SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
ఒక గంట క్రితం
చదివే సమయం: 3 నిమిషాలు
హార్ముజ్ జలసంధిని తెరవాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇరాన్కు తాజాగా 48గంటల గడువు విధించారు. లేదంటే ఇరాన్ విద్యుత్ ప్లాంట్స్ను ‘‘తుడిచిపెట్టేస్తా’’మని హెచ్చరించారు.
‘‘ ఈ జలమార్గాన్ని ఎటువంటి బెదిరింపులు లేకుండా సంపూర్ణంగా తెరిచేందుకు సరిగ్గా ఇప్పటి నుంచి 48గంటల సమయం ఇస్తున్నాం’’ అని ప్రెసిడెంట్ ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు.
ఈమేరకు ఇరాన్కు ట్రంప్ ఇచ్చిన గడువు మార్చి 24 ఉదయం 3 గంటల 14 నిమిషాలతో ముగుస్తుంది. (భారత కాలమానం ప్రకారం మార్చి 24వ తేదీ ఉదయం 5 గంటల14 నిమిషాలు).
ఇరాన్ చమురు, విద్యుత్ స్థావరాలపై దాడులు జరిగితే గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా ఇంధన స్థావరాలను ఇరాన్ సైన్యం లక్ష్యంగా చేసుకుంటుందని ఆ దేశ ప్రభుత్వ మీడియా తెలిపింది.
ట్రంప్ తాజా హెచ్చరికల తర్వాత ఇరాన్ ఈ ప్రకటనచేసింది.

ఫొటో సోర్స్, Getty Images
20 శాతం చమురు రవాణా ఈ జలసంధి ద్వారానే
అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న ఇరాన్పై దాడి ప్రారంభించాయి. ఆ తర్వాత ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసింది.
ఈ జలసంధికి ఉత్తరంవైపున ఇరాన్ ఉంటుంది.
దక్షిణం వైపు ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంటాయి.
గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే ఈ జలసంధి అత్యంత ఇరుకైనది.
జలసంధి మొదలయ్యేచోట, ముగిసే చోట 50 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది.
ఇరుకుగా ఉండే చోట దాని వెడల్పు కేవలం 33కిలోమీటర్లు.
ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ రవాణాలో 20శాతం ఈ జలసంధిగుండానే జరుగుతుంది.
ఇరాన్తో పాటు ఇరాక్, కువైట్, ఖతార్, సౌదీఅరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కూడా ఈ మార్గం గుండా చమురు రవాణా సాగుతుంది.

భారీగా పెరుగుతున్న చమురు ధరలు
ఈ జలసంధి గుండా నెలకు దాదాపు 3 వేల ఓడలు ప్రయాణిస్తాయి. ట్యాంకర్లపైన, ఇతర ఓడలపైనా దాడులు చేస్తామని ఇరాన్ బెదిరించడంతో ఇప్పుడు ఈ సంఖ్య బాగా తగ్గిపోయింది.
యుద్ధం మొదలైనప్పటి నుంచి కనీసం 21 నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్టు మార్చి 18న న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్పీ తెలిపింది.
యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇంధన ధరలు బాగా పెరిగాయి.
ముడిచమురు ధర ఒక బ్యారెల్ వంద డాలర్లు దాటింది.
ఈ ఏడాది 70శాతం కన్నా ఎక్కువ పెరిగింది.
గత ఏడాదితో పోలిస్తే దాదాపు 50శాతం ఎక్కువ.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)



