Home LATEST NEWS telugu తాజా వార్తలు సూపర్‌స్టార్ కృష్ణ: ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీకి కృష్ణలాంటి హీరోనే కావాలని ఎందుకంటున్నారు?

సూపర్‌స్టార్ కృష్ణ: ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీకి కృష్ణలాంటి హీరోనే కావాలని ఎందుకంటున్నారు?

7
0

SOURCE :- BBC NEWS

సూపర్ స్టార్ కృష్ణ, తెలుగు సినీ పరిశ్రమ

ఫొటో సోర్స్, facebook.com/SuperStarKrishna

  • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
  • హోదా, బీబీసీ కోసం
  • 31 మే 2025

మే 5.. 1993. ఆ రోజు విజయవాడలోని ఓ సినిమా థియేటర్‌లో ‘సూపర్‌ స్టార్‌’ కృష్ణ, ‘యువ సామ్రాట్‌’ అక్కినేని నాగార్జున నటించిన ‘వారసుడు’ సినిమా రిలీజ్ అయింది. మార్నింగ్‌ షో నడుస్తోంది. నాగార్జున ఓ సన్నివేశంలో కృష్ణ చొక్కా కాలర్‌ పట్టుకుంటారు. అంతే.. థియేటర్‌ భగ్గుమంది, తెర చిరిగిపోయింది, కుర్చీలు విరిగిపోయాయి. కృష్ణ అభిమానుల నిరసన మిన్నంటింది. బెజవాడలో మొదలైన ఆందోళనలు వెంటనే రాష్ట్రమంతటా వ్యాపించాయి.

ఆ సినిమా నిర్మాత, నటుడు మురళీ మోహన్‌ విజ్ఞప్తితో కృష్ణ రంగంలోకి దిగారు. అది సినిమాలోని ఓ సన్నివేశంగా చూడాలని కోరుతూ ప్రకటన ఇచ్చారు. అయినా అభిమానుల ఆగ్రహం చల్లారలేదు. దీంతో నాగార్జున, కృష్ణ కాలర్ పట్టుకునే సన్నివేశాన్ని సినిమా నుంచి తొలగించారు. సినిమా హిట్టు కొట్టింది.

సరిగ్గా మరుసటి సంవత్సరం 1994 తొలినాళ్లు.. అప్పటి ‘యువరత్న’ నందమూరి బాలకృష్ణ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘టాప్‌ హీరో’ చిత్ర సన్నాహాలు.. అందులో హీరోయిన్‌గా కృష్ణ కుమార్తె మంజుల నటిస్తున్నారని ప్రకటన. అంతే కృష్ణ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ అభిమాన హీరో కుమార్తెను హీరోయిన్‌గా చూడలేమన్నారు. ఈసారి అభిమానుల మాటను కృష్ణ గౌరవించారు. వెంటనే తన కుమార్తె హీరోయిన్‌గా చేయడం లేదని, ఆ సినిమా నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు.

అభిమానుల మాటనే కాదు, నిర్మాతల క్షేమాన్నీ కృష్ణ కోరుకుంటారని, అందుకు ‘మంచిరోజు’ అనే సినిమా తనతో తీస్తూ నిర్మాత ఆర్థికంగా ఇబ్బందులకు లోనై నిర్మాణం ఆపేస్తే తన ఖర్చుతో సినిమాను పూర్తి చేసి విడుదల చేశారని చెబుతారు. ఇండస్ట్రీలో కృష్ణకు నిర్మాతల హీరో అనే పేరు కూడా ఉందని అంటారు.

అందుకే ఆయన ‘నిర్మాతల హీరో’ అయ్యారు. ఒక్కసారి సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే శరవేగంగా పూర్తి చేసేవారు. ఎంతవేగంగా అంటే.. ఐదున్నర దశాబ్దాల సినీ కెరీర్‌లో ఏకంగా 346 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు. వెరసి తెలుగు సినీరంగంపై ఎప్పటికీ తరిగిపోని, ఎన్నటికీ మరపురాని ముద్ర వేశారు.

ఇవాళ కృష్ణ 82వ జయంతి.

బీబీసీ న్యూస్ తెలుగు
సూపర్ స్టార్ కృష్ణ, తెలుగు సినీ పరిశ్రమ

ఫొటో సోర్స్, facebook.com/ghattamanenisuperstar

హీరోగా రంగుల చిత్రంతో ఆగమనం

గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో 1943 మే 31న జన్మించిన ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. ఏలూరులోని సర్‌ సీఆర్‌ రెడ్డి కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే సినిమా నటుడు కావాలనుకున్నారు.

ఆ క్రమంలోనే అప్పటి తన సహచరుడు, నటుడు మురళీమోహన్‌తో కలిసి నాటికల్లో నటించారు.

తర్వాత సినిమాల్లో నటించాలని మద్రాస్‌ వెళ్లిన శివరామకృష్ణ.. కృష్ణగా మారి కులగోత్రాలు, పదండి ముందుకు, పరువు ప్రతిష్ట వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించారు. ఆ తర్వాత 1965లో మొదటిసారి హీరోగా తేనెమనుసులు చిత్రంలో హీరోగా పరిచయమయ్యారు.

అప్పట్లో అన్నీ బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాలు వస్తుండగా, ఈ సినిమాను ఈస్ట్‌మన్‌ కలర్‌లో తీశారు. తరువాత ఆయన క్రైమ్, కౌబాయ్ సినిమాల వైపు మళ్లారు. కృష్ణ నటించిన మూడో సినిమా గూఢచారి 116తో ఆయన ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు. తరువాత క్రైమ్, కౌబాయ్ సినిమాలకు కృష్ణ కేరాఫ్ అడ్రస్‌గా మారారు.

తరువాత అనేక ప్రయోగాలూ చేశారు. ఇంగ్లిషు ప్రేక్షకులకు పరిమితమైన కౌబాయ్ తరహా సినిమాలను తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు కృష్ణ. ఆయన నటించిన తొలికౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు. అలాగే తొలి స్కోప్‌ సినిమా ‘అల్లూరి సీతారామరాజు’. తొలి 6 ట్రాక్‌ స్టీరియో సౌండ్‌ సిస్టంతో 70ఎంఎం సినిమా ‘సింహాసనం’ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించడంతోపాటు అందులో రెండు పాత్రల్లో నటించారు.

సూపర్ స్టార్ కృష్ణ, తెలుగు సినీ పరిశ్రమ

ఫొటో సోర్స్, facebook.com/ghattamanenisuperstar

తన బలమేమిటో తెలుసుకున్న కృష్ణ

కృష్ణ హీరోగా ప్రవేశించే నాటికి అటు ఎన్‌టీఆర్, ఇటు ఏఎన్‌ఆర్‌ తెలుగు తెరకు రెండు మూల స్తంభాలుగా నిలబడ్డారు.

పౌరాణిక, జానపద చిత్రాలతో ఎన్టీఆర్‌ దూసుకుపోతుండగా, ప్రేమకథా చిత్రాలు, సాంఘిక చిత్రాలతో ఏఎన్‌ఆర్‌ అగ్రపథంలో ఉన్నారు.

మరోవైపు తనతో పాటు అందాల నటుడు శోభన్‌బాబు, ఆరడగుల ఎత్తుతో కృష్ణంరాజు తమదైన శైలి చిత్రాలతో అప్పుడప్పుడే వస్తున్నారు.

దీంతో కృష్ణ తొలినాళ్లలో తనకంటూ ప్రత్యేకమైన శైలి ఉండాలని భావించారు.

ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్‌ సహా ఏ హీరోలూ పెద్దగా టచ్‌ చేయని క్రైం, కౌబాయ్‌ జోనర్లపై దృష్టి సారించారు.

యువత బాగా ఇష్టపడే కౌబాయ్, క్రైం నేపథ్యం కలిగిన సినిమాలను ఆయన ఎంచుకున్నారు.

అలా తీసిన మోసగాళ్లకు మోసగాడు, గూఢచారి 116 వంటి చిత్రాల విజయాలతో తాను హీరోగా కుదుటపడ్డాక ఇతర కథాంశాల చిత్రాలకు వెళ్లి ఇక వెనుదిరిగి చూడలేదు.

పౌరాణిక, జానపద, చారిత్రక, అభ్యుదయ, ప్రేమకథలు, రాజకీయ నేపథ్య సినిమాలు.. ఇలా ఒకటేమిటి.. ఇలా కృష్ణ అన్నిరకాల సినిమాల్లోనూ నటించారు.

తక్కువకాలంలో వేగంగా సినిమాలు తీస్తూ హిట్టు మీద హిట్టు కొడుతూ తెలుగు సినిమాకి సూపర్‌స్టార్‌గా మారి తెలుగుసినీ పరిశ్రమకు ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్‌తో పాటు మరో మూలస్తంభంగా నిలిచారు.

నిజానికి కృష్ణకు అభిమానులు బాగా పెరగడానికి దోహదం చేసినవి ఆయన పాత్రలే. ఆయన నటించిన చాలా సినిమాల్లో పీడిత,తాడిత వర్గాలకు ప్రతినిధిగా, వారిలో ఒకరిగా కనిపించిన పాత్రలు, వాటిలోని ఆయన నటనే మాస్ హీరోగా నిలబెట్టిందని చెబుతారు.

సూపర్ స్టార్ కృష్ణ, తెలుగు సినీ పరిశ్రమ

ఫొటో సోర్స్, facebook.com/ghattamanenisuperstar

అల్లూరి అంటే ఆయనే గుర్తుకొస్తారు

కృష్ణ వందవ సినిమా అల్లూరి సీతారామరాజు. ఈ సినిమాను కృష్ణను అల్లూరి సీతారామారాజుగా ప్రేక్షకుల మనసుల్లో ఎంతలా నిలిచిపోయేలా చేసిందో కృష్ణే ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

ఈ సినిమా చూసిన విజయా చక్రపాణి, ఇప్పుడు నువ్వు ఎన్ని సినిమాలలో నటిస్తున్నావు అని కృష్ణను అడిగారుట… దాదాపు 7,8 సినిమాలు ఉన్నాయండి అని కృష్ణ చెబితే… ఇక ఆ నిర్మాతల పని అయిపోయినట్టే… ఇక నిన్నెవరూ కనీసం ఏడాదిపాటైనా మరే పాత్రలోనూ చూడలేరయ్యా… అని చెప్పారుట.. ఆయన చెప్పినట్టే సీతారామరాజు చిత్రం తరువాత కృష్ణను మరే పాత్రలోనూ ప్రేక్షకులు చూడలేకపోవడంతో వరుసగా అనేక ఫ్లాపులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇక అల్లూరి సివిమా తీయొద్దని వారించినా తీసినందుకు అలిగిన ఎన్‌టీఆర్‌కు కొన్నాళ్ల తర్వాత ప్రత్యేక షో వేసి సినిమా చూపించి ‘శభాష్’ అని ప్రశంసలు పొందారు.

పద్మాలయా బ్యానర్‌ను స్థాపించి సినిమాలు నిర్మించి, పదికిపైగా సినిమాలకు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టిన కృష్ణ 1973లోనే హైదరాబాద్‌లో పద్మాలయా స్టూడియోను నిర్మించారు.

పద్మాలయా బ్యానర్‌పై హీరోయిన్‌గా శ్రీదేవిని, దర్శకుడిగా రాఘవేంద్రరావుని బాలీవుడ్‌కి పరిచయం చేశారు కృష్ణ.

జితేంద్ర హీరోగా ఆ ముగ్గురి కాంబినేషన్‌లో తీసిన హిమ్మత్‌వాలా ఘన విజయంతో శ్రీదేవి అక్కడ స్టార్‌ హీరోయిన్‌ అయ్యారు. అలాగే జయప్రదతో కూడా కృష్ణ బాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు తీశారు.

సూపర్ స్టార్ కృష్ణ, తెలుగు సినీ పరిశ్రమ

ఫొటో సోర్స్, facebook.com/ghattamanenisuperstar

ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు

తెలుగు సినీరంగంలో కృష్ణ చేసినన్ని మల్టీస్టారర్‌ చిత్రాలు బహుశా ఇంకా ఎవరూ చేయలేరేమో.

తెలుగు సినీ పరిశ్రమలో తొలి తరం సూపర్‌ స్టార్‌గా పేర్కొనే చిత్తూరు నాగయ్యతో మొదలు చిరంజీవి సోదరుడు నాగబాబువరకు కృష్ణ మల్టీస్టారర్ సినిమాలు చేశారు.

ఎన్‌టీఆర్‌తో ఎన్నో సినిమాల్లో నటించిన కృష్ణ ఆ తర్వాత ఆయన కుమారుడు బాలకృష్ణతో సుల్తాన్‌ చిత్రంలో, హరికృష్ణతో కలిసి శ్రావణమాసం సినిమాల్లో నటించారు.

అంతేకాదు ఎన్టీఆర్‌ మనవడు తారకరత్న నటించిన ‘తారక్‌’ అనే ఓ సినిమాలో వ్రధాన పాత్ర పోషించారు. ఇలా ఎన్టీఆర్‌ కుటుంబంలో మూడు తరాల హీరోలతో నటించారు.

అక్కినేని నాగేశ్వరరావుతో ఎన్నో సినిమాల్లో నటించిన కృష్ణ ఆయన తనయుడు నాగార్జునతో కలిసి వారసుడు, రాముడొచ్చాడు సినిమాల్లో నటించారు.

కృష్ణంరాజుతో యుద్ధం, అడవి సింహాలు, కురుక్షేత్రం, విశ్వనాథ నాయకుడు, ఇంద్రభవనం వంటి పలు చిత్రాలు, శోభన్‌బాబుతో గంగా మంగ, కృష్ణార్జునులు మండే గుండెలు, ముందడుగు, మహాసంగ్రామం వంటి చిత్రాల్లో నటించారు.

కృష్ణ-చిరంజీవి కాంబినేషన్‌లో మూడు సివిమాలు వచ్చాయి. కొత్త అల్లుడులో చిరంజీవి విలన్‌ పాత్రలో చేయగా, కొత్తపేట రౌడీలో చిరంజీవి ఓ చిన్ననెగటివ్ రోల్ పోషించారు. ఇక తోడు దొంగలు సినిమాలో కృష్ణ, చిరంజీవి హీరోలుగా నటించారు. చిరంజీవి సోదరుడు నాగబాబుతో కలిసి హీరోగా విష్ణు అనే సినిమాలో కృష్ణ నటించారు.

వెంకటేష్‌తో పూర్తి స్థాయి సినిమాలో నటించకపోయినా.. త్రిమూర్తులు సినిమాలోని ఓ పాటలో కృష్ణ సూపర్‌స్టార్‌గా మెరుస్తారు.

రాజశేఖర్‌తో రవన్నలో ప్రత్యేక పాత్రలో కృష్ణ కనిపిస్తారు. ఇక కుమారులు రమేష్, మహేష్‌లతో కలిసి ముగ్గురు కొడుకులు సినిమాల్లో నటించిన ఆయన విడిగా ఇద్దరితో ఎన్నో సినిమాలు చేశారు.

తన పక్కన హీరోయిన్‌గా నచించిన విజయశాంతి ప్రధానపాత్రలో నటించిన ఒసేయ్‌ రాములమ్మ సినిమాలో ఓ గెస్ట్‌రోల్‌లో కృష్ణ కనిపించారు.

సూపర్ స్టార్ కృష్ణ, తెలుగు సినీ పరిశ్రమ

ఫొటో సోర్స్, Bharadwaja

కృష్ణ డ్యాన్సులతో స్పెషల్‌ సాంగ్స్‌

కృష్ణ డాన్స్‌పై విమర్శలుండేవి. కానీ ఆయన అనేక సినిమాలలో ప్రత్యేక గీతాలలో చేసిన డాన్సులు ఆ సినిమాలకు ప్లస్ పాయింట్‌గానూ, జనాలను థియేటర్లను రప్పించడానికి ఉపయోగపడ్డాయని చెబుతారు.

అలీ హీరోగా చేసిన యమలీల అనే సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేసి వెరైటీ స్టెప్పులతో అలరించారు.

ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆయన ప్రత్యేక గీతాల్లో నటించారు.

‘‘తెలుగు సినీరంగంలో అశేషమైన ప్రజాదరణ కలిగిన నటుడుగా పేరొందిన కృష్ణకు అప్పట్లో ‘కృష్ణ ప్రజాశక్తి’ పేరిట అభిమాన సంఘాలు ఉండేవి. ఈ పేరు సూచించింది ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు. అయితే మహేష్‌ రాకతో ‘సూపర్‌స్టార్‌ కృష్ణ, మహేష్‌ సేన’గా మార్పు చేశారు. అప్పట్లో కృష్ణ సినిమా వచ్చిందంటే చాలు.. థియేటర్ల వద్ద జాతరే.’’

“సింహాసనం సినిమా విడుదల సందర్భంగా విజయవాడలోని రాజ్‌యువరాజ్‌ థియేటర్‌ నుంచి టికెట్ల కోసం రెండు కిలోమీటర్ల మేర జనం ఉండటం, పోలీసులు 144 సెక్షన్‌ విధించడం.. వంటి ఘటనలు అభిమానులే కాదు.. స్వయంగా కృష్ణ కూడా మరిచిపోలేని గురుతులవి. ఈ విషయాన్ని స్వయంగా కృష్ణనే అనేక ఇంటర్వ్యూల్లో వివరించారు” అని హైదరాబాద్‌లోని ‘సూపర్‌స్టార్‌ కృష్ణ, మహేష్‌ సేన’ అధ్యక్షుడు దిడ్డి రాంబాబు బీబీసీకి చెప్పారు.

సూపర్ స్టార్ కృష్ణ, తెలుగు సినీ పరిశ్రమ

ఫొటో సోర్స్, Bharadwaja

అజాత శత్రువే కానీ…

సినిమాల్లో తన అభిమాన హీరో ఎన్టీఆర్‌ అని ఎన్నోసార్లు చెప్పిన కృష్ణ ఆయనతో నటించిన ప్రతి సినిమాలోనూ సోదరుడి పాత్రలోనే కనిపించారు.

కానీ రాజకీయంగా మాత్రం అదే ఎన్టీఆర్‌ను విభేదించారు. వాస్తవానికి ఎన్టీఆర్‌ 1983లో సీఎం కాకముందు.. టీడీపీని స్థాపించిన కొత్తలో.. కృష్ణ నటించిన 200వ సినిమా ”ఈనాడు” ఆ పార్టీ ప్రచారానికి బాగా ఉపయోగపడిందని అంటారు.

ఆ సినిమాలో అప్పటి వర్తమాన రాజకీయాలపై కృష్ణ సూటిగా చెప్పిన డైలాగులు, సైకిల్‌పై తిరిగిన దృశ్యాలు టీడీపీకి ఎన్నికల్లో పాజిటివ్‌గా ఉపయోగపడ్డాయని చెబుతారు.

సరిగ్గా ఈనాడు హిట్‌ అయిన నేపథ్యంతో పాటు టీడీపీ అధికారంలోకి రావడంతో ఎన్టీఆర్‌ను అభినందిస్తూ కృష్ణ స్వయంగా పత్రికల్లో ప్రకటనలిచ్చారు.

కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో విభేదాలొచ్చాయి.

దాంతో ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో ఆయన వేషధారణతో పోలిన పాత్రలతో పలు సినిమాలు తీసి రాజకీయాల్లో ఎన్టీఆర్‌ తీరును ఎండగట్టేవారు. సాహసమే నా ఊపిరి, నా పిలుపే ప్రభంజనం వంటి సినిమాల్లో ఎన్టీఆర్‌ వ్యక్తిత్వంపై కూడా కృష్ణ విమర్శలు చేశారు. అప్పట్లో విజయవాడలో దారుణ హత్యకి గురైన వంగవీటి మోహన్‌రంగా హత్యోదంతం కూడా తన సినిమాల్లో ప్రస్తావించి అప్పటి ఎన్టీఆర్‌ ప్రభుత్వం చేసిన హత్యగా ఆరోపించారు.

1989 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ పరాజయం, ఆ తర్వాత మద్రాస్‌లో ఓ ఫంక్షన్‌లో యాదృచ్ఛికంగా కలిసిన ఎన్టీఆర్, కృష్ణ మనస్ఫూర్తిగా అన్నీ మరిచిపోయి మాట్లాడుకున్న నేపథ్యం మొదలు మళ్లీ కృష్ణ అలాంటి సినిమాల జోలికి వెళ్లలేదు.

ఆ తర్వాత కృష్ణ హీరోగా నటించిన 300వ సినిమా ”తెలుగువీర లేవరా” చిత్రానికి ఎన్‌టీఆర్‌తోనే క్లాప్‌ కొట్టించారు.

సూపర్ స్టార్ కృష్ణ, తెలుగు సినీ పరిశ్రమ

ఫొటో సోర్స్, Bharadwaja

బాలుని కాదని రాజ్ సీతారాంతో పాటలు

ఎస్బీ బాలసుబ్రమణ్యంతో విభేదాలు రావడంతో కృష్ణ తన సినిమాల్లో రాజ్‌ సీతారాం అనే గాయకుడితో పాటలు పాడించారు. సింహాసనం వంటి సినిమాల్లో రాజ్‌సీతారాం పాడిన పాటలు అప్పట్లో మార్మోగాయి.

“తన పాటలు లేకపోతే కృష్ణ సినిమాలు ఆడవని తాను ఎక్కడో అన్నట్టు కృష్ణ గారు అపోహపడ్డారు. అదే సమయంలో తనకు రావాల్సిన 2వేల రూపాయల కోసం పద్మాలయా స్టూడియోస్‌కి ఫోన్‌ చేసి అడిగితే ఫోన్‌ మాట్లాడిన వ్యక్తి తప్పుగా సమాచారం పంపించారు. దాంతో కృష్ణ గారికి కోపం వచ్చి 2వేలు పంపి, తాను గతంలో ఇవ్వాల్సిన 20వేలను అడిగారు. అలా గ్యాప్‌ వచ్చింది. ఆ తర్వాత ఓ సందర్భంలో కలిశాం. విషయం చెప్పబోయినా వినలేదు, ఇక నుంచి కలసి పనిచేద్దామని అన్నారు. అంతటి సహృదయుడు కృష్ణ” అని ఎస్పీబీ ఆ తర్వాత పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు.

ఇక దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజతోనూ ఓ విషయంలో కృష్ణ విభేదించారు.

“నేను తీసిన రౌడీ అన్నయ్య సినిమాలో కృష్ణ హీరో.. కానీ క్లైమాక్స్‌లో పెట్టేందుకు బాబూమోహన్, సిల్క్‌స్మితలపై ఓ సాంగ్‌ను చిత్రీకరించాను. అది తెలిసి కృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. క్లైమాక్స్‌లో వచ్చే సాంగ్‌లో నేను లేకుంటే అభిమానులు హర్ట్‌ అవుతారు. అందుకని నేను చేసే సాంగ్‌ ఉంచండని అడిగారు. కానీ నేను రెండు సాంగ్‌లు షూట్‌ చేసి బయ్యర్ల ఒత్తిడితో బాబూమోహన్‌ సాంగ్‌ ఉంచాను. అది ఆయనకు చెప్పలేదు. ప్రివ్యూలో అది చూసి ఆయనకు కోపం వచ్చింది. ఓకే, ఇక మనం కలిసి సినిమాలు తీయం అని షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి వెళ్లిపోయారు. ఓ విధంగా చూస్తే ఆ విషయంలో తప్పు నాదే” అని భరద్వాజ తర్వాత చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

సూపర్ స్టార్ కృష్ణ, తెలుగు సినీ పరిశ్రమ

ఫొటో సోర్స్, facebook.com/ghattamanenisuperstar

రాజీవ్‌ పిలుపుతో కాంగ్రెస్‌లోకి

నాదెండ్ల భాస్కర్‌రావు 1984లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఆయన్ను అభినందిస్తూ కృష్ణ ఓ ప్రకటన చేశారు.

ఎన్టీఆర్‌ దేశంలో లేని సమయంలో పదవీచ్యుతుడిని చేసి సీఎం అయిన నాదెండ్లకు కృష్ణ శుభాకాంక్షలు చెప్పడంపై ఎన్టీఆర్‌ అభిమానులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

సీఎం అయిన ఎవరికైనా శుభాకాంక్షలు చెప్పడం తమ సంస్థ ఆనవాయితీ అని, అందుకే తనకు చెప్పకుండానే ఆనవాయితీ ప్రకారం తమ సంస్థ ఆప్రకటన ఇచ్చిందని కృష్ణ సర్దిచెప్పినా టీడీపీ వర్గీయులు, ఎన్‌టీఆర్‌ అభిమానులు శాంతించలేదు.

సరిగ్గా ఆ నేపథ్యంలోనే రాజీవ్‌గాంధీ నుంచి కృష్ణకు పిలుపు వచ్చింది. దిల్లీ వెళ్లిన కృష్ణను రాజీవ్‌ సాదరంగా ఆహ్వానించి కాంగ్రెస్‌ కండువా కప్పారు.

అప్పటి నుంచి చివరి వరకూ ఆయన కాంగ్రెస్‌ అభిమానిగానే ఉండిపోయారు. ఎప్పుడూ పార్టీ మారలేదు. తన భార్య విజయనిర్మల 1999లో జరిగిన ఎన్నికల్లో అప్పటి కృష్ణా జిల్లా కైకలూరులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయినా సరే ఆయన ప్రచారానికి రావడం గాని, ఆమెకు ఓటెయ్యాలని పిలుపునివ్వడం గానీ చేయలేదు.

ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు.

సూపర్ స్టార్ కృష్ణ, తెలుగు సినీ పరిశ్రమ

ఫొటో సోర్స్, UGC

తొలిసారి ఎంపీగా గెలుపు… మలిసారి ఓటమి

ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా 1989 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన కృష్ణ.. ఆ తర్వాత 1991లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

వాస్తవానికి ఆయన 1991లో గుంటూరు స్థానం నుంచి పోటీ చేయాలని భావించినా కాంగ్రెస్‌ అధిష్ఠానం ఏలూరులోనే పోటీ చేయమని చెప్పడం, అదే సమయంలో తనను పార్టీలోకి ఆహ్వానించిన రాజీవ్‌గాంధీ మృతిచెందిన నేపథ్యంలో ఆ తర్వాత నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు.

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డితో ఆయన సన్నిహితంగా ఉండేవారు. 2004, 2009 ఎన్నికల్లో వైఎస్‌ హయాంలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందాలని ఆకాంక్షిస్తూ ప్రకటన చేశారు.

సూపర్ స్టార్ కృష్ణ, తెలుగు సినీ పరిశ్రమ

ఫొటో సోర్స్, Bharadwaja

“ఇప్పుడు ఇండస్ట్రీకి కృష్ణలాంటి హీరోలే కావాలి”

ఏడాదికో, రెండేళ్లకో వస్తున్న స్టార్‌ హీరోల చిత్రాలు తప్పించి, సరిగ్గా ఆడే సినిమాల్లేక థియేటర్ల యజమానులు గగ్గోలు పెడుతున్న ప్రస్తుత నేపథ్యంలో నిర్మాతలు, బయ్యర్ల క్షేమాన్ని కాంక్షించే కృష్ణ వంటి హీరోలు కావాలి అని ప్రముఖ సినీ విమర్శకుడు రంగావఝుల భరద్వాజ బీబీసీతో అన్నారు.

“గ్రాఫిక్స్, సాంకేతికత లేని రోజుల్లోనే సింహాసనం, కురుక్షేత్రం వంటి భారీ బడ్జెట్‌ సినిమాలను వేగంగా తీసి హిట్టుకొట్టారు. ఒక సినిమా పోతే వెంటనే మరో సినిమా తీసుకునే చాన్స్‌ ఇచ్చే కృష్ణ వంటి హీరోలే ఇప్పుడు ఇండస్ట్రీకి కావాలి” అని భరద్వాజ అన్నారు.

సూపర్ స్టార్ కృష్ణ, తెలుగు సినీ పరిశ్రమ

ఫొటో సోర్స్, Bharadwaja

కృష్ణపేరుతో ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌

కృష్ణ 2022 నవంబర్‌ 15న అనారోగ్యంతో హైదరాబాద్‌లో మృతి చెందారు. లెజెండరీ నటులు చనిపోతే ఫామ్ హౌస్‌లలో అంత్యక్రియలు పూర్తిచేసి, అక్కడే సమాధి లేదా స్మారకం నిర్మించడం కొంతకాలంగా ఆనవాయితీగా వస్తోంది.

కానీ, పద్మాలయా స్టూడియోస్ అధినేతగా ఉన్న కృష్ణ చనిపోతే జూబ్లీహిల్స్‌ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించడంపై అప్పట్లో అభిమానులు ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే ఇది ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిగత వ్యవహారం కావడంతో ఎక్కడా పెద్దగా చర్చకు రాలేదు.

దీనిపై ఇప్పుడు కృష్ణ సోదరుడు ఆదిశేష గిరిరావు బీబీసీతో మాట్లాడారు.

“నిజమే. అప్పట్లో అనుకోకుండా అలా జరిగింది. వాస్తవానికి హైదరాబాద్‌ శివారు బనసానపల్లిలో ఉన్న పద్మాలయా స్డూడియోస్ స్థలంలోనే దహనక్రియలు నిర్వహించాలని భావించాం. అయితే లక్షలాదిగా వచ్చిన అభిమాన జనంతో అంత్యక్రియలు ఆలస్యమయ్యాయి. దాంతో అనివార్య పరిస్థితుల్లో నగరంలోని స్మశాన వాటికలో చేశాం. ఇప్పుడు సూపర్‌స్టార్‌ కృష్ణ గుర్తుగా కృష్ణ పుట్టిన తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో ఆయన మ్యూజియం నిర్మిస్తాం. అలాగే పద్మాలయా స్టూడియోలో ఆయన స్మారకాన్ని నిర్మిస్తున్నాం. ఏపీలో కూడా నిర్మిస్తాం. సూపర్‌స్టార్‌ కృష్ణ పేరిట హైదరాబాద్‌తో పాటు ఏపీలో ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు నెలకొల్పుతాం. ఆ మేరకు సన్నాహాలు చేస్తున్నాం” అని ఆదిశేషగిగిరావు బీబీసీకి తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS