Home LATEST NEWS telugu తాజా వార్తలు ఎయిరిండియా విమాన ప్రమాదం: ‘‘సర్‌ప్రైజ్’ చేయాలని ఎవరికీ చెప్పకుండా వచ్చారు’’

ఎయిరిండియా విమాన ప్రమాదం: ‘‘సర్‌ప్రైజ్’ చేయాలని ఎవరికీ చెప్పకుండా వచ్చారు’’

3
0

SOURCE :- BBC NEWS

హర్షిత్, పూజా

  • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
  • హోదా, బీబీసీ ప్రతినిధి
  • 14 జూన్ 2025

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఆప్తులను పోగొట్టుకున్నవారు ఆ విషాదం నుంచి తేరుకోలేకపోతున్నారు. ఘటన జరిగి రోజున్నర గడిచినా, తమవారి మృతదేహాలకోసం ఆస్ప్రతి వద్ద ఉబికి వచ్చే కన్నీటితో ఎదురుచూస్తున్నారు.

అహ్మదాబాద్ సివిల్స్ ఆస్పత్రి వద్ద శుక్రవారం సాయంత్రం ఎటు చూసినా మీడియా హడావుడి కనిపించింది. ఇక పొద్దున్నుంచి అంబులెన్సులు వచ్చిపోతూనే ఉన్నాయి. పోస్టుమార్టం రూమ్ ఎదురుగా ఓ స్టీలు రాడ్డుపై కూర్చుని ఉన్నారు గుజరాత్‌కు చెందిన అనిల్ పటేల్.

ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగుతూ మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు జవాబులిస్తూ భారమైన హృదయంతో కనిపిస్తున్నారాయన.

ఎయిరిండియా విమాన ప్రమాదంలో తన కుమారుడు హర్షిత్ భాయ్ పటేల్, కోడలు పూజ పటేల్‌లను ఆయన పోగొట్టుకున్నారు. కుటుంబసభ్యులను సర్‌ప్రైజ్ చేయాలని ఎవరికీ చెప్పకుండా హర్షిత్, పూజా ఇండియాకు వచ్చినట్లుగా బంధువులు చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
అనిల్ పటేల్

లండన్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్ స్థాయి ఉద్యోగం చేస్తున్నారు హర్షిత్ పటేల్, పూజా పటేల్. వీరికి ఏడేళ్ల కిందట వివాహమైంది. పిల్లల కోసం ఈ జంట ఎదురు చూస్తోంది.

గైనిక్ సమస్య కారణంగా ఇండియాలో డాక్టర్ ను సంప్రదించేందుకు పది రోజుల కిందట అంటే జూన్ 2వ తేదీన వచ్చి, జూన్ 12వ తేదీ మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు.

”చివరిసారిగా ఫ్లైట్ ఎక్కాక కాల్ చేశారు. విమానం ఎక్కాం, బయల్దేరుతున్నాం అని చెప్పారు. అంతే..” అంటూ బీబీసీ వద్ద అనిల్ పటేల్ కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుమారుడు, కోడలి మృతదేహాలు అప్పగించమంటే సమాధానం లేదని చెబుతున్నారాయన.

”డీఎన్ఏ శాంపిల్స్ ఇవ్వమంటే ఇచ్చాం. వారి మృతదేహాలు ఎప్పటికి ఇస్తారనేది కూడా చెప్పడం లేదు” అని ఆయన బీబీసీతో అన్నారు.

సివిల్ ఆసుపత్రి బయట వైద్య విద్యార్థులు

భోజనం చేస్తుండగా..

అహ్మదాబాద్ నుంచి లండన్ గాత్విక్‌కు వెళుతున్న విమానం జూన్ 12వ తేదీన క్రాష్ అయ్యింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే చెట్లు, భవనాలను ఢీకొట్టి పేలిపోయింది.

ఇందులో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది చనిపోయినట్లుగా ఎయిరిండియా ప్రకటించింది.

అలాగే విమానం ఢీకొట్టిన భవనంలో మెడికల్ పీజీ ఇంటర్న్ విద్యార్థులు భోజనం చేస్తున్నారు. అదొక మెస్. ఆ పక్కనే వారికి చెందిన హాస్టల్స్ తోపాటు సివిల్స్ ఆసుపత్రికి చెందిన సిబ్బంది రెసిడెన్షియల్ క్వార్టర్లు కూడా ఉన్నాయి.

ఈ ప్రమాదంలో నలుగురు మెడికోలు, డాక్టర్ల బంధువులు నలుగురు చనిపోయారని బీజే మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ మీనాక్షి పారిఖ్ బీబీసీతో చెప్పారు.

”మేం నలుగురు వైద్య విద్యార్థులను పోగొట్టుకున్నాం. ఇద్దరు ఫస్టియర్ ఎంబీబీఎస్, మరో ఇద్దరు సెకండియర్ ఎంబీబీఎస్ విద్యార్థులున్నారు. అలాగే డాక్టర్లకు చెందిన మరో నలుగురు బంధువులను పోగొట్టుకున్నాం” అని చెప్పారు

మొత్తం విమానంలో ప్రయాణిస్తున్న వారితో పాటు వైద్య విద్యార్థులు, బంధువులు కలుపుకొని మొత్తం 249 చనిపోయినట్లు స్పష్టమవుతోంది.

”అప్పటికే చాలా మంది వైద్య విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేసి తిరిగి వెళ్లారు. ఒక అరగంట ముందు ప్రమాదం జరిగి ఉంటే, మరెంత మంది చనిపోయేవారో మాటలకు కూడా అందడం లేదు” అని సెక్యురిటీ గార్డు ఒకరు బీబీసీతో చెప్పారు.

వైద్య విద్యార్థులు హాస్టళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు.

ప్రస్తుతం ఆ భవనాలన్నీ మంటల ధాటికి తీవ్రంగా దెబ్బతిని కనిపిస్తున్నాయి.

సివిల్ ఆసుపత్రి వద్ద విషాదకర వాతావరణం

సివిల్ ఆసుపత్రి వద్ద విషాద వాతావరణం

సివిల్ ఆసుపత్రి వద్ద విషాదవాతావరణం కనిపించింది.

ఉదయం నుంచి అంబులెన్సులు వస్తూ, వెళుతూ కనిపించాయి. అందులో బట్టల్లో చుట్టిన మృతదేహాలను తీసుకువచ్చి పోస్టుమార్టం వద్ద అప్పగిస్తున్నారు. అనంతరం ఆ మృతదేహాలను గుర్తుపట్టిన వారికి అప్పగించే ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి సివిల్ ఆసుపత్రి సుమారు ఒకటిన్నర నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది.

గాలింపు చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో శకలాల కింద మృతదేహాలు కనిపిస్తే, వెంటనే అంబులెన్సులో తీసుకువచ్చి పోస్టుమార్టంకు తరలిస్తున్నారు.

అంబులెన్సులు వచ్చిన ప్రతిసారీ మృతుల కుటుంబీకులు, బంధువులు వచ్చి తమ వారి కోసం వాకబు చేస్తూ వెళుతున్నారు. అంబులెన్సుల సైరన్లతో ఆ ప్రాంతమంతా హడావుడి వాతావరణం కనిపించింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే పరిస్థితి.

విమాన ప్రయాణికుల పరంగా వారిని గుర్తించడం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. విమానం క్రాష్ అయినప్పుడు ఒక్కసారిగా పేలుడు సంభవించి అందులోని ప్రయాణికులు, సిబ్బంది, పైలెట్లు సజీవ దహనమైపోయారు. దీనివల్ల మృతదేహాలు గుర్తించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో అవశేషాలు సేకరించి డీఎన్ఏ పరీక్షల సాయంతో కుటుంబీకులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది.

గురువారం రాత్రి నుంచి కూడా విమాన ప్రయాణికులకు చెందిన కుటుంబీకుల నుంచి డీఎన్ఏ శాంపిల్స్ తీసుకుని మృతులతో సరిపోల్చే పనిలో వైద్య సిబ్బంది నిమగ్నమయ్యారు.ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 72 గంటలు పడుతుందని వైద్య సిబ్బంది చెబుతున్నారు.

”ప్రస్తుతం డీఎన్ఏ నమూనాలు సేకరించి కుటుంబసభ్యులతో సరిపోల్చే ప్రక్రియ కొనసాగుతోంది. అర్ధరాత్రి వరకు వైద్యులు పనిచేస్తున్నారు” అని బీజే మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ మీనాక్షి పారిఖ్ చెప్పారు.

డీఎన్ఏ శాంపిల్స్ సేకరించిన మూడు రోజుల తర్వాతే కుటుంబీకులకు మృతుల శరీర భాగాలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది.

ముంబయి, రాజస్థాన్, పుణె వంటి ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు, కుటుంబసభ్యులు అహ్మదాబాద్‌లోనే ఎదురుచూస్తున్నారు.

సివిల్ ఆసుపత్రి వద్ద అంబులెన్స్‌లు

విమాన ప్రమాదానికి కారణాలపై అన్వేషణ

ప్రమాదానికి కారణాలను అన్వేషించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇప్పటివరకు విమాన ప్రమాదానికి గల కారణాలు బయటకు రాలేదు. వివిధ విశ్లేషణలు ఉన్నప్పటికీ, విమానం ఎందుకు కూలిందనే విషయంపై మాత్రం స్పష్టత రాలేదు.

శుక్రవారం విమానంలో కీలకమైన ఫ్లైట్ డాటా రికార్డర్ (బ్లాక్ బాక్స్)ను ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) స్వాధీనం చేసుకుంది.

ఈ మేరకు బ్లాక్ బాక్స్ లభించినట్లుగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.

”ప్రమాదానికి గల కారణాలపై జరుగుతున్న దర్యాప్తునకు ఇది ఎంతో సహకరిస్తుంది” అని పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS