Home జాతీయ national telgu విజయవాడ: ‘పెళ్లి చేసుకుని 3 రోజులు కాపురం చేస్తే రూ.50 వేలిస్తాం’ అంటూ మహిళకు ఆఫర్,...

విజయవాడ: ‘పెళ్లి చేసుకుని 3 రోజులు కాపురం చేస్తే రూ.50 వేలిస్తాం’ అంటూ మహిళకు ఆఫర్, నకిలీ పెళ్లితో మోసపోయిన వరుడు

2
0

SOURCE :- BBC NEWS

వివాహం

ఫొటో సోర్స్, Getty Images

పెళ్లి పేరుతో తనను మధ్యవర్తులు కొందరు మోసం చేశారని కర్ణాటకలోని రాయచూర్‌కి చెందిన యువకుడు విజయవాడలో కేసు పెట్టారు.

పెళ్లై, ఆరేళ్ల కొడుకు ఉన్న ఆమెతో పెళ్లి జరిపించారని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ పెళ్లి కోసం రూ.4 లక్షల వరకు ఎదురుకట్నం ఇచ్చినట్లు వరుడి తరఫు బంధువులు చెప్పారు.

”విజయవాడలో ఒక అమ్మాయి ఉందని ఫోటో పంపించారు. రాయచూర్‌ నుంచి చూడటానికి వచ్చాం. అన్నీ నచ్చి ఐదో తేదీన దుర్గమ్మ గుడిలో పెళ్లి జరిపించాం. రాయచూర్‌కి వెళ్లాక 10 లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేశాం. ఫస్ట్ నైట్‌ కోసం ఏర్పాట్లు చేస్తే, తనను ముట్టుకోవద్దని చెప్పింది. ఆ తర్వాత ఇంట్లోంచి పారిపోవడానికి ప్రయత్నించింది” అని పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత పెళ్లికొడుకు బంధువులు మీడియాకు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలేం జరిగింది?

బాధితుల ఫిర్యాదుపై విజయవాడ వన్‌టౌన్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు వివరాలను సీఐ గురుప్రకాశ్‌ బీబీసీకి వివరించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం…

కర్ణాటక రాయచూర్ సమీపంలోని గంగావతికి చెందిన దుర్గాప్రసాద్‌ వయసు 34 ఏళ్లు. చాలాకాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. రాయచూర్‌కి చెందిన శ్రీదేవి, పెళ్లి సంబంధం చూడాలంటూ రాజమండ్రికి చెందిన తాయారుని అడిగారు. ఆమె విజయవాడకు చెందిన ఆటోడ్రైవర్‌ అప్పారావు, షాలినీ, భవానీలకు సమాచారం ఇచ్చారు. వాళ్లు గుంటూరుకి చెందిన ఒక మహిళను సంప్రదించారు. ఈ పెళ్లి చేసుకుని మూడు రోజులు కాపురం చేస్తే రూ. 50 వేలు ఇస్తామని ఆమెకు ఆశ చూపారు. అందుకు ఆమె సరే అనడంతో గత నెల 13న విజయవాడ కృష్ణలంకలో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంలోనే పెళ్లి కుమార్తె కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, మూడున్నర లక్షలివ్వాలని మధ్యవర్తులు అడగడంతో పెళ్లికొడుకు దుర్గాప్రసాద్‌ ఒప్పుకున్నారు. జూన్‌ 5న విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెళ్లి జరిపించారు.

ఇదివరకే పెళ్లైనట్టు ఎలా తెలిసింది?

పెళ్లికొడుకు బంధువులు చెప్పిన వివరాల ప్రకారం, పెళ్లైన తర్వాత భర్తతో కాపురం చేసేందుకు వధువు నిరాకరించింది. దీంతో వారికి అనుమానం వచ్చింది. పెళ్లి కూతురును నిలదీయడంతో ఆమె అసలు విషయం చెప్పింది.

”పెళ్లైన తర్వాత మూడో రోజు ఒక మధ్యవర్తి వచ్చారు. అతను వచ్చిన రెండు గంటలకు తనకు అంతకు ముందే పెళ్లైందని ఆమె చెప్పింది. బాబు ఏడుస్తున్నాడని, తాను వెళ్లిపోతానని చెప్పింది. పెళ్లికూతురిగా నటిస్తే 50 వేలు ఇస్తామని చెప్పారని, పెళ్లి తర్వాత అక్కడి నుంచి వచ్చేయవచ్చని, ఒకవేళ రాలేకపోతే తాము వచ్చి తీసుకొస్తామని మధ్యవర్తులు తనకు చెప్పారని ఆమె తెలిపింది” అని పెళ్లికొడుకు బంధువులు మీడియాతో చెప్పారు.

‘పరువుతో పాటు డబ్బూ పోయింది’

వరుడు దుర్గాప్రసాద్‌తో బీబీసీ మాట్లాడింది.

”మధ్యవర్తులందరూ కలిసి మమ్మల్ని మోసం చేశారు. కృష్ణలంక ఏరియాలో అమ్మాయిని చూపించి మమ్మల్ని మోసం చేశారు. పరువు పోయింది. డబ్బూ పోయింది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాము మోసపోయామని గ్రహించి, విజయవాడ వచ్చి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు.

ప్రస్తుతం చీటింగ్‌ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని, ఈ ముఠా ఇలాంటి మోసానికి పాల్పడటం ఇదే మొదటిసారా, లేక గతంలో ఏమైనా చేసిందా? అనే పూర్తి వివరాలు తెలుసుకుంటున్నామని సీఐ తెలిపారు.

మోసం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి గురించి తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.

అయితే, ప్రస్తుతానికి వారి వివరాలు తమ వద్ద లేవని, వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు చెప్పారు.

వరుడు దుర్గాప్రసాద్‌

ఫొటో సోర్స్, UGC

వయస్సు మీరిన అబ్బాయిలే లక్ష్యంగా…

వయస్సు మీరిన అబ్బాయిలే లక్ష్యంగా ఏపీలో పలుచోట్ల ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న ఘటనలు కొన్నాళ్లుగా బయటపడుతున్నాయి.

శ్రీసత్యసాయి జిల్లాలో కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది.

హిందూపురానికి చెందిన ఓ వ్యక్తికి 40 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదు. భీమవరానికి చెందిన ఓ పేదింటి యువతి పెళ్లికి సిద్ధంగా ఉందనీ, అయితే అమ్మాయి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని పెళ్లి చేసుకుని తీసుకెళ్లవచ్చని చెప్పి మధ్యవర్తులు రూ.4.5 లక్షలు తీసుకున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి.

తీరా పెళ్లి చేసుకుని హిందూపురం తీసుకువెళ్తే కాపురం చేయకుండా మా వాళ్లను చూడాలని ఉందని చెప్పి భీమవరం వచ్చేసి, తర్వాత కనిపించకుండా వెళ్లిపోయారు ఆ మహిళ.

మధ్యవర్తులకు ఫోన్‌ చేసి ఆరా తీయగా తాను నకిలీ పెళ్లి వలలో చిక్కుకున్నట్లు పెళ్లికొడుకుకు అర్థమైంది.

శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువుకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నుంచి ఇదే మాదిరిగా రూ.8 లక్షలు తీసుకొని పరారైన ఘటన ఆరు నెలల కిందట జరిగినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.

అబ్బాయి

ఫొటో సోర్స్, Getty Images

‘మధ్యవర్తులతో జాగ్రత్త’

ఇలాంటి ఘటనల్లో మధ్యవర్తులదే కీలక పాత్ర అని పోలీసులు చెబుతున్నారు.

పెళ్లి సంబంధాలు దొరక్క విసిగిపోయిన మగవాళ్లు దూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో పేదింటి యువతులకు ఎదురుకట్నం ఇచ్చి మరీ వివాహం చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు.

సరిగ్గా ఈ సందర్భాల్లోనే నకిలీ పెళ్లిళ్లు చేసే గ్యాంగ్‌లు పుట్టుకొచ్చి మోసాలకు పాల్పడుతున్నాయి.

‘‘పెళ్లిళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంబంధాలను ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలి” అని వన్‌టౌన్‌ సీఐ గురుప్రకాశ్‌ సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)