SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
3 జూన్ 2025
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు 18 ఏళ్ల కల నెరవేరింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టుపై ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ జట్టు లక్ష్యం ఛేదించలేకపోయింది.
మొదట బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ అత్యధికంగా 43 పరుగులు సాధించాడు.
191 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. శశాంక్ (30 బంతుల్లో 61 పరుగులు) చివరివరకూ పోరాడాడు.

ఫొటో సోర్స్, Getty Images
రాణించిన కోహ్లీ, జితేశ్
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నారు.
మొదట బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 9 బంతుల్లో 16 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్.. జేమీసన్ బౌలింగ్లో క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ బ్యాట్ ఝలిపించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
అయితే, 18 బంతుల్లో 24 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ను యుజ్వేంద్ర చాహల్ పెవిలియన్ పంపాడు.
ఆ తర్వాత వచ్చిన రజత్ పటిదార్తో కలిసి విరాట్ కోహ్లీ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.
96 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. జేమీసన్ బౌలింగ్లో కెప్టెన్ రజత్ పటిదార్(26) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అజ్మతుల్లా బౌలింగ్లో కోహ్లీ ఔటయ్యాడు.
ఉన్నంతసేపు జితేశ్ శర్మ బౌండరీలు కొట్టడంతో ఆర్సీబీ భారీ స్కోరు దిశగా కదిలింది. అయితే, లివింగ్స్టోన్ (25 పరుగులు), జితేశ్(24 పరుగులు), షెపర్డ్(17 పరుగులు), పాండ్యా(4 పరుగులు) వికెట్లు త్వరత్వరగా కోల్పోవడంతో జట్టు 190 పరుగులే చేయగలిగింది.

ఫొటో సోర్స్, Getty Images
పోరాడిన శశాంక్ సింగ్
191 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఆచితూచి బ్యాటింగ్ చేసింది.
ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్లు మొదటి వికెట్కు 43 పరుగుల భాగస్వామ్యం అందించారు. 19 బంతుల్లో 24 పరుగులు చేసిన ప్రియాంశ్ ఐదో ఓవర్లో హేజిల్వుడ్ బౌలింగ్లో ఔటయ్యాడు. బౌండరీ లైన్ వద్ద ఫిల్ సాల్ట్ చక్కని క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇంగ్లిస్.. ప్రభ్సిమ్రన్కు జతకలవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
తొమ్మిదో ఓవర్లో ప్రభ్సిమ్రన్(26), పదో ఓవర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(1) ఔటవడంతో జట్టు కష్టాల్లో పడింది.
అయితే, ఇంగ్లిస్ బ్యాట్ ఝలిపించడంతో జట్టు లక్ష్యం దిశగా సాగింది. కాగా, 23 బంతుల్లో 39 పరుగులు చేసిన ఇంగ్లిస్ను కృనాల్ పాండ్యా పెవిలియన్ పంపడంతో పంజాబ్ కోలుకోలేకపోయింది.
మిడిల్ ఓవర్లలో కృనాల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు భారీ షాట్లు ఆడలేకపోయారు. అతను 4 ఓవర్లు వేసి కేవలం 17 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
నేహల్, శశాంక్ పరుగులు చేయడంలో తడబడటంతో చేయాల్సిన రన్ రేట్ అమాంతం పెరిగింది. దీంతో నేహల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన స్టోయినిస్ హిట్టింగ్ ప్రారంభించాడు. మొదటి బంతికి సిక్సర్ బాదిన అతను రెండో బంతికి ఔటయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన అజ్మతుల్లా కూడా ఔటవడంతో ఛేదనలో శశాంక్(61 పరుగులు)కు ఎవరూ అండగా నిలవలేకపోయారు.
చివర్లో శశాంక్ హిట్టింగ్ చేసినా అప్పటికే ఆలస్యమైంది. విజయానికి 7 పరుగుల దూరంలో నిలిచింది పంజాబ్ కింగ్స్.
బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్, కృనాల్ చెరో రెండు వికెట్లు తీశారు.

ఫొటో సోర్స్, Getty Images
మ్యాచ్ సాగిందిలా..
22:35 (IST)
లక్ష్య ఛేదనలో పంజాబ్కు ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్లు మొదటి వికెట్కు 43 పరుగుల భాగస్వామ్యం అందించారు.
19 బంతుల్లో 24 పరుగులు చేసిన ప్రియాంశ్ ఐదో ఓవర్లో హేజిల్ వుడ్ బౌలింగ్లో ఔటయ్యాడు.
తొమ్మిదో ఓవర్లో ప్రభ్సిమ్రన్(26), పదో ఓవర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(1) ఔటయ్యారు.
పది ఓవర్లు పూర్తయ్యేసరికి పంజాబ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
21:45 (IST)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది.
ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ అత్యధికంగా 43 పరుగులు సాధించాడు.
పంజాబ్ బౌలర్లలో జేమీసన్, అర్ష్దీప్ చెరో మూడు వికెట్లు తీశారు.
20:50 (IST)
ఆర్సీబీ జట్టు నిలకడగా బ్యాటింగ్ చేసింది.
15 ఓవర్లు పూర్తయ్యేసరికి బెంగళూరు జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.
35 బంతుల్లో 43 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. అజ్మతుల్లా బౌలింగ్లో క్యాచ్ ఔటయ్యాడు.
లివింగ్స్టోన్(16), జితేశ్ శర్మ(1) క్రీజులో ఉన్నారు.
96 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. జేమీసన్ బౌలింగ్లో కెప్టెన్ రజత్ పటిదార్(26) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

ఫొటో సోర్స్, Getty Images
20:22 (IST)
బెంగళూరు జట్టు 10 ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ(27), రజత్ పటిదార్(18)లు ఆచితూచి ఆడుతున్నారు.
ఏడో ఓవర్లో ఆర్సీబీ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. 18 బంతుల్లో 24 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ను చాహల్ పెవిలియన్ పంపాడు.
19:59 (IST)
మొదట బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
ఫిల్ సాల్ట్ 9 బంతుల్లో 16 పరుగులు చేసి ఔటయ్యాడు.
బెంగళూరు జట్టు ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి ఒక వికెట్ కోల్పోయి 46 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లీ 8 బంతుల్లో 12 పరుగులు, మయాంక్ అగర్వాల్ 13 బంతుల్లో 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏ జట్టులో ఎవరెవరు?
19:29 (IST)
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పటీదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్వుడ్.
పంజాబ్ కింగ్స్ జట్టు: ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, అర్ష్దీప్ సింగ్, కైల్ జామీసన్, విజయ్కుమార్, యుజ్వేంద్ర చాహల్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS