SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
2 గంటలు క్రితం
ఇరాన్ ఇస్లామిక్ రివాల్యుషనరీ గార్డు కోర్ (ఐఆర్జీసీ) సీనియర్ జనరల్, ఇరానియన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ మోహసిన్ రెజాయికు చెందిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒకవేళ ఇజ్రాయెల్ అణ్వాయుధాలను వాడితే, పాకిస్తాన్ తన సొంత అణ్వాయుధాలతో ఇజ్రాయెల్పై విరుచుకుపడుతుందని ఆ వీడియోలో ఆయన అంటున్నట్లు ఉంది.
ఇరాన్ ప్రభుత్వ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహసిన్ ఈ విషయాలను చెప్పినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
ఇజ్రాయెల్ దాడిని పాకిస్తాన్ ఖండిస్తోంది. కానీ, అణ్వాయుధాలను ప్రయోగించడం గురించి బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు.
జనరల్ మోహసిన్ వీడియో క్లిప్పై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాఖ్ దార్ ఆ దేశ పార్లమెంట్లో స్పందించారు.
”ఇది పూర్తిగా బాధ్యతారహితమైన, తప్పుడు వార్త. పాకిస్తాన్ను అణుశక్తిగా అల్లా తీర్చిదిద్దారు. దీనివల్ల ప్రపంచంలో చాలా దేశాలు భయపడుతున్నాయి” అని ఇషాఖ్ దార్ అన్నారు.
‘‘ కానీ, ఈ అణు శక్తి మా భద్రతా, స్థిరత్వం కోసమే. 9/11 తర్వాత రెండు దేశాల సైన్యాలు ఒకదానితో మరొకటి తలపడేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు భారత్కు ఒక అవకాశం కావాలి. ఒకవేళ మాకు ఈ శక్తి లేకపోతే, ఆరోజు ఏం జరిగేదో ఎవరికి తెలుసు? ఇజ్రాయెల్పై అణ్వాయుధాలను వాడతామని మా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని నేను స్పష్టం చేయదలుచుకున్నా” అని తెలిపారు.
ఇజ్రాయెల్పై పోరాడేందుకు ముస్లింలంతా ఏకమవ్వాలని నేషనల్ అసెంబ్లీలో ఈ నెల 14న పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అభ్యర్థించారు.

‘‘మేం ఇరాన్ తరఫున నిలబడతాం. ప్రతి అంతర్జాతీయ వేదికపైనా, ఇరాన్ ప్రయోజనాలను కాపాడేందుకు పోరాడతాం. ఇరాన్, యెమెన్, పాలస్తీనాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఒకవేళ ముస్లిం దేశాలు ఐక్యంగా లేకపోతే, ఇలాంటి దాడులను మనం ఎదుర్కోవాలి. ఇజ్రాయెల్తో సంబంధాలను తెంచుకోవాలని అన్ని ముస్లిం దేశాలను అభ్యర్థిస్తున్నా. ఇస్లామిక్ కోఆపరేషన్కు చెందిన సంస్థ అత్యవసర సమావేశం నిర్వహించి, సంయుక్త వ్యూహాన్ని సిద్ధం చేయాలి” అని ఖవాజా ఆసిఫ్ పిలుపునిచ్చారు.
ఇరాన్కు మద్దతు ఇచ్చే విషయంపై పాకిస్తాన్ నేతలు మాట్లాడుతున్నప్పటికీ, ఇరాన్తో ఉన్నసరిహద్దును పాకిస్తాన్ మూసివేసినట్లు సోమవారం వార్తలు వచ్చాయి.
”ఐదు జిల్లాలు చాగీ, వాషుక్, పంజ్గుర్, కెచ్, గ్వాదర్లలో ఇరాన్, పాకిస్తాన్ మధ్యలో ట్రాఫిక్ను నిలిపి వేశాం” అని పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్కు చెందిన సీనియర్ అధికారి ఖాదిర్ బక్ష్ పిర్కాని వార్తా సంస్థ ఏఎఫ్పీకి తెలిపారు.
అంతర్జాతీయ వేదికలపై ఇరాన్కు మద్దతుగా పాకిస్తాన్ మాట్లాడినప్పటికీ, సైనిక సాయంపై నిర్ణయం తీసుకోవడం అంత తేలిక కాదు.
పాకిస్తాన్తో సౌదీ అరేబియాకు చారిత్రక సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, 2015లో సౌదీ అరేబియా అభ్యర్థించినా పాకిస్తాన్ తన బలగాలను యెమెన్కు పంపేందుకు తిరస్కరించింది.
అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామి ఇజ్రాయెల్. ఇలాంటి పరిస్థితిలో అమెరికాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ వెళ్లాలనుకోవడం కాస్త కష్టమే.
పాకిస్తాన్, ఇరాన్లు ఎంత దూరం, ఎంత దగ్గర?
పాకిస్తాన్, ఇరాన్లు సరిహద్దు దేశాలు. ఈ రెండింటి మధ్య 750 కి.మీల సరిహద్దు ఉంటుంది. పాకిస్తాన్ సున్నీలు మెజారిటీగా ఉన్న ఇస్లామిక్ దేశంగా కాగా, ఇరాన్ షియాలు మెజారిటీ గల దేశం.
ఇరు దేశాలు పక్కపక్క దేశాలు అయినప్పటికీ, సంబంధాలేమీ అంత చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. సరిహద్దు విషయంలో రెండు దేశాలు తరచూ ఘర్షణలు పడుతూనే ఉంటాయి.
పాకిస్తాన్కు సౌదీ అరేబియా చాలాకాలంగా మిత్రదేశం. సౌదీ అరేబియా, ఇరాన్లు ఎంతోకాలంగా ప్రత్యర్థులు.
‘‘ 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం జరిగిన తర్వాత, పాకిస్తాన్తో సంబంధాలు నేరుగా ప్రభావితమయ్యాయి. ఈ విప్లవం తర్వాత ఇరాన్ ఆధిపత్యం అంతా షియా కేంద్రంగా మారింది. సంప్రదాయక షియా విధానాలు మరింత ప్రాధాన్యంలోకి వచ్చాయి. ఈ విధంగా రెండు దేశాల మధ్య ఇస్లాం విభజన సమస్యగా మారింది” అని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ తన రీసెర్చ్ పేపర్ ఒకదానిలో రాసింది.
”1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. 1977లో జనరల్ జియా-ఉల్-హక్ అధికారంలోకి వచ్చిన తర్వాత, పాకిస్తాన్ జాతి గుర్తింపులో ఇస్లాంకు ప్రాధాన్యత పెరిగింది. కాలక్రమేణా ఇస్లాంకు చెందిన సున్నీల గుర్తింపు పాకిస్తాన్లో కేంద్ర బిందువైంది. మరోవైపు ఇరాన్లో ప్రధాన దృష్టంతా షియాల గుర్తింపుపైనే. ఇరాన్ కేవలం స్వదేశంలో వారి గుర్తింపు కాపాడటమే కాకుండా, దేశం వెలుపల ఉన్న షియాల భద్రతపై చురుకుగా పనిచేయడం మొదలుపెట్టింది. 1979 తర్వాత అమెరికాతో దూరం పెరగడంతో, పాకిస్తాన్తో సాన్నిహిత్యం పెంచుకుంది” అని ఆ రీసెర్చ్ పేపర్ పేర్కొంది.
పాకిస్తాన్లో సున్నీ ముస్లింల గుర్తింపు పెరగడంతో, సౌదీ అరేబియాతో సాన్నిహిత్యం పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ ప్రకారం.. మదరసాలు, ఇతర వాటితో పాకిస్తాన్లో వహాబి ఇస్లాంను సౌదీ అరేబియా ప్రోత్సహించింది.
ముస్లిం దేశాలన్నింటిలో అణు ఆయుధాలున్న ఏకైక దేశం పాకిస్తాన్. అణు పరీక్ష తర్వాత పాకిస్తాన్పై ఆంక్షలు పెరగడంతో , సౌదీ అరేబియా ఆర్థిక సాయాన్ని కూడా అందించింది.
కానీ, గత దశాబ్ద కాలంగా సౌదీ అరేబియా తన సంబంధాల్లో పాకిస్తాన్ ఉనికిని తగ్గించింది. మరోవైపు యెమెన్లో హూతీ తిరుగుబాటుదారులపై చేసే యుద్ధంలో చేతులు కలపాలని 2015లో సౌదీ అరేబియా చేసిన అభ్యర్థనను పాకిస్తాన్ సైతం తిరస్కరించింది.
1980ల్లో అమెరికా, సౌదీ అరేబియాలు పాకిస్తాన్ ద్వారా సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా అఫ్గాన్ ముజాహిదీన్ గ్రూప్లకు మద్దతు ఇవ్వడం ప్రారంభించాయి. ఆ తర్వాత ఈ గ్రూప్ల నుంచే అఫ్గాన్ తాలిబాన్, అల్ ఖైదాలు ఉద్భవించాయి.
”ఇరాక్పై యుద్ధం జరిపేందుకు షియా అఫ్గాన్లను నియమించుకోవడం ప్రారంభించింది ఇరాన్. అఫ్గానిస్తాన్లో ఇరాన్ వ్యూహాత్మక ప్రయోజనాలు భారత్తో ముడిపడి ఉన్నాయి. ఇది ఇరాన్పై పాకిస్తాన్కు అపనమ్మకాన్ని పెంచింది” అని ఐఐసీసీ తన పేపర్లో రాసింది.
గత ఏడాది జనవరిలో కూడా ఇరాన్, పాకిస్తాన్లు ఒకరి ఉపరితలంపై మరొకటి దాడులు చేసుకున్నాయి. సరిహద్దుల్లో టెర్రరిస్ట్ గ్రూప్లకు మద్దతు ఇస్తున్నాయని ఇరు దేశాలు ఆరోపణలు చేసుకున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్, ఇజ్రాయెల్ సంబంధాలు ఎలా ఉన్నాయి?
2020లో యూఏఈ, బహ్రెయిన్, మొరాకో, సూడాన్లు ఇజ్రాయెల్తో దౌత్యపరమైన సంబంధాలు ఏర్పరుచుకోవాలని నిర్ణయించాయి.
దీనికి ముందు 1979లో ఇజ్రాయెల్తో, 1994లో జోర్డాన్తో ఈజిప్ట్ అధికారిక సంబంధాలను ఏర్పరుచుకుంది.
ఇజ్రాయెల్తో పాకిస్తాన్కు ఎలాంటి ఘర్షణ లేదా సంక్షోభం లేనప్పటికీ, ఇజ్రాయెల్ను ఒక దేశంగా ఇప్పటి వరకు అది అంగీకరించలేదు. అరబ్ దేశాలతో ఇస్లామిక్ ఐక్యతను చాటేందుకు పాకిస్తాన్ ఇలా చేస్తోంది.
కానీ, అరబ్ దేశాలే స్వయంగా ఇజ్రాయెల్కు దగ్గరవుతున్నప్పుడు, దానితో సంబంధాలను ఏర్పరచుకోవడంలో పాకిస్తాన్కు ఉన్న సమస్య ఏమిటి?
దీనికి 2020లో అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సమాధానమిచ్చారు.
‘‘ ఇతర దేశాలు ఏమి చేసినా, మా వైఖరి స్పష్టంగా ఉంది. పాలస్తీనియన్లకు వారి హక్కులు వచ్చేంత వరకు, మేం ఇజ్రాయెల్ను అంగీకరించబోమని 1948లో మొహమ్మద్ అలీ జిన్నా చెప్పారు” అని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.
పాకిస్తాన్ కనుక ఇజ్రాయెల్ను గుర్తిస్తే, అమెరికాతో సంబంధాలు మెరుగుపడతాయని చాలామంది అంటున్నారు.
ఇజ్రాయెల్పై పాకిస్తాన్ సామాన్య ప్రజలకున్న ఆగ్రహం అప్పుడప్పుడు వారి వీధుల్లో నిరసనల రూపంలో వ్యక్తమవుతుంటుంది.
ఇజ్రాయెల్, పాలస్తీనాలు శాంతి ఒప్పందం కుదుర్చుకుంటే, ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలను కుదుర్చుకునేందుకు తమకెలాంటి సమస్య లేదని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు దివంగత పర్వేజ్ ముషారఫ్ అన్నారు.
పాకిస్తాన్లో ఇజ్రాయెల్ను శత్రువుగా చూస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ వీధుల్లో మాత్రం పాకిస్తాన్పై ఇంత ఆగ్రహం కనిపించడం లేదు. 2018లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్లో పర్యటించారు.
ఆ సమయంలో ”పాకిస్తాన్కు ఇజ్రాయెల్ శత్రువు కాదు. ఇజ్రాయెల్కు కూడా పాకిస్తాన్ శత్రువు కాదు” అని బెంజమిన్ చెప్పారు.
బెంజమిన్ ఈ వ్యాఖ్యల తర్వాత ఇజ్రాయెల్తో సంబంధాలను పున:సమీక్షించాలని పాకిస్తాన్లో కొన్ని స్వరాలు వినిపించాయి.
అయితే, ‘‘భారత్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య ఏర్పడుతున్న కూటమి ముస్లిం ప్రపంచానికి అతిపెద్ద ముప్పు” అని పాకిస్తాన్ సెనేట్ చైర్మన్ రజా రబ్బానీ ముస్లిం ప్రపంచాన్ని హెచ్చరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)