Home LATEST NEWS telugu తాజా వార్తలు బిహార్: స్కూల్లో నకిలీ పోలీస్ స్టేషన్‌, ఉద్యోగాల పేరుతో లక్షల మోసం, ఎలా...

బిహార్: స్కూల్లో నకిలీ పోలీస్ స్టేషన్‌, ఉద్యోగాల పేరుతో లక్షల మోసం, ఎలా బయటపడిందంటే…

9
0

SOURCE :- BBC NEWS

నకిలీ పోలీస్ స్టేషన్, ఉద్యోగాల పేరుతో మోసం

ఫొటో సోర్స్, Pankaj Yadav

  • రచయిత, సీటూ తివారీ
  • హోదా, బీబీసీ ప్రతినిధి
  • 11 జూన్ 2025

బిహార్‌లోని పూర్నియా జిల్లాలో నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది.

జిల్లాలోని మోహని పంచాయతీలో ఈ ఘటన జరిగింది. అక్కడ పోలీస్ స్టేషన్ క్యాంప్ ఆఫీస్‌ ఏర్పాటు చేసి, శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు కల్పించే పేరుతో మోసం జరిగిందని ఆరోపణలొచ్చాయి.

బిహార్ గ్రామ రక్షా దళ్, హోంగార్డు ఉద్యోగాల పేరుతో ఈ శిక్షణ డిసెంబర్ 2024 నుంచి జనవరి 2025 మధ్య జరిగినట్టు చెబుతున్నారు.

“నకిలీ పోలీస్ స్టేషన్ కేసు ఏదీ లేదు. పంచాయతీ రాజ్ విభాగం గ్రామ రక్షా దళ్‌కు 30 రోజుల శిక్షణ ఇచ్చింది. ప్రధాన నిందితుడు రాహుల్ కుమార్ సాహ్‌కు ఈ బిహార్ గ్రామ రక్షా దళ్‌తో సంబంధం ఉంది” అని పూర్ణియా ఎస్పీ కార్తికేయ కె. శర్మ బీబీసీతో చెప్పారు.

”ఉద్యోగాల పేరుతో రాహుల్ కొంతమందిని మోసం చేశారు. ఇప్పటివరకు మాకు అలాంటి ఫిర్యాదులు 25 అందాయి. ఈ మొత్తం విషయంలో స్థానిక అధికారి పాత్రపై కూడా దర్యాప్తు జరుగుతోంది” అని కార్తికేయ కె. శర్మ చెప్పారు.

బీబీసీ వాట్సాప్ చానల్

కేసు పూర్వాపరాలేంటి?

మోహని పంచాయితీలో బిహార్ రాష్ట్ర దళపతి, గ్రామ రక్షా దళ్ అనే బ్యానర్‌ను ఏర్పాటు చేసి డిసెంబర్ 2024లో నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చినట్టు ఆరోపణలొచ్చాయి.

ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బిహార్ గ్రామ రక్షా దళ్, దళపతి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తాయి. ఇందులో 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీ యువకులుంటారు.

అగ్నిప్రమాదం, వరదలు సంభవించినప్పుడు, అంటువ్యాధులు ప్రబలినప్పుడు వీరు సేవలందిస్తారు. శాంతి భద్రతల పరిరక్షణ, రద్దీని నియంత్రించడం వంటి విధులు కూడా నిర్వర్తిస్తారు.

ఈ శిక్షణ పూర్తి చేసుకున్న యువతీ యువకులు ఇప్పుడు ఉద్యోగాల పేరుతో మోసపోయామని ఫిర్యాదు చేశారు.

ఈ విషయంలో మోసపోయిన అనేకమంది ఫిర్యాదుదారులతో బీబీసీ మాట్లాడింది.

23 ఏళ్ల సంజన కుమారి బీకాం చదువుతున్నారు. ఆమె కూడా కస్బా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

“సుమారు తొమ్మిది నెలల క్రితం మా దగ్గర 1,500 రూపాయలు తీసుకున్నారు. మేం శిక్షణ పొందడానికి కొన్ని రోజులు బేతౌనాలోని పాఠశాలకు కూడా వెళ్ళాం. గ్రామ రక్షా దళ్‌కు గుర్తింపు లభిస్తే, మనందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయని రాహుల్ చెప్పారు. కానీ ఇప్పుడు రాహుల్ పరారీలో ఉన్నారు” అని సంజన చెప్పారు.

నకిలీ పోలీస్ స్టేషన్, ఉద్యోగాల పేరుతో మోసం

ఫొటో సోర్స్, Pankaj Yadav

‘ఎన్‌సీసీ పరిచయంతో’

“ఎన్‌సీసీ నుంచి మాకాయన తెలుసు. మేము ఆయన్ని మా సోదరుడిగా భావించాం. గత ఏడాదిలో ఆయన దాదాపు 300 మందిని మోసం చేశారు. ఆయన ఒక ప్రభుత్వ పాఠశాలలో పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయని ఆయన పోలీస్ ఇన్‌స్పెక్టర్‌లా వ్యవహరించారు” అని మరో మహిళ చెప్పారు.

“ఆయన మా అమ్మకి కూడా యూనిఫాం ఇచ్చి, ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని చెప్పారు. కానీ మా అమ్మకి ఒక్కసారి కూడా జీతం రాలేదు. ఆ యూనిఫాంపై బీజీఆర్‌డీ (బిహార్ గ్రామ రక్షా దళ్) అని రాసి ఉంది. 10 నుంచి 15 వేల రూపాయలు అడిగేవారు. జీతం 22 వేలు అవుతుందని చెప్పేవారు. నన్ను కూడా ఉద్యోగంలో చేరమని అడిగారు. కానీ నాకు అనుమానం వచ్చింది” అని ఆమె తెలిపారు.

భాగల్పూర్, సుపౌల్, పూర్నియా, కటిహార్ సహా అనేక జిల్లాల యువతను ఉద్యోగాల పేరుతో రాహుల్ మోసం చేశారని చాలామంది ఆరోపిస్తున్నారు.

“ఉద్యోగం లేక మేం ఖాళీగా ఉన్న సమయంలో గ్రామ రక్షా దళ్ దరఖాస్తు నింపాం. ఆ తర్వాత మేం ఎంపికయ్యామంటూ రాహుల్ నుంచి మాకు కాల్ వచ్చింది. మేం అప్పు తీసుకుని ఆయనకు రూ. 1500 నుంచి రూ. 2500 ఇచ్చాం. మాకు ఉద్యోగం ఇప్పిస్తానని మొదట చెప్పిన ఆయన తరువాత మమ్మల్ని బెదిరించడం ప్రారంభించారు” అని నరేశ్ కుమార్ రాయ్ అనే వ్యక్తి చెప్పారు.

నకిలీ పోలీస్ స్టేషన్, ఉద్యోగాల పేరుతో మోసం

ఫొటో సోర్స్, Pankaj Yadav

గ్రామస్తులకు అనుమానం రాలేదా?

“బెతౌనాలోని ఒక సబ్-హెల్త్ సెంటర్ భవనంలో ఒకవైపు ఒక పాఠశాల నడుస్తుండగా, మరోవైపు ఒక చిన్న భవనం ఖాళీగా ఉంది. రాహుల్ ఈ ఖాళీ భవనాన్ని పోలీస్ స్టేషన్‌గా మార్చారు”

“ఇది కస్బా పోలీస్ స్టేషన్‌లోని ఒక రకమైన పంచాయతీ శాఖ. ఇక్కడే ఆయన పోలీసు యూనిఫాంలో కూర్చుని నిరుద్యోగులను మోసం చేసేవారు. గ్రామస్థులకు, ప్రజలకు తాను శక్తిమంతుణ్ని అని చూపించేందుకు పోలీసులతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు” అని స్థానిక జర్నలిస్ట్ సయ్యద్ తహసీన్ అలీ చెప్పారు.

రాహుల్ కుమార్ సాహ్ గురించి దొరికిన ఏకైక సమాచారం ఏంటంటే…ఆయన ఎన్‌సీసీ క్యాడెట్. ఎన్‌సీసీ ద్వారానే ఆయన చాలామందితో పరిచయం పెంచుకున్నారు.

డిసెంబర్ 2024లో రాహుల్ బెతౌనాలోని మధ్య విద్యాలయంలో బిహార్ రాజ్య దళపతి, గ్రామ రక్షా దళ్ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఈ బ్యానర్ చిత్రాల కింద కస్బా పోలీస్ స్టేషన్ అని రాసి ఉంది.

ఖాళీగా ఉన్న పాఠశాలలో ఒక నెల పాటు శిక్షణ ఇచ్చిన రాహుల్, 2025 జనవరి 26న, పంచాయతీ అధిపతి శ్యామ్‌సుందర్ ఒరాన్‌ను అతిథిగా ఆహ్వానించారు.

శిక్షణ పూర్తి చేసుకున్న యువతీ యువకులను శ్యామ్‌సుందర్ ఒరాన్ సత్కరించారు. శిక్షణ తర్వాత రాహుల్ కుమార్ సాహ్ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.

“నాకేమీ తెలియదు. రాహుల్ వచ్చి శిక్షణ ఇచ్చారు. పోలీసులకు తెలుసనుకున్నా. మూడు గంటల పాటు అబ్బాయిలకు, అమ్మాయిలకు శిక్షణ ఇచ్చేవారు. నేను గ్రామాధిపతిని. ఎవరైనా నన్ను ఏదైనా కార్యక్రమానికి ఆహ్వానిస్తే, వెళ్తాను” అని శ్యాంసుందర్ ఒరాన్ బీబీసీతో చెప్పారు.

పాఠశాలలో ఈ రకమైన కార్యకలాపాలకు అనుమతి ఉందా? అన్న ప్రశ్నకు “శిబిరం నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ లేఖను పాఠశాల ఉపాధ్యాయుడు అడుగుతూనే ఉన్నారు. కానీ రాహుల్ ఎప్పుడూ దానిని ఇవ్వలేదు. తాను పట్నా నుంచి వస్తున్నానని చెబుతూ దానిని వాయిదా వేస్తూనే ఉన్నారు. మొత్తం శిక్షణ సమయంలో, అనుమానం కలిగించేది ఏమీ జరగలేదు” అని ఆయన బదులిచ్చారు.

రాహుల్ కుమార్ సాహ్ పరారీలో ఉన్నారు. ఈ కేసులో గ్రామాధిపతి శ్యామ్‌సుందర్ ఒరాన్ పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నకిలీ పోలీస్ స్టేషన్, ఉద్యోగాల పేరుతో మోసం

ఫొటో సోర్స్, Pankaj Yadav

‘జాతరలో వాహనాల తనిఖీలు’

శిక్షణ ఇచ్చిన తర్వాత రాహుల్ ఓ బాధితునికి విధులు కూడా కేటాయించారు. చాలా చోట్ల వాహనాల తనిఖీలు వంటివి చేయించారు.

“మోహని పంచాయతీ ప్రాంతంలో వాహన తనిఖీలు, మద్యం తనిఖీలు, పెట్రోలింగ్ వంటివి చేసేవారు. హెల్మెట్ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరన్నా పట్టుబడితే రూ. 400 చలాన్ విధించేవారు. మద్యం దొరికితే, దానిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చేవారు. బెతౌనా నుంచి కస్బా పోలీస్ స్టేషన్ కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అయినప్పటికీ ఇది జరిగింది” అని స్థానిక జర్నలిస్టు పంకజ్ యాదవ్ చెప్పారు.

రాహుల్ కుమార్ నుంచి పొందిన ఐడీ కార్డును ఉపయోగించి సంజీవ్ కుమార్ అనే బాధితుడు కూడా రెండు రోజుల పాటు విధులు నిర్వహించారని స్థానిక జర్నలిస్ట్ పంకజ్ యాదవ్ చెప్పారు.

“రాహుల్ ఎన్‌సీసీలో మా సీనియర్. గ్రామ రక్షా దళ్‌కు నియామకాలు జరుగుతున్నాయని ఆయన నాకు చెప్పారు. పరీక్ష ఉండదని, నేరుగా నియమాకం ఉంటుందని తెలిపారు. మా కులం కారణంగా మాకు డిస్కౌంట్ లభిస్తుందన్నారు. మొదట ఆయనకు రూ. 2500 ఇచ్చాం. తర్వాత ఐడీ కార్డు కోసం రూ. 200 ఇచ్చాం. మాకు యూనిఫాం కూడా కుట్టించారు. ఆయన మమ్మల్ని రెండు రోజులు జాతరలో డ్యూటీ చేయమని కూడా బలవంతం చేశారు. కానీ ఎటువంటి లెటర్ ఇవ్వలేదు. తర్వాత పారిపోయారు” అని బాధితుడు తెలిపారు.

ఉద్యోగాల పేరుతో రాహుల్ ఒక వాట్సాప్ గ్రూప్‌ను కూడా సృష్టించారు.

”మా దగ్గరి నుంచి రూ.10 వేలు తీసుకున్నారు. రూ. 15 లక్షల నుంచి రూ. 20లక్షల వరకు మోసం చేశారు. మాకు నిజం తెలియగానే, మేం ఆయన ఇంటికి వెళ్లి మా డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగాం. కానీ ఆయన పారిపోయారు” అని బాధితుడు అనిల్ కుమార్ చెప్పారు.

అయితే పూర్నియా ఎస్పీ కార్తికేయ కె.శర్మ దీనిని ఖండిస్తున్నారు.

“జాతర మొదలైన వాటిలో డ్యూటీ ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు వాహన తనిఖీలు లేదా మద్యం తనిఖీల గురించి తెలియదు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ప్రకారం, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ప్రజల నుంచి రెండు వేల నుంచి రెండున్నర వేల రూపాయలు తీసుకున్నారు” అని ఆయన చెప్పారు.

బిహార్ గ్రామ రక్షా దళ్, దళపతితో సంబంధం ఉన్న వ్యక్తులు చాలాకాలంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం డిమాండ్ చేస్తున్నారు.

“ప్రభుత్వం డిమాండ్లను అంగీకరించడం లేదు. కానీ బిహార్ మొత్తంలో గ్రామ రక్షా దళ్, దళపతి పునరుద్ధరణ పేరుతో మోసం జరుగుతోంది” అని దళపతి సంఘ్ ప్రధాన కార్యదర్శి రవి రంజన్ అన్నారు.

బిహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన సంఘటన ఇది మొదటిది కాదు. 2022 సంవత్సరం మొదట్లో, బాంకా జిల్లాలో ఇలాంటి కేసు వెలుగులోకి వచ్చింది. దీనిలో ఇన్‌స్పెక్టర్ నుంచి వాచ్‌మెన్ వరకు అందరూ నకిలీలే.

2024 సంవత్సరంలో, జముయిలోని సికందరా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒక నకిలీ ఐపీఎస్ దొరికిపోయారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS