SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
భారత్లో ఎయిర్ కండిషనర్ల ఉష్ణోగ్రత స్థాయులపై ఆంక్షలు విధించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఏసీల వాడకంపై చర్చ మొదలైంది.
ఒకప్పుడు విలాసవస్తువుగా ఉన్న ఎయిర్ కండిషనర్లు ఇప్పుడు తప్పనిసరి అయ్యాయి. వాతావరణ మార్పుల కారణంగా భూతాపం పెరగడంతో వేసవి కాలంలో ఏసీల వాడకం పెరుగుతోంది.
ఉష్ణ మండలంలో ఉన్న భారత్లో ఎయిర్ కండిషనర్ల వాడకం రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ వేడి నుంచి ఉపశమనం కోసం ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గం ఏసీలే.
ప్రపంచవ్యాప్తంగా 2 వందల కోట్ల ఏసీలు వినియోగంలో ఉన్నట్లు అంతర్జాతీయ ఇంధన సంస్థ నివేదిక చెబుతోంది. ఇందులో 70శాతం ఇళ్లలోనే ఉపయోగిస్తున్నారని పేర్కొంది. భారతదేశంలో 10 కోట్ల ఏసీలు ఉన్నట్లు అంచనా. గత ఏడాదిలోనే కోటి 40 లక్షల ఏసీల అమ్మకాలు జరిగాయి.


ఫొటో సోర్స్, Getty Images
కేంద్ర ప్రభుత్వం ఏమంటోంది?
ఏసీ ఉష్ణోగ్రతలపై నియంత్రణ తెచ్చే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోందని విద్యుత్ శాఖమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ ప్రకటించారు.
“కొత్త నియమాల ప్రకారం ఏసీల ఉష్ణోగ్రత కనిష్ఠంగా 20 డిగ్రీల సెల్సియస్ నుంచి గరిష్ఠంగా 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలి. దీని వల్ల ఏసీల చల్లదనాన్ని 20 డిగ్రీల కంటే తగ్గించడం, 28 డిగ్రీలకు మించి పెంచడం కుదరదు. ఉష్ణోగ్రత ఆధారిత వ్యవస్థల నియంత్రణకు ఇది తొలి ప్రయత్నం” అని ఖట్టర్ చెప్పారు.
ఏసీల్లో ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ పెంచితే 6 శాతం విద్యుత్ ఆదా అవుతుందని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ బ్లూమ్బర్గ్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
విద్యుత్ వాడకం ఎందుకు పెరుగుతోంది?
ఏసీల వాడకం వల్ల విద్యుత్ వినియోగంలో ఏర్పడే అసమానతనలను తొలగించడానికి కేంద్రం ప్రతిపాదిస్తున్న నియంత్రణలు ఉపకరిస్తాయని ఎలక్ట్రిసిటీ బోర్డు రిటైర్డ్ ఇంజనీర్ గాంధీ చెప్పారు.
“ఒకటిన్నర టన్ను ఏసీ వాడుతున్నప్పుడు, రోజుకు 2 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. మనం ఏసీని 24 డిగ్రీల వద్ద ఉంచితే, విద్యుత్ వినియోగం స్థిరంగా ఉంటుంది. అదే మనం గది ఉష్ణోగ్రతలను 20 డిగ్రీల కంటే తక్కువగా ఉంచే ప్రయత్నం చేస్తే, అందుకు ఎక్కువ సమయం పడుతుంది. అందుకు తగినట్లు విద్యుత్ వినియోగం, వోల్టేజ్ పెరుగుతాయి” అని ఆయన చెప్పారు.
“ఏసీలను ఆన్ చేయగానే అవి భారీ స్థాయిలో క్లోరోఫ్లోరో కార్బన్లను విడుదల చేస్తాయి. ఇవి పర్యావరణానికి హాని కలిగిస్తాయి” అని కెమిస్ట్రీ ప్రొఫెసర్ పార్తీబన్ చెప్పారు.
“ఏసీల్లో క్లోరోఫ్లోరోకార్బన్లను నింపుతారు. ఏసీని ఆన్ చేయగానే ఇవి పర్యావరణంలో కలిసిపోతాయి. ఈ వాయువుల వల్ల ఓజోన్ పొర దెబ్బ తింటుంది. సూర్యుడి నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణాల బారిన పడకుండా ఓజోన్ పొర కాపాడుతుంది. ఈ కిరణాలు నేరుగా తాకితే చర్మం దెబ్బ తింటుంది. ఏసీలను మరింత కనిష్ఠ ఉష్ణోగ్రతల వద్ద ఉపయోగించినప్పుడు ఈ వాయువులు గాల్లోకి ఎక్కువగా విడుదలవుతాయి. దీని వల్ల వేడి మరింత పెరుగుతుంది. అందుకే ఏసీలను సూచించిన విధంగా ఉపయోగించడం మంచిది” అని ఆయన వివరించారు.
ఏసీల వాడకంలో నియంత్రణపై రెండేళ్లుగా చర్చలు జరుగుతున్నాయని ఫ్రెండ్ ఆఫ్ ఎర్త్కు చెందిన పర్యావరణ కార్యకర్త జియో డామిన్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను తాను స్వాగతిస్తున్నానని అయితే కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలకు బదులు 24 డిగ్రీలు ఉంటే మంచిదని ఆయన చెప్పారు.
“విద్యుత్ రంగం నుంచి 70శాతం కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయి. ఇందులో కూలింగ్, హీటింగ్ వ్యవస్థల నుంచి ఎక్కువగా వస్తున్నాయి. 2050 నాటికి భారతదేశంలో ఏసీ లేని ఇల్లు ఉండదని అంచనా. భవిష్యత్లో గౌరవ ప్రదమైన జీవితంలో ఏసీలు ప్రాథమికంగా మారతాయి. అలాంటి పరిస్థితుల కోసం ఏసీల వాడకంలో మనకు కచ్చితంగా కొన్ని ప్రమాణాలు ఉండాలి. కేంద్రం ప్రతిపాదిస్తున్న నియంత్రణలు సరిపోవని నా వ్యక్తిగత అభిప్రాయం” అని జియో డామిన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రత్యామ్నాయం ఏంటి?
‘‘వాతావరణ మార్పుల వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతున్న దేశాల్లో భారత్ ఒకటి. ఏసీ వాడేందుకు మనం ఉపయోగిస్తున్న విద్యుత్ కోసం మనం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకే భవిష్యత్లో కేవలం సంపన్నులు మాత్రమే ఏసీలు వాడగలిగే పరిస్థితి ఉండకూడదు” అంటారు జియో డామిన్.
“ఏసీలను ఇళ్లలో మాత్రమే కాదు. ఆఫీసులు, వాణిజ్య సముదాయాల్లోనూ ఉపయోగిస్తున్నారు. మనం ఇంధన సామర్థ్య గురించి మాట్లాడేటప్పుడు, ఇంధన సమానత్వం గురించి కూడా మాట్లాడాలి” అని ఆయన చెప్పారు.
మనం ఏసీల నియంత్రణ గురించి మాట్లాడుతున్నప్పుడు, ప్రత్యామ్నాయ మార్గాల గురించి కూడా ఆలోచించాలంటారు ఆయన.
“ఇంట్లో వేడి, ఉక్కపోత ఉన్నప్పుడు మనం ఏసీ ఉపయోగిస్తాం. ఏసీ నడవాలంటే విద్యుత్ అవసరం. దీని వల్ల మరిన్ని కర్బన ఉద్గారాలు వెలువడతాయి. ఏసీల నుంచి వెలువడే వేడి వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తుంది. ఇది అంతు లేని విషవలయం. గ్లోబల్ వార్మింగ్ను ఒకటిన్నర డిగ్రీలు నియంత్రించాలని అనుకున్నప్పటికీ మనం దాన్ని దాటిపోయాం”
“అద్దాలు బిగించిన భవనాలు ఎక్కువ వేడిని గ్రహిస్తున్నాయి. అలాంటి భవనాల్లో ఎక్కువ ఏసీలను వాడాల్సి వస్తోంది. ఏసీల వాడకాన్ని వీలైనంత తగ్గించేందుకు, గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా నిర్మాణాల్ని చేపట్టాలి”
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)