Home జాతీయ national telgu బెంగళూరు విషాదానికి బాధ్యులెవరు, పరేడ్‌కు పర్మిషన్ ఇచ్చిందెవరు?

బెంగళూరు విషాదానికి బాధ్యులెవరు, పరేడ్‌కు పర్మిషన్ ఇచ్చిందెవరు?

4
0

SOURCE :- BBC NEWS

చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట

ఫొటో సోర్స్, Getty Images

కర్ణాటక ప్రభుత్వం, పోలీసులు, క్రికెట్ పరిపాలనతో ముడిపడి ఉన్న అనేక అధికార వ్యవస్థల వైఫల్యం కారణంగా ఒక క్రికెట్ కార్యక్రమంలో అత్యంత దారుణమైన తొక్కిసలాటకు బెంగళూరు వేదికగా మారింది.

ఈ ఘటనకు సంబంధించిన అనేక అంశాలు, అధికార వ్యవస్థలతో పాటు వాటి నిర్ణయాలపై కఠిన ప్రశ్నలను లేవనెత్తాయి.

కానీ ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు పూర్తిస్థాయిలో దొరకలేదు. ఇంకా కొన్ని ఊహలకే పరిమితమయ్యాయి.

18 ఏళ్ల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్‌ టైటిల్‌ను గెలిచిన ఆనందం భారత ఐటీ రాజధానిగా పేరున్న బెంగళూరులో పతాకస్థాయికి చేరింది.

మంగళవారం రాత్రి జట్టు గెలుపొందగానే అభిమానులు, టపాసులతో సంబరాలు చేసుకున్నారు. అనేక ప్రాంతాల్లో తెల్లవారుజామున 3 గంటల వరకు నగర పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.

విక్టరీ పరేడ్ బెంగళూరులోని విధాన సభ నుంచి స్టేడియం వరకు జరుగుతుందని బుధవారం ఉదయం 7:01 గంటలకు ఆర్సీబీ అధికారిక ఎక్స్ హ్యాండిల్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. తమ పోర్టల్ నుంచి ఉచిత పాస్‌లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కూడా అందులో పేర్కొన్నారు.

రోడ్ షో గురించి మధ్యాహ్నం 3.14 గంటలకు ఆర్సీబీ హ్యాండిల్ నుంచి మరో ప్రకటన వచ్చింది. అలాగే, పోలీసులు, ఇతర అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను ప్రజలంతా పాటించాలని ఆ ప్రకటనలో కోరారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఆర్సీబీ గెలుపు సంబరాలు

ఫొటో సోర్స్, Getty Images

ఈ ప్రశ్నలకు బదులేది?

విక్టరీ పరేడ్ నిర్వహించడానికి ఆర్సీబీకి (రాత్రి 1:45 నుంచి ఉదయం 7:00 గంటల మధ్యలో) ఏ అథారిటీ అనుమతి ఇచ్చిందనే ప్రశ్నకు సమాధానం ఇంకా తెలియాల్సి ఉంది.

”ఆఖరి ఓవర్ వరకు ఏ జట్టు గెలుస్తుందనే సంగతి ఎవరికీ తెలియదు. జట్టు సభ్యులు జూన్ 4వ తేదీనే బెంగళూరుకు బయల్దేరారు. ఈ లోపే నగరంలో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసే సమయం ఉందా? ఇది అంత తేలికైన విషయం కాదనే సంగతి గమనించాలి” అని బీబీసీతో కర్ణాటక మాజీ డీజీపీ ఎస్టీ రమేష్ అన్నారు.

బందోబస్తు ఏర్పాటు చేసే సమయంలో ఎక్కడి నుంచి ఎవరు వస్తారు? ఎక్కడి నుంచి వెళతారు? ఆ సమయంలో రద్దీని ఎలా నియంత్రించాలి? అనే విషయాలు చూడాల్సి ఉంటుంది.

అదే సమయంలో, ఎలాంటి నేరాలు జరగకుండా చూసుకోవాలి. భారీ సంఖ్యలో ప్రజలంతా గుమిగూడినప్పుడు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తులపై నిఘా ఉంచడం చాలా ముఖ్యం. మోహరించాల్సిన భద్రతా దళాల సంఖ్యను కూడా చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటారు.

“శాంతిభద్రతల అంశం కూడా ఉంది. ఇదంతా ప్లాన్ చేయడానికి పోలీసుల వద్ద సమయం ఉందా? ఇంత తక్కువ సమయంలో పోలీసు బలగాలను సమీకరించాలి. అంటే పొరుగు జిల్లాల నుంచి కూడా పోలీసు బలగాలను సమీకరించాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయడానికి నగర పోలీసుల వద్ద అంత సమయం ఉందా? ఎవరికీ ఏమీ తెలియదు” అని బీబీసీతో రమేష్ వివరించారు.

స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు సన్మాన కార్యక్రమం జరుగుతుందని బెంగళూరు సిటీ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. అలాగే, ట్రాఫిక్ ఆంక్షల సమాచారమిస్తూ మధ్యాహ్నం 3:28 గంటలకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే, అందులో రోడ్ షో ఉంటుందా? లేక కేవలం బస్ పరేడ్ ఉంటుందా? అనే సమాచారం ఇవ్వలేదు.

అలాగే ఆర్సీబీకి విధాన సభ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విక్టరీ పరేడ్ చేయడానికి అనుమతి ఇవ్వలేదని పోలీసుల తరఫు నుంచి సోషల్ మీడియాలో ఎక్కడా ఎటువంటి ప్రకటనా రాలేదు.

తొక్కిసలాట తర్వాతి దృశ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఏం చేసి ఉండొచ్చు?

బుధవారం మధ్యాహ్నం హోంమంత్రి జి. పరమేశ్వర అధ్యక్షతన జరిగిన సమావేశంలో, విక్టరీ పరేడ్‌ను ఇంత తక్కువ సమయంలో నిర్వహించలేమని నగర పోలీసులు ఎందుకు చెప్పలేదనే చర్చ ఇప్పుడు ఎక్కువగా జరుగుతోంది.

”ఇది సాధ్యం కాదని అధికారులకు పోలీసులు చెప్పి ఉండాలి. ఇందులో ఎదురయ్యే ఇబ్బందుల గురించి కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం, ఆర్సీబీ బృందానికి అర్థమయ్యేలా చెప్పి వారితో సమన్వయం చేసుకొని ఉండాల్సింది. ఇది కచ్చితంగా సాధ్యమయ్యే పని కాదని కచ్చితంగా ముఖ్యమంత్రి, హోం మంత్రికి చెప్పి ఉండాలి” అని రమేష్ అన్నారు.

రమేష్ చెప్పిన మాటలతో మరో పోలీస్ అధికారి కూడా ఏకీభవించారు. అయితే ఆయన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు.

”ఇదొక రాజకీయ నిర్ణయం. పోలీసుల నిర్ణయం కాదు (వేడుకలకు అనుమతి ఇవ్వడం). అభిమానులకు గెలుపు మజా తగ్గిన తర్వాత కొన్ని రోజులకు ఈ వేడుకను నిర్వహించి ఉండాల్సింది. అప్పుడు ఇంత రద్దీ ఉండదు. అప్పుడు ఇలా ప్రాణాల మీదకు రాకుండా ఉండేది” అని ఆయన వివరించారు.

ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్

ఫొటో సోర్స్, Getty Images

హోం మంత్రి ఏమన్నారు?

ఈ మొత్తం కార్యక్రమాన్ని కేఎస్‌సీఏ, ఆర్సీబీ నిర్వహించాయని విలేఖరుల సమావేశంలో హోం మంత్రి అన్నారు. ప్రభుత్వం కేవలం ఈ కార్యక్రమానికి హాజరైందని స్పష్టం చేశారు.

ప్రభుత్వం కేవలం ఈ వేడుకకు హాజరైనట్లయితే, మరి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, జట్టుకు స్వాగతం పలకడానికి హెచ్‌ఏఎల్ విమానాశ్రయానికి వెళ్లాల్సిన అవసరం ఏంటని కాంగ్రెస్ నాయకుడొకరు అన్నారు.

ఆర్సీబీ పోర్టల్ నుంచి ఉచిత పాస్‌లు తీసుకొని స్టేడియం లోపలికి వెళ్లడానికి ప్రయత్నించిన సమయంలో ఈ తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

స్టేడియం సిబ్బంది, ఎవరినీ లోపలికి అనుమతించలేదు. ఎందుకంటే ప్రజలు, స్టేడియానికి చేరుకునే లోపే స్టేడియంలోని 32వేల సీట్లు అభిమానులతో నిండిపోయాయి. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు.

తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ ఇన్‌స్టా హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)