప్పుడు, తారిక్ రెహమాన్ దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ నేవీ మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మహబూబ్ అలీ ఖాన్ కుమార్తె డాక్టర్ జుబైదా రెహమాన్ను 1993లో వివాహం చేసుకున్నారు.
17ఏళ్లు లండన్లోనే ఉన్న రెహమాన్ తాజా ఎన్నికలకు కొద్దిరోజుల ముందు తన స్వదేశం బంగ్లాదేశ్కు తిరిగొచ్చారు.
ఫొటో సోర్స్, Getty Images
17 ఏళ్లు లండన్లోనే ఎందుకు ఉండిపోయారు?
2004 ఆగస్ట్లో ఢాకాలో అవామీ లీగ్ ర్యాలీలో గ్రనేడ్ దాడి జరిగింది. ఈ దాడిలో 24 మంది మరణించారు. 100 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. షేక్ హసీనా ఈ దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు.
ఈ కేసులో తారిక్ రెహమాన్ పేరు తెరపైకి వచ్చింది. ఆ సమయంలో ఖలీదా జియా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్నారు.
అయితే, దీనిని ప్రతీకార రాజకీయాలతో రెచ్చగొట్టిన కేసుగా బీఎన్పీ పేర్కొంది.
2007లో సైనిక మద్దతుతో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగంగా తారిక్ రెహమాన్ అరెస్టు అయ్యారు.
అరెస్ట్ అయనప్పుడు తారిక్ రెహమాన్ను హింసించడంతో ఆయన అనారోగ్యానికి గురయ్యారని బీఎన్పీ ఆరోపిస్తోంది.
2008లో ఆయనకి బెయిల్ వచ్చింది, చికిత్స కోసం లండన్ వెళ్లడానికి అనుమతి లభించింది.
అప్పటి నుంచి రెహమాన్ లండన్లోనే ఉంటూ అక్కడి నుంచే బీఎన్పీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.
ఫొటో సోర్స్, Getty Images
క్రిమినల్ కేసులు…
2004 గ్రనేడ్ దాడికి సంబంధించిన కేసులో అక్టోబర్ 2018లో తారిక్ రెహమాన్, మరో 18 మందికి జీవిత ఖైదు విధించారు.
2001 నుంచి 2006 వరకు బీఎన్పీ ప్రభుత్వ పదవీకాలంలో లంచం, ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై మూడు భాగాల సిరీస్ను ఢాకా ట్రిబ్యూన్ 2023 మే 24న ప్రచురించింది. డాక్యుమెంటరీ ఆధారంగా రూపొందించిన ఈ సిరీస్, రెహమాన్ను “డార్క్ ప్రిన్స్”గా అభివర్ణించింది.
ఆ నివేదిక తారిక్ రెహమాన్పై అవినీతి, మీడియాను బెదిరించడం వంటి ఆరోపణలు మోపింది.
రెహమాన్ అక్రమ మార్గాలలో వందల మిలియన్ల డాలర్లు సంపాదించాడని.. అమెరికా రాయబార కార్యాలయ కేబుల్స్ను ఉటంకిస్తూ ఆరోపించింది.
అక్రమ సంపదను కూడబెట్టినందుకు 2023లో రెహమాన్కు తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించారు.
“2024 ఆగస్ట్లో విద్యార్థి ఉద్యమం కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయినప్పుడు తారిక్ రెహమాన్ అదృష్టం కూడా మారిపోయింది. తదనంతరం 2004 గ్రనేడ్ దాడి, మనీలాండరింగ్ , రాజద్రోహానికి సంబంధించిన కేసులతో సహా పెండింగ్లో ఉన్న మొత్తం 84 కేసుల నుంచి ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు” అని ఫస్ట్పోస్ట్ నివేదిక పేర్కొంది.
కాగా బంగ్లాదేశ్లో జెన్ జడ్ ఆందోళనలు, అనంతరం షేక్ హసీనా పదవీచ్యుతురాలై దేశం విడిచి వెళ్లడం.. రెహమాన్ తల్లి ఖలీదా జియా అనారోగ్యం పాలవడం వంటి పరిణామాల నడుమ ఆయన స్వదేశానికి వచ్చారు.
అక్కడికి కొద్దిరోజుల్లోనే ఆయన తల్లి ఖలీదాజియా మరణించారు.
అనంతరం జరిగిన ఎన్నికల్లో రెహమాన్ బీఎన్పీని ముందుండి నడిపించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS



