SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
జన్యుసవరణ చేసిన రెండు సరికొత్త వరివంగడాలను ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ దిల్లీలో ఆవిష్కరించారు.
భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసిఏఆర్)కి చెందిన పూసాలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఎఆర్ఐ) అభివృద్ధి చేసిన పూసా డీఎస్టీ రైస్–1 అనే రకాన్ని, హైదరాబాద్ రాజేంద్రనగర్లోని భారతీయ వరి పరిశోధన సంస్థ (ఐఐఆర్ఆర్) రూపొందించిన డీఆర్ఆర్ రైస్100 (కమల)ను మే 4న ఆవిష్కరించారు.
‘‘ఈ రెండు కొత్త రకాల విత్తనాలతో పంట దిగుబడిలో 20 శాతం పెరుగుదల కనిపిస్తుంది. గ్రీన్హౌస్ ఉద్గారాలు తగ్గుతాయి. ఈ కొత్త విత్తనాలతో ఎరువుల వాడకం తగ్గుతుంది.
ఈ విత్తనాలతో సాగు చేస్తే నీటిని ఆదా చేయడంతో పాటు, వాతావరణపరంగా ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకోవచ్చు’ అని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది.
ఈ రెండు రకాలు పంటకాలాన్ని 20 రోజులు తగ్గిస్తాయి.
సహజంగా వరి పంట కాలం సుమారు 130 రోజులు కాగా ఈ విత్తనాలతో 110రోజులకే పంట వస్తుంది.
మొత్తంగా పంట కాలాన్ని తగ్గించడంతో పాటు దిగుబడిని పెంచుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ చెప్తోంది.
డీఆర్ఆర్ రైస్ 100 రకం ఒక్కో కంకికి ఎక్కువ గింజలను ఇస్తుందని, పూసా రైస్ డీఎస్టీ–1 రకం ఉప్పు, ఆల్కలీన్ నేలల్లో కూడా దిగుబడిని 9.66 శాతం నుంచి 30.4 శాతానికి పెంచుతుందని కేంద్ర వ్యవసాయశాఖ ప్రకటించింది.
ఈ రకాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, క ర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ కోసం అభివృద్ది చేసినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న భూతాపాన్ని తట్టుకుంటూ 20 శాతం అధిక దిగుబడి ఇవ్వగలిగిన ఈ రెండు సరికొత్త జన్యు సవరణ వరి వంగడాలను క్రిస్పర్ క్రాస్–9 అనే సరికొత్త జీనోమ్ ఎడిటింగ్ (జీఈ) టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేసినట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు.

ఫొటో సోర్స్, x.com/OfficeofSSC
ఎలా అభివృద్ది చేశారంటే..
జీన్ ఎడిటింగ్ అనేది ఓ సాంకేతిక ప్రయోగం.
జీవ ప్రయోగశాలలో జీవ కణంలో ఉండే జన్యు క్రమాన్ని కత్తిరించడం లేదా అతికించడం. ఈ టెక్నాలజీ ద్వారా శాస్త్రవేత్తలు ఒక మొక్క లేదా జంతువు డీఎన్ఏలో చిన్న మార్పులు చేసేందుకు వీలు ఉంటుంది.
ఈ విధమైన టెక్నాలజీలో క్రిస్పర్ కాస్ 9 అనే సాధనాన్ని వినియోగిస్తారు.
దీనిని సులువుగా జన్యు కత్తెర అని అనొచ్చు.
“క్రిస్పర్ కాస్ 9 ఉపయోగించి శాస్త్రవేత్తలు జన్యు క్రమంలో నిర్దిష్ట స్థానాల వద్ద డీఎన్ఏను కత్తిరిస్తారు లేదా జన్యువును తొలగిస్తారు లేదా సవరిస్తారు” అని వ్యవసాయ ఆర్ధిక శాస్త్రవేత్త డాక్టర్ కిలారు పూర్ణచంద్రరావు బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సాంబ మసూరి ఆధారంగానే డీఆర్ఆర్ రైస్ 100(కమల)
సాంబ మసూరి(బీపీటీ –5204) ఆధారంగానే కమల రకాన్ని హైదరాబాద్ రాజేంద్రనగర్లోని భారతీయ వరి పరిశోధన సంస్థ (ఐఐఆర్ఆర్) అభివృద్ధి చేసింది.
పూసా డీఎస్టీ రైస్–1ను ఎంటీయూ 1010 ఆధారంగా ఐసీఏఆర్–ఐఏఆర్ఐ రూపొందించింది.
“సాంబ మసూరి రకానికి చెందిన బీపీటీ 5204ని తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి సాధించేందుకు జీన్ ఎడిట్ చేశారు. కానీ ప్రయోగదశ నుంచి క్షేత్రస్థాయికి రావడానికి టైం పట్టొచ్చు. బీపీటీ 5204ను నాలుగు దశాబ్దాల కితమే ఆవిష్కరించారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎక్కువమంది తినే బియ్యం సాంబమసూరి. కర్నూలు నంద్యాల సోనా బియ్యం ఇలా చాలా రకాలు బీపీటీ 5204వే” అని బాపట్లలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ డాక్టర్ సతీష్ యడవల్లి బీబీసీతో అన్నారు.
కేంద్ర వ్యవసాయ శాఖ కమల, పూసా పేర్లతో జీనోమ్ ఎడిట్ చేసిన రెండు కొత్త వరి రకాలపై వ్యవసాయరంగ నిపుణులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
నేల సారం, పోషకాలు, నీరు, సూక్ష్మజీవుల లాంటి వాటిని పట్టించుకోకుండా కేవలం ఒక మార్పుతో దిగుబడి సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు.
దిగుబడి పెరగడం కోసమే ఈ కొత్తరకం వరి విత్తనాలని ప్రభుత్వం చెబుతోంది.
“నానాటికీ అధికమవుతున్న సాగు ఖర్చులు, గిట్టుబాటు లేని ధరలు రైతులకు అసలు సమస్య దానిపై దృష్టి పెట్టకుండా ఎక్కడా శాస్త్రీయత లేని ఈ జీన్ ఎడిట్ విత్తనాలతో ఏం ప్రయోజనం” అని వ్యవసాయ రంగ నిపుణుడు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఈ వరి రకాలు ఒక కొత్త సాంకేతిక విప్లవం అని, వరి గింజలోని ఒక జన్యువు అధిక దిగుబడి ఇస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు.
ఇలా జీన్ ఎడిట్తో జరిగే పర్యవసానాలు, దీర్ఘకాలిక పరిణామాల గురించి వాళ్లు మాట్లాడటం లేదు.
ఆ విత్తనాలతో వచ్చే పంటతో ఆహారం చేసుకుని తినే మనుషుల మీద ఎలాంటి ప్రభావాలు ఉంటాయో ఎవరికీ తెలియదు.
ఇక ఇటువంటి విత్తనాల వల్ల సహజ విత్తనాలు కలుషితమైతే తిరిగి వాటిని ‘శుద్ధి’ చేయడం అసాధ్యం. పరిశోధనలు, పరిశీలనలు, పరీక్షలను కొన్ని ఏళ్ల పాటు ప్రయోగశాలలో జరపాల్సి ఉండగా, కేంద్రం తొందర పడి ఈ రెండు వంగడాలను విడుదల చేయడం సరికాదు” అని దొంతి నరసింహారెడ్డి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ విమర్శలు, వాదనపై మేం మాట్లాడం
“కేంద్రమంత్రి ఆ రోజు లాంఛనంగా ఆవిష్కరించారు కానీ ఈ వంగడాలు ఐడింటిఫికేషన్ దశలోనే ఉన్నాయి. మూడు నాలుగు నెలల తర్వాతే ఆ వరి విత్తనంపై స్పష్టత వస్తుంది. ఇప్పుడే దాని గురించి మేం మాట్లాడలేం. విమర్శల గురించి స్పందించలేం” అని హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని భారతీయ వరి పరిశోధన సంస్థ (ఐఐఆర్ఆర్) ప్రిన్సిపల్ సైంటిస్ట్ సాయి ప్రసాద్ బీబీసీతో అన్నారు.
వరి కంకికి గింజలు పెరిగేటట్టు చేసిన ఈ కొత్తరకం జన్యుసవరణ విత్తనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే వాటి గురించి మాట్లాడితే బాగుంటుంది. అప్పుడే మాట్లాడటం సరికాదు. చాలామంది వీటిని జన్యుమార్పిడి(జెనిటిక్ మాడిఫికేషన్) విత్తనాలు అనుకుంటున్నారు. వేరే జీవి కణాల నుంచి తీసుకువచ్చి కలిపితే అప్పుడు జన్యుమార్పిడి అంటారు.” అని ఇక్రిశాట్లో పనిచేసి రిటైర్ అయిన వ్యవసాయ ఆర్ధిక శాస్త్రవేత్త డాక్టర్ కిలారు పూర్ణచంద్రరావు బీబీసీతో అన్నారు.
”బాసిల్లస్ తురింజియెన్సెస్ అనే బ్యాక్టీరియా నుంచి తీసుకువచ్చిన జన్యువును పత్తి విత్తనంలో జొప్పించి బీటీ కాటన్ తెచ్చారు. దీన్ని జెనిటిక్ మాడిఫికేషన్ అంటారు.. కానీ ఇక్కడ అలా చేయలేదు. ఇక్కడ శాస్త్రవేత్తలు చేసింది జెనిటిక్ ఎడిటింగ్(జన్యు సవరణ) మాత్రమే. అంటే వరి విత్తనంలోనే సవరణ చేశారు. అందుకే క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే దాని ఫలితంపై మాట్లాడగలం” అని ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)