Home జాతీయ national telgu సౌదీ ఖజానాలో జమ అయిన కోట్లాది రూపాయల పరిహారానికి భారతీయ వారసులెవరు, దీనిపై వివాదమేంటి?

సౌదీ ఖజానాలో జమ అయిన కోట్లాది రూపాయల పరిహారానికి భారతీయ వారసులెవరు, దీనిపై వివాదమేంటి?

3
0

SOURCE :- BBC NEWS

మక్కాలోని ప్రధాన మసీదు

ఫొటో సోర్స్, Leiden University Libraries

హజ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంటున్న వేళ మక్కాలోని కెయి రుబాత్ అనే 19వ శతాబ్దం నాటి అతిథిగృహంపై నెలకొన్న వివాదం భారత్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది వారసత్వానికి సంబంధించిన వివాదం.

మలబార్ (ప్రస్తుతం కేరళ)కు చెందిన సంపన్న భారతీయ వర్తకుడు మయాన్‌కుట్టి 1870లో ఈ అతిథి గృహాన్ని కట్టించారు. ఈయన వ్యాపార సామ్రాజ్యం అప్పట్లో ముంబయి నుంచి పారిస్ వరకు విస్తరించింది.

ఇస్లాం పవిత్రస్థలమైన మస్జీద్ అల్-హరమ్‌కు సమీపంలోని ఈ భవనాన్ని 1971లో మక్కా విస్తరణ కోసం కూల్చేశారు. ఇందుకు పరిహారంగా సౌదీ అథారిటీ తన కోశాగారంలో1.4 మిలియన్ రియాల్స్‌ను (ప్రస్తుతం 3,73,000 డాలర్లను) డిపాజిట్ చేసింది. కానీ అప్పట్లో ఈ మొత్తాన్ని అప్పగించడానికి చట్టబద్దమైన వారసుడిని గుర్తించలేకపోయినట్టు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

వారసులు ఎవరు?

దశాబ్దాల తరబడి సౌదీ అరేబియా ఖజానాలో ఉండిపోయిన ఈ సంపద గురించి ఇప్పుడు కెయికి చెందిన రెండు కుటుంబాలు గొడవ పడుతున్నాయి. ప్రతి ఒక్కరూ తామే అసలైన వారసులమంటూ, ఆ పరిహారాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

కానీ ఇప్పటిదాకా ఎవరూ తామే అసలైన వారసులమని నిరూపించుకోలేకపోయారు.

దశాబ్దాలుగా అటు కేంద్రం, ఇటు కేరళలో వరుసగా వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ వారసత్వ సంపద విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించాలని ప్రయత్నించి విఫలమయ్యాయి.

అయితే, సౌదీ అధికారులు ఈ పరిహార మొత్తాన్ని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారో లేదో కూడా స్పష్టత లేదు.

ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేయాలని కొంతమంది కుటుంబ సభ్యుల డిమాండ్‌ను పక్కన పెడితే, ఈ మొత్తం విలువ నేడు 1 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.8,579 కోట్లు) ఉంటుందని కొందరంటున్నారు.

 ఇస్లాంల పవిత్ర నగరం

ఫొటో సోర్స్, Getty Images

1.2 ఎకరాలు, 22 గదులు

ఈ కేసును మొదటి నుంచి పరిశీలిస్తున్నవారు మాత్రం ఈ ఆస్తి వక్ఫ్‌కు చెందుతుందని, ఈ ఆస్తిని నిర్వహించగలరేగానీ, దానిని సొంతం చేసుకోలేరని చెబుతున్నారు.

వక్ఫ్ ఆస్తులను నిర్వహించే సౌదీ విభాగం మాత్రం దీనిపై బీబీసీ అడిగిన ప్రశ్నకు స్పందించలేదు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఇప్పటివరకు బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.

ఈ వారసత్వ సంపదకు ఎవరు అర్హులు అనే దానిపై ఊహాగానాలు ఆగడం లేదు.

ఈ అతిథి గృహం గురించి కూడా పెద్దగా ఎవరికి తెలియదు. కానీ, 1.5 ఎకరాల విస్తీర్ణంలో 22 గదులు, పలు హాళ్లతో ఇది మస్జిద్-అల్-హరమ్‌కు కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఉంటుందని వారసులుగా భావిస్తున్నవారు చెబుతున్నారు. వారసుల కుటుంబ కథ ప్రకారం.. కెయి దీన్ని నిర్మించేందుకు మలబార్ నుంచి చెక్కను తరలించారు.

దాన్ని నిర్వహించేందుకు మలబారి మేనేజర్‌ను కూడా నియమించారు. అప్పుడు సౌదీ అరేబియా చాలా పేద దేశం. అప్పటికి ఇంకా భారీ చమురు నిక్షేపాలను కనుగొనలేదు.

మక్కాలో హిందీస్

ఇస్లాంలో హజ్ యాత్రకు, ఆ నగరానికి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని భారతీయ ముస్లింలు తరచూ డబ్బులను విరాళంగా ఇవ్వడం, అక్కడ భారతీయ యాత్రికుల కోసం సదుపాయాలను కల్పించడం చేసేవారు.

2014లో ‘మక్కా: ది సేక్రెడ్ సిటీ’ పేరుతో చరిత్రకారుడు జియావుద్దీన్ సర్దార్ రాసిన పుస్తకంలో 18వ శతాబ్దం ద్వితీయార్థంలో ఈ నగరం భారతీయ ముస్లింలపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ అని, విలక్షణమైన భారతీయ స్వభావాన్ని సంతరించుకుందని పేర్కొన్నారు.

” ఈ నగర జనాభాలో 20 శాతం గుజరాత్, పంజాబ్, కశ్మీర్‌, దక్కన్ నుంచి వచ్చిన భారతీయ మూలాలు ఉన్నవారేనని, వీరందరినీ అక్కడ హిందీస్‌గా పిలుస్తాంటారని’’ సర్దార్ రాశారు.

20వ శతాబ్దంలో సౌదీ అరేబియా చమురు సంపద విపరీతంగా పెరిగింది. అక్కడ అభివృద్ధి చేసిన ప్రాజెక్టులు మక్కా స్వరూపానే మార్చేశాయి. కెయి రుబాత్‌ను మూడుసార్లు కూల్చేశారు. చివరిసారి 1970లో‌ పూర్తిగా నేలమట్టం చేశారు. అప్పుడే పరిహారం విషయంలో గందరగోళం మొదలైంది.

మయాన్‌కుట్టి కెయికి చెందిన చట్టబద్ధమైన వారసులు ఎవరో తెలుపాలంటూ జెద్దాలోని భారతీయ కాన్సులేట్ అప్పట్లో ప్రభుత్వానికి లేఖ రాసినట్లు భారత కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ మాజీ కార్యదర్శి బీఎం జమాల్ చెప్పారు.

”నాకున్న అవగాహన ప్రకారం, పరిహార మొత్తాన్ని అప్పజెప్పేందుకు కాకుండా, ఆ ఆస్తికి మేనేజర్‌ను నియమించేందుకు వారసుల కోసం సౌదీ అధికారులు చూస్తున్నారు.” అని జమాల్ అన్నారు.

అయితే, ఈ సంపద కోసం రెండు వర్గాలు ముందుకు వచ్చాయి. ఒకరు, మయాన్‌కుట్టి తండ్రి వైపు వారసులు కెయి. మరొకరు ఆయన పెళ్లి చేసుకున్న కేరళకు చెందిన రాజ కుటుంబ వారసులు అరక్కల్.

ఈ రెండు కుటుంబాలు సౌదీ చట్టం గుర్తించని మాతృస్వామ్య వారసత్వ వ్యవస్థను సంప్రదాయంగా అనుసరిస్తున్నారు. ఇది కూడా సంపద సరైన వారసులకే అందించాలనే విషయాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తోంది.

మయాన్‌కుట్టికి పిల్లలు లేరని, ఆయన సోదరి పిల్లలే మాతృస్వామ్య సంప్రదాయం కింద సరైన వారసులు అవుతారని కెయి వర్గం అంటోంది.

మరోవైపు ఆయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారని అరక్కల్ వర్గం చెబుతోంది. భారతీయ చట్టం ప్రకారం, పిల్లలే చట్టబద్ధమైన వారసులు అవుతారని పేర్కొంటోంది.

మస్జీద్

ఫొటో సోర్స్, Getty Images

పరిహారం పేరుతో మోసాలు

పరిహారం మిలియన్లలో ఉంటుందని 2011లో వదంతులు రావడంతో, కెయి వారసులమంటూ 2,500 మందికి పైగా ప్రజలు కన్నూర్‌లోని జిల్లా కార్యాలయానికి తరలివచ్చారు.

ఈ వివాదం సాగుతూనే ఉండటంతో కెయి వారసులుగా చెప్పుకుంటూ ఎన్నో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. 2017లో కొందరు మోసగాళ్లు కెయి వారసులుగా చెబుతూ పరిహారాలలో వాటా ఇస్తామంటూ స్థానిక ప్రజల్ని మోసం చేశారు.

నేటికీ ఇది అంతుచిక్కని కేసుగానే ఉంది.

ఈ సుదీర్ఘ వివాదాన్ని ముగించడానికి సరైన పరిష్కారంగా కొందరు వారసులు.. మయాన్‌కుట్టి కోరుకున్న విధంగా హజ్ యాత్రికుల కోసం మరో అతిథి గృహాన్ని నిర్మించేందుకు ఈ పరిహార మొత్తాన్ని వాడాలని సౌదీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కానీ, మరికొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అతిథి గృహం ప్రైవేటుదని, అందుకే ఏ పరిహారమైనా కుటుంబానికి చెందుతుందని అంటున్నారు. మయాన్‌కుట్టి వారసులమని నిరూపించుకున్నా, వారికెలాంటి లబ్ది రాదని కొందరంటున్నారు.

కెయి, అరక్కల్ కుటుంబాల చరిత్రపై రాసిన పుస్తకానికి సహ రచయితగా వ్యవహరించిన కన్నూర్ వాసి మొహమ్మద్ షిహాద్.. ఈ వివాదం కేవలం డబ్బుకు చెందినది కాదని, కుటుంబ మూలాలను గౌరవించేది కూడా అని అన్నారు.

”ఒకవేళ వారికి పరిహారం రాకపోయినా, ఈ మహోన్నత చర్యతో ఆ కుటుంబాన్ని, ఈ ప్రాంత అనుబంధాన్ని గుర్తించడం విలువైనది.”

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)