Home జాతీయ national telgu హాయిఫా: ఇజ్రాయెల్‌‌లోని ఈ నగరాన్ని ఇరాన్ ఎందుకు టార్గెట్‌ చేసింది? మేజర్ దల్‌పత్ సింగ్‌‌ను ఈ...

హాయిఫా: ఇజ్రాయెల్‌‌లోని ఈ నగరాన్ని ఇరాన్ ఎందుకు టార్గెట్‌ చేసింది? మేజర్ దల్‌పత్ సింగ్‌‌ను ఈ నగరపు హీరో అని ఎందుకంటారు?

3
0

SOURCE :- BBC NEWS

హాయిఫా నగరం

ఫొటో సోర్స్, AHMAD GHARABLI/AFP via Getty Images

6 గంటలు క్రితం

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమానికి కీలకమైన పలు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా క్షిపణి దాడులు చేసింది. కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్ క్షిపణి నిరోధక వ్యవస్థను దాటుకుని, నివాస ప్రాంతాల్లోకి చొచ్చుకుని వెళ్లాయి.

శుక్రవారం నుంచి ఇజ్రాయెల్ చేస్తోన్న దాడుల్లో 224 మంది చనిపోయినట్లు ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది. మరోవైపు ఇజ్రాయెల్‌లో మరణాల సంఖ్య 24కు చేరింది.

ఇరాన్ దాడుల్లో చనిపోయిన వారిలో టెల్ అవీవ్, హాయిఫా, ఇతర నగరాలకు చెందిన ప్రజలు ఉన్నారని ఇజ్రాయెల్ తెలిపింది.

ఇజ్రాయెల్‌కు చెందిన రెండు ప్రముఖ నగరాలు టెల్ అవీవ్, హాయిఫాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది.

హాయిఫా అనేది ఇజ్రాయెల్‌లోని ఉత్తర రేవు పట్టణం. ప్రముఖ నౌకాశ్రయం, ఆయిల్ రిఫైనరీ ఇక్కడే ఉన్నాయి.

టెల్ అవీవ్, హాయిఫా, ఇతర ఇజ్రాయెల్ నగరాలను లక్ష్యంగా చేసుకుని డజన్ల కొద్ది ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు దాడులు చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ టీవీ రిపోర్టు చేసింది.

అయితే, ఇజ్రాయెల్ నగరం హాయిఫాకు భారత్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇజ్రాయెల్‌కు హాయిఫా ఎందుకంత ప్రత్యేకం?

ఇజ్రాయెల్ వ్యవహారాలపై నిపుణుడైన సీనియర్ జర్నలిస్ట్ హరేంద్ర మిశ్రా ప్రస్తుతం జెరూసలేంలో ఉంటున్నారు.

ఆయనతో బీబీసీ ప్రతినిధి అభయ్ కుమార్ సింగ్ మాట్లాడారు. ఇజ్రాయెల్‌కు హాయిఫా ఎందుకంత ప్రత్యేకమో హరేంద్ర మిశ్రా వివరించారు.

” ఇజ్రాయెల్‌లో మూడవ అతిపెద్ద నగరం హాయిఫా. ఆ దేశపు ఉత్తరాన ఉన్న ఈ నగరం కేవలం జనాభా పరంగా మాత్రమే కాక, ఆర్థిక పరంగా కూడా చాలా ముఖ్యమైంది. ఈ నగరంలో చాలా హైటెక్ కంపెనీలు బలమైన ఉనికితో ఉన్నాయి. అది మైక్రోసాఫ్ట్ అయినా, గూగుల్ లేదా ఇంటెల్ అయినా.. అన్ని హైటెక్ కంపెనీల కార్యాలయాలు హాయిఫాలోనే ఉన్నాయి.” అని తెలిపారు.

హాయిఫా నగరం ఇజ్రాయెల్‌లో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీగా ప్రసిద్ధి. ఇదే ఈ నగర ఆర్థిక ప్రాధాన్యతను పెంచుతోంది.

ఇజ్రాయెల్ అత్యవసర, భద్రతా సేవల సిబ్బంది

ఫొటో సోర్స్, AHMAD GHARABLI/AFP via Getty Images

హాయిఫాలో ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి

ఆయిల్ రిఫైనరీ నుంచి పెద్ద ఎత్తున పొగ వస్తోన్న వీడియోను బీబీసీ ధ్రువీకరించింది.

ఇజ్రాయెల్ అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఉన్న ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగమేఘాలు కమ్ముకున్నట్లు ఈ వీడియోలో కనిపించింది.

ఇరాన్ దాడుల తర్వాత వీడియో ఇది.

ఈ వీడియోకు చెందిన పలు కీలక ఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేపట్టింది బీబీసీ. ఏజెన్సీ ఇమేజీలతో కూడా వీటిని పోల్చి చూసింది. ఇలా ఆయిల్ రిఫైనరీపై దాడి జరిగినట్లు ధ్రువీకరించింది.

ఆ వీడియోలో కనిపించిన కీలక ఫీచర్లను, ఏజెన్సీ చిత్రాలను గూగుల్ ఎర్త్, ఆ ప్రాంతంలోని పాత ఫుటేజీలతో బీబీసీ పోల్చిచూసింది.

ఇజ్రాయెల్ మీడియా రిపోర్టుల ప్రకారం రిఫైనరీలో కార్యకలాపాలు నిర్వహించే బాజాన్ గ్రూప్ కూడా, రాత్రిపూట ఇరాన్ క్షిపణి దాడులు జరిగినట్లు చెప్పింది. దీనివల్ల పైప్‌లైన్లు, ట్రాన్స్‌మిషన్ లైన్లు దెబ్బతిన్నట్లు తెలిపింది.

రిపైనరీలో చమురు వెలికితీత పని నడుస్తోందని, కానీ ఆ సైటులో మిగిలిన ప్రాంతాలను మూసివేసినట్లు బాజాన్ గ్రూప్‌ తెలిపింది.

హాయిఫాలో ఇజ్రాయెల్ ప్రముఖ నౌకాశ్రయం ఉంది. ఎన్నో విషయాల్లో ఈ నగరానికి ప్రాధాన్యత ఉంది.

”హాయిఫాలో నౌకాశ్రయం చాలా ముఖ్యమైంది. ఇక్కడి నుంచే పెద్ద మొత్తంలో సరుకు రవాణా అవుతూ ఉంటుంది. చారిత్రాత్మక పరంగా చూసుకుంటే, ఇజ్రాయెల్‌కు బయట ప్రపంచంతో ఘర్షణలు తొలుత ఈ నగరం నుంచే మొదలయ్యాయి” అని హరేంద్ర మిశ్రా తెలిపారు.

హాయిఫా నౌకాశ్రయాన్ని 2023లో అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ నౌకాశ్రయానికి చెందిన 70 శాతం వాటా అదానీ గ్రూప్ చేతిలో ఉండగా, 30 శాతం వాటా ఇజ్రాయెల్‌కు చెందిన గడోట్ గ్రూప్ చేతిలో ఉంది.

ఈ నగర జనాభా గురించి వివరించిన హరేంద్ర మిశ్రా… నాలుగు లక్షల మంది జనాభా ఉన్న ఈ నగరం భిన్న జాతులకు ప్రతీకగా నిలుస్తుందన్నారు.

”గణనీయమైన సంఖ్యలో అరబ్ జనాభా ఇక్కడ ఉన్నారు. వీరిలో ముస్లింలు, క్రిస్టియన్లు ఇద్దరూ ఉన్నారు. బహాయీ కమ్యూనిటీకి చెందిన ఆధ్యాత్మిక ప్రాంతం కూడా ఉంది. అచ్చం దిల్లీలో లోటస్ టెంపుల్ మాదిరి. ఇక్కడ బహాయీ గార్డెన్ ఉంది” అని తెలిపారు.

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం బహాయీ వరల్డ్ సెంటర్‌కు నిలయం హాయిఫా.

ఎందుకు కేవలం టెల్ అవీవ్, హాయిఫాలనే లక్ష్యంగా చేసుకుంది?

ఈ నగర ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఇరాన్ దీనిపై దాడులు చేసిందా? అనే దానిపై హరేంద్ర మిశ్రా మాట్లాడారు.

” అత్యధిక వ్యూహాత్మక, ఆర్థిక ప్రాధాన్యత ఉన్న నగరాలను మాత్రమే ఇరాన్ లక్ష్యంగా చేసుకుందని నేను భావిస్తున్నా. ఇప్పటి వరకు జెరూసలేం జోలికి వెళ్లలేదు. ఎందుకంటే, ఎన్నో మతాలకు ఇది పవిత్ర ప్రదేశం” అని చెప్పారు.

ఇరాన్ క్షిపణులు చాలా వరకు నివాస ప్రాంతాలపైనే పడ్డట్లు ఆయన తెలిపారు.

హాయిఫా, టెల్ అవీవ్ లాంటి నగరాలు ఎక్కువ జనసాంద్రతతో ఉంటాయి. ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థకు ఇవే వెన్నెముకగా పరిగణిస్తుంటారు.

”జెరూసలేం కూడా ఎక్కువ జనసాంద్రతతో ఉంటుంది. కానీ, ఇక్కడ ఇస్లామిక్ పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. అందుకే, దీని జోలికి ఇరాన్ వెళ్లి ఉండకపోవచ్చు” అని అన్నారు.

హాయిఫా పోర్టు

ఫొటో సోర్స్, Universal Images Group via Getty Images

హాయిఫాతో భారత్‌కు ఉన్న సంబంధం

హాయిఫా, భారత్‌కు ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. ఇది 1918 నాటి చారిత్రాత్మక కథనంతో ముడిపడి ఉందని చెప్పారు.

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో తుర్కియే, జర్మనీ, ఆస్ట్రియా-హాంగేరీలకు చెందిన సంయుక్త దళాల ఆక్రమణ నుంచి హాయిఫా నగరానికి స్వతంత్రత కల్పించేందుకు బ్రిటీష్ సామ్రాజ్యం తరఫున భారత అశ్విక దళం పోరాడింది.

ఈ చరిత్రకు ఇజ్రాయెల్‌లో కూడా పూర్తి గుర్తింపు ఉందని హరేంద్ర మిశ్రా తెలిపారు.

”హాయిఫాలో చాలా పాఠశాలలో ఈ చరిత్రను బోధిస్తారు. ‘హాయిఫా హీరో ఎవరు?’ అని పిల్లల్ని అడిగితే, మేజర్ దల్‌పత్ సింగ్ అని అంటారు.” అని చెప్పారు.

ఈ యుద్ధంలో జోధ్‌పూర్ లాన్సర్స్ కమాండర్, మేజర్ దల్‌పత్ సింగ్ షేఖావత్ చనిపోయారు. ఆ తర్వాత ఆయనకు మిలటరీ క్రాస్ అవార్డు దక్కింది.

ఈ యుద్ధంలో బ్రిటీష్ ప్రభుత్వం తరఫున పోరాడుతూ 44 మంది సైనికులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.

”ఇండియన్ ఎంబసీ, హాయిఫా మున్సిపాలిటీ కలిసి ప్రతి ఏడాది హాయిఫా దినోత్సవాన్ని నిర్వహిస్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడకు వచ్చినప్పుడు, హాయిఫా వెళ్లి భారతీయ సైనికులకు నివాళులు అర్పించారు” అని హారేంద్ర మిశ్రా చెప్పారు.

దిల్లీలో ఒక రోడ్డుకు ఉన్న తీన్ మూర్తి చౌక్‌ పేరును తీన్ మూర్తి హాయిఫా చౌక్‌గా మార్చారు. 2018లో భారత్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా హాజరయ్యారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)