SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, facebook.com/MissWorld
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
-
30 మే 2025
శనివారం మే 31 మిస్ వరల్డ్ పోటీల ఫైనల్స్ జరగబోతున్న వేళ అసలు ఫలానా వారు అందగత్తె అని ఎలా నిర్ణయిస్తారు? ఎవరు డిసైడ్ చేస్తారు అని తెలుసుకునేందుకు ఆ సంస్థ సీఈవో జూలియా మోర్లేతో మాట్లాడింది బీబీసీ.
అందాల పోటీలోకి అర్హతలు, పోటీలు ఎలా ఉంటాయి అన్న వివరాలతో పాటూ తాజాగా మిస్ ఇంగ్లండ్ చేసిన తీవ్ర ఆరోపణలపై ఆవిడ బీబీసీతో మాట్లాడారు.
మిస్ వరల్డ్ను ఎవరు నిర్వహిస్తారు?
లండన్కి చెందిన మిస్ వరల్డ్ సంస్థ ఈ పోటీలను నిర్వహిస్తుంది.
1951 నుంచీ ఇవి జరుగుతున్నాయి.
ప్రస్తుతం 85 ఏళ్ళ జూలియా మోర్లే ఈ సంస్థ ఈ నిర్వాహకురాలు.
ఆమె భర్త ఈ సంస్థను ప్రారంభించగా, ఆయన మరణం తరువాత జూలియా, ఆమె కుమారుడు కలసి నిర్వహిస్తున్నారు.
మిస్ యూనివర్స్, మిస్ ఎర్త్, మిస్ ఇంటర్నేషనల్ తరహా పోటీలు నిర్వహించే సంస్థల్లోకెల్లా ఇదే పాతది.
2025వ సంవత్సరం మిస్ వరల్డ్ కి 108 దేశాల నుంచి అమ్మాయిలు వచ్చారు.
మిస్ వరల్డ్ పోటీల్లో ముందుగా టాప్ 40 మందిని ఎంపిక చేస్తారు.
తరువాత టాప్ 20, తరువాత టాప్ 8 ఇలా చేసుకుంటూ వెళ్తారు.
చివరగా గెలిచిన వారికి మిస్ వరల్డ్ 2025 టైటిల్ ఇస్తారు.


విజేతను ఎలా నిర్ణయిస్తారు?
ఖండాల వారీగా కూడా విజేతలను నిర్ణయిస్తారు.
ప్రపంచంలోని ఏడు ఖండాలను ఆఫ్రికా, అమెరికాస్ అండ్ కరేబియన్, ఆసియా అండ్ ఓషినియా, యూరప్ అనే నాలుగు కేటగిరీలుగా మిస్ వరల్డ్ సంస్థ విభజించుకుంది.
టాప్ 40 కూడా ఈ నాలుగు ఖండాల కేటగిరీల నుంచి పది మంది చొప్పున వస్తారు.
వారిలో నుంచి ఖండానికి ఐదుగురు చొప్పున టాప్ 20 మందిని నిర్ణయిస్తారు.
తరువాత ఖండానికి ఇద్దరు చొప్పున నాలుగు ఖండాల నుంచి 8 మంది ఫైనల్ దశకు చేరుకుంటారు.
ఈ ఎనిమిది మందిలో నలుగురు ఫైనల్కు చేరతారు.
ఆ ఫైనల్లో ఒకరు మిస్ వరల్డ్ అవుతారు.
మిగతా వారు ఆయా ఖండాల వారీ విజేతలుగా, మొదటి, రెండో, మూడో రన్నరప్గా ఉంటారు.
కేవలం అందం, శారీరక కొలతలు మాత్రమే కాకుండా అనేక పోటీలు ఉంటాయి.
స్పోర్ట్స్ చాలెంజ్ పేరుతో ముందుగా పోటీలు నిర్వహిస్తారు.
టాలెంట్ చాలెంజ్లో వారు సంగీతం, కళలు, నృత్యం వంటి పోటీల్లో తమ ప్రతిభ చూపిస్తారు.
హెడ్ టు హెడ్ చాలెంజ్లో భాగంగా వారి మేధస్సు, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి చూస్తారు.
ఇవి కాక టాప్ మోడల్ చాలెంజ్ అని ఉంటుంది. ఇందులో ఫ్యాషన్ షో నిర్వహిస్తారు.
ఫ్యాషన్షోలో డిజైనర్ డ్రెస్ విభాగం కూడా ఉంటుంది.
సామాజిక సేవకు సంబంధించిన బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే విభాగం ఉంటుది.
మల్టీ మీడియా విభాగం కూడా ఒకటి చేర్చారు.
అందులో సోషల్ మీడియాలో వారిచ్చే సందేశాల వంటి వాటిని పరిశీలిస్తారు.
ఈ దశలన్నీ దాటిన వారు మిస్ వరల్డ్ ఫైనల్స్లో ఉంటారు.
కొన్ని అందాల పోటీల్లో స్విమ్సూట్ రౌండ్ ఉంటుంది.
కాంపిటీటర్స్ అందరూ స్విమ్ సూట్ మాత్రమే వేసుకుని కనిపిస్తారు.
2014 నుంచి మిస్ వరల్డ్లో ఆ రౌండ్ తీసేశారు.
”వారు మా దగ్గరకు వచ్చినప్పుడు వారిని ఇంటర్వ్యూ చేస్తాం. ఆటలు, హెడ్ టు హెడ్, ఫ్యాషన్, బ్యూటీ విత్ ఏ పర్పస్ వంటి ఐదారు భిన్నమైన పోటీలుంటాయి. జడ్జ్లు రకరకాల ఇంటర్వ్యూలు చేసి నిర్ణయం తీసుకుని టాప్ 20 మందిని ఎంపిక చేస్తారు” అని జూలియా మోర్లే వివరించారు.

ఫొటో సోర్స్, facebook.com/MissWorld
శరీర కొలతలు లెక్క ప్రకారం ఉన్న వారే ఎంపికవుతారా?
కొంతమంది అనుకుంటున్నట్లు మిస్ వరల్డ్లో కేవలం కొలతలకే ప్రాధాన్యత ఉండదంటున్నారు నిర్వాహకులు.
ఒకప్పుడు శరీర కొలతలకు ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు అలా కాదంటున్నారు.
”బ్యూటీ విత్ ఏ పర్పస్ అంటే మీరే రంగుతో ఉన్నారు నలుపా, తెలుపా, ఇంకోటా అని కాదు.. మీ వ్యక్తిత్వ్యం ఏంటని. అలాగే ఏళ్ల కిందట శారీరక కొలతలకు ప్రాధాన్యత ఉండేది. అప్పుడు కూడా అదొక రూల్ తప్ప, దాని వెనుక వేరే ఉద్దేశాల్లేవు. ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. అమ్మాయి నడుం ఒక అంగుళం ఎక్కువా తక్కువా అన్నది కాదు. ఆమె వ్యక్తిత్త్వం ఏంటనేది ముఖ్యం. మానవత్వం ముఖ్యం. వారు మనుషులుగా ఉండాలి. కరుణతో ఉండాలి. కలుపుగోలుతనంతో ఉత్తమమైనవి చేయాలి” అని జూలియా చెప్పారు.
అయితే ఆయా దేశాల్లో మిస్ వరల్డ్ని ఎంపిక చేసేప్పుడు కొన్ని సంస్థలు కొలతలు చూడవచ్చు లేదా నిబంధనలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.
మిస్ వరల్డ్ తరపున ఒక్కోదేశంలో ఒక్కో సంస్థ పోటీ నిర్వహిస్తుంది.
భారతదేశంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ పోటీ నిర్వహిస్తుంది.
మిస్ ఇంగ్లండ్ వ్యాఖ్యలు – భారత్ పై అసూయ ఉన్నవారే అలా అంటారు:
మిస్ ఇంగ్లండ్ చేసిన వ్యాఖ్యలపై జూలియా స్పందించారు.
ఆ వ్యాఖ్యలను తప్పు పట్టారు.
మిస్ ఇంగ్లండ్ కామెంట్ల మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
”మేం ఆ సంగతి లాయర్లకు అప్పగించాం. ఒక యువతి నుంచి అటువంటి మాటలు వినాలని ఎవరూ అనుకోరు. మేం దానిపై పోరాడి బాధ్యులు క్షమాపణ చెప్పేలా చేస్తాం. భారత్ అంటే అసూయ ఉన్న వారెవరో కావాలనే సమస్య సృష్టిస్తున్నారేమో. వారికి మతిభ్రమించి ఉండాలి లేదా ఈ అందమైన దేశానికి సమస్య సృష్టించాలని మాట్లాడుతున్నారేమో. మా అందరి తరపున భారతదేశానికి నేను క్షమాపణ చెబుతున్నా” అన్నారు జూలియా.

ఫొటో సోర్స్, facebook.com/MissWorld
‘మంచి మనసూ ముఖ్యమే’
”కేవలం అందం మాత్రమే ఏం చేసుకుంటాం.. దాంతో పాటూ మంచి మనసు కూడా ఉండాలి” అంటున్నారు నిర్వాహకులు.
అందుకే మిస్ వరల్డ్ పోటీలోకి వచ్చేవారు, సాధారణంగా ఏదో ఒక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు.
అలాగే ఫైనల్స్లో విజేతను ఎంపిక చేసే క్రమంలో అందంతో పాటు మనసు కూడా ప్రాధాన్యత ఉంటుందంటున్నారు నిర్వాహకులు.
అందుకే బ్యూటీ విత్ ఏ పర్పస్ అనేది మా ట్యాగ్ లైన్ అని చెబుతున్నారు.
”మిస్ వరల్డ్ అంటేనే బ్యూటీ విత్ పర్పస్. ఇక్కడ ప్రతి పోటీతారు తమ ప్రాజెక్టు తెస్తారు. అది పిల్లలకు, వృద్ధులకు సేవ కావచ్చు లేదా కేవలం ఒక్కరికి సాయం చేసేదైనా కావచ్చు. మొత్తంగా తన గురించి కాక, ఇతరులకు సాయం చేసే ఏదో ఒకటి. తాము ఇతరులకు ఏం చేస్తున్నాము అనేది ఉత్సాహంగా చెబుతున్నప్పుడే వారిలో నిజమైన అందం బయటపడుతుంది. అదే అందం. అదేదో పెద్ద ప్రపంచాన్ని కాపాడే గొప్ప విషయం కానక్కర్లేదు. లక్ష్యం ముఖ్యం. లక్ష్యం లేని అందం ఎందుకు?” అన్నారు జూలియా.
”ఒకసారి స్వీడన్ అమ్మాయి నా దగ్గరకు వచ్చి, తన దగ్గర పెద్ద పెద్ద సేవా ప్రాజెక్టులు ఏమీ లేవని చెప్పింది. కానీ అమ్మాయి రోజూ కాలేజీకి వెళ్లేముందు, వచ్చిన తరువాత తన ఇంటి పక్కన ఉన్న సొంతంగా పనులు చేసుకోలేని వృద్ధురాలికి ఆహారం తినిపించడం, స్నానం చేయించడం వంటి సేవ చేస్తోంది. అదెంతో గొప్ప విషయం. ఆ అమ్మాయి మంచి స్ఫూర్తి అనిపించింది నాకు. ఆమె ఒక కేటగిరీలో గెలిచింది కూడా” అన్నారు జూలియా
గెలుపు ఓటమలు నిర్ణయించే జడ్జ్లు ఎవరన్నది రహస్యంగా ఉంచుతారు నిర్వాహకులు. సాధారణంగా 9 లేదా 11 మంది జడ్జ్లు ఇందులో ఉంటారు.
వారు పోటీదారులతో సీరియస్ ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు.

ఫొటో సోర్స్, facebook.com/MissWorld
సినిమా చాన్స్లు..
భారతదేశంలో ఎవరైనా మిస్ వరల్డ్ వంటి టైటిల్స్ గెలిస్తే వెంటనే వారికి సినిమా అవకాశాలు వస్తుంటాయి.
కానీ విదేశాల్లో మాత్రం అలా కాదు.
వారు ఏ వృత్తి నుంచి వచ్చారో మళ్లీ అదే వృత్తిలోకో, తమకిష్టమైన మరో ప్రొఫెషన్కో వెళ్లిపోతారు.
భారతదేశంలో మాదిరిగా సినిమా, అడ్వర్టయిజింగ్, మోడలింగ్ రంగాల్లోకి వచ్చేవారు తక్కువేనని మిస్ వరల్డ్ సీఈవో చెబుతున్నారు.
”భారత్లో మంచి సినిమా పరిశ్రమ ఉంది. భారతీయులు మిస్ వరల్డ్ గెలిస్తే వేరే వృత్తిలో ఉన్నా వెంటనే బాలీవుడ్ అవకాశాలు వస్తాయి. ఇతర దేశాల వారు సాధారణంగా తమకు ఆసక్తి ఉన్న రంగంలోకి వెళతారు. ఉదాహరణకు మిస్ వరల్డ్ గెలిచిన జమైకా అమ్మాయి అక్కడ రాజకీయాల్లోకి వెళ్లి మంత్రి అయింది” అని జూలియా అన్నారు.
మిస్ వరల్డ్ నిర్వహణ కోసం, తెలంగాణ ప్రభుత్వం తమకు భారీగా నగదు ఇచ్చిందన్న ఆరోపణలను జూలియా మోర్లే ఖండించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS