SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
4 గంటలు క్రితం
టీ20 ప్రపంచకప్లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్పై నెలకొన్న ప్రతిష్టంభన వీడింది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15న శ్రీలంకలో యథావిధిగా జరగనుంది.
తమ జట్టును మైదానంలోకి దిగేందుకు అనుమతిస్తూ సోమవారం సాయంత్రం పాకిస్తాన్ ఓ ప్రకటన విడుదల చేసింది. తన మిత్రదేశాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రతినిధులు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం గురించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోహిసిన్ నఖ్వీ అంతకుముందు అధికారికంగా షాబాజ్ షరీఫ్కు తెలియజేశారు.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చేసిన అధికారిక అభ్యర్థనలు.. శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇతర సభ్య దేశాల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ‘బీబీసీ ఉర్దూ’ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
‘సామరస్యంగా పరిష్కరించుకోవాలి’
పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సోమవారం సాయంత్రం శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేతో ఫోన్లో మాట్లాడారు.
‘‘ప్రస్తుత ప్రతిష్టంభనను సామరస్యంగా పరిష్కరించుకోవాలని శ్రీలంక అధ్యక్షుడు పాకిస్తాన్ ప్రధానమంత్రిని అభ్యర్థించారు” అని ప్రభుత్వ ప్రకటనను ఉటంకిస్తూ బీబీసీ ఉర్దూ పేర్కొంది.
ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. “మిత్రదేశాల దేశాల అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుని, పాకిస్తాన్ ప్రభుత్వం ఫిబ్రవరి 15, 2026న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ చేసిన మ్యాచ్ కోసం పాకిస్తాన్ జట్టును మైదానంలోకి దిగమని ఆదేశించింది.”
“క్రికెట్ స్ఫూర్తిని కాపాడుకోవడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాం” అని ఆ ప్రకటనలో పేర్కొంది.
ఫొటో సోర్స్, Getty Images
టీ ట్వంటీ ప్రపంచ కప్ పూర్తి షెడ్యూల్
ఫిబ్రవరి 7న ప్రారంభమైన టీ20 ప్రపంచ కప్ మార్చి 8 వరకు కొనసాగుతుంది. ఈ 30 రోజుల్లో ఎనిమిది వేర్వేరు వేదికలలో మొత్తం 55 మ్యాచ్లు జరుగుతాయి.
టీ-20 పురుషుల ప్రపంచకప్ టోర్నమెంట్లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి
భద్రత కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్ ప్రభుత్వం తన అన్ని మ్యాచ్లను భారత్ వెలుపల నిర్వహించాలని ఐసీసీని కోరింది. ఐసీసీ అందుకు అంగీకరించకపోవడంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి వైదొలగింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)



