Home LATEST NEWS telugu తాజా వార్తలు బిహార్‌: ‘‘ఆ వార్డు, ఈ వార్డు అంటూ ఆస్పత్రి అంతా 4 గంటలు తిప్పారు’’ అత్యాచారం...

బిహార్‌: ‘‘ఆ వార్డు, ఈ వార్డు అంటూ ఆస్పత్రి అంతా 4 గంటలు తిప్పారు’’ అత్యాచారం తరువాత మృతి చెందిన దళిత బాలిక బంధువుల ఆవేదన

10
0

SOURCE :- BBC NEWS

బిహార్

ఫొటో సోర్స్, Getty Images

  • రచయిత, సీటూ తివారీ
  • హోదా, బీబీసీ ప్రతినిధి
  • 3 జూన్ 2025

బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో పదేళ్ల దళిత బాలికపై అత్యాచారం జరిగింది. బాలికను పట్నాలోని పీఎంసీహెచ్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.

బాలికకు చికిత్స అందించడంలో పీఎంసీహెచ్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఆమె చనిపోయిందని బాధిత కుటుంబం ఆరోపించింది. అయితే, బాలికను కాపాడటానికి అన్ని ప్రయత్నాలు చేశామని ఆసుపత్రి చెబుతోంది.

ఈ సంఘటన అనంతరం బిహార్‌లో శాంతిభద్రతలు, ఆసుపత్రుల నిర్వహణపై ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించాయి.

‘ఆస్పత్రుల పేరుతో పెద్ద భవనాలు నిర్మించడం వల్ల ఉపయోగం ఏమిటి?’ అని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) ప్రశ్నించింది.

అదే సమయంలో, అధికార జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లు ఈ ఘటనను దురదృష్టకరమని పేర్కొన్నాయి.

బాలిక మృతి ఘటనను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఘటనపై సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరిగేలా చూడాలని బిహార్ సీఎస్, డీజీపీలను మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ కిషోర్ రహత్కర్ ఆదేశించారు. ఆసుపత్రి అధికారులు, పోలీసుల పాత్రపై దర్యాప్తు చేయాలని ఆమె సూచించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
పట్నాలో ఉన్న పీఎంసీహెచ్ ఆసుపత్రి

ఫొటో సోర్స్, Getty Images

ఏం జరిగింది?

ముజఫర్‌పూర్‌లో పదేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటన మే 26న వెలుగులోకి వచ్చింది.

ఈ కేసులో నిందితుడైన రోహిత్ కుమార్ సాహ్నిని పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, బాలిక పిన్ని ఇంటి సమీపంలో నిందితుడు రోహిత్ నివసిస్తున్నారు.అతనికి బాలిక పరిచయముంది.

ఈ బాలిక మూడో తరగతి చదువుతోంది. పాప తండ్రి చాలా ఏళ్ల కిందటే మరణించాడు. బాలిక తల్లి తన ముగ్గురు పిల్లలను పెంచడానికి కూలి పనిచేస్తున్నారు.

“ఉదయం 10 గంటల సమయంలో బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా రోహిత్ వచ్చాడు. బాలికను ఆమె పిన్ని ఇంటి వద్ద దింపుతానని చెప్పి సైకిల్‌పై తీసుకెళ్లాడు. కానీ, రోడ్డు నుంచి 150 మీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రాంతానికి బాలికను తీసుకెళ్లి, అత్యాచారం చేశాడు. బాలికను చంపాలనే ఉద్దేశంతో ఆమెను గాయపరిచాడు” అని బాలిక బాబాయ్ బీబీసీతో చెప్పారు.

పాప చాలాసేపటి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో, ఆమె కోసం వెతకడం ప్రారంభించామని బాలిక బాబాయ్ చెప్పారు.

“మేం రోహిత్‌ను పట్టుకొని ప్రశ్నించాం. కానీ, అతను మాకేం చెప్పలేదు. పోలీసులకు ఫోన్ చేసి అతన్ని (రోహిత్) పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాం. అయినా, అతను నోరు విప్పలేదు. అప్పుడే రోడ్డుపై గాయాలతో పడి ఉన్న బాలిక కనిపించిందని ఫోన్ వచ్చింది. మొదట బాలికను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాం. తర్వాత, అక్కడి నుంచి ముజఫర్‌పూర్‌లోని ఎస్‌కేఎంసీహెచ్ ఆసుపత్రికి తీసుకెళ్లాం” అని ఆయన చెప్పారు.

ముజఫర్‌పూర్‌

పోలీసులు ఏం చెబుతున్నారు?

ఈ ఘటనపై ముజఫర్‌పూర్ గ్రామీణ ఎస్పీ విద్యాసాగర్‌తో బీబీసీ మాట్లాడింది.

“ఈ కేసులో పది రోజుల్లోనే చార్జిషీట్‌ను సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నాం, త్వరితగతిన విచారణ జరుపుతాం.ఘటనా స్థలంలో బాలిక గౌను సహా అనేక ఆధారాలు లభించాయి. శాస్త్రీయ ఆధారాల సేకరణలో ఉన్నాం” అని ఎస్పీ విద్యాసాగర్ అన్నారు.

నిందితుడి వివరాలు వెల్లడిస్తూ “నిందితుడు రీల్స్ చేస్తుంటాడు. ఒకసారి తన సోదరికి మత్తు పదార్థాలు ఇచ్చి రీల్ చేశాడు. బాలికకు కూడా కుర్‌కురే, చాక్లెట్ ఇచ్చాడు. నిందితుడి కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. నిందితుడి భార్య అతన్ని వదిలేసింది” అని ఎస్పీ చెప్పారు.

బాలికను ముజఫర్‌పూర్‌లోని శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ (ఎస్‌కేఎంసీహెచ్)పీఐసీయూ (పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో చేర్చారు.

“బాలికపై అత్యాచారం జరిగింది. ఆమె మెడ, ఛాతీపై గాయాల గుర్తులున్నాయి. మెడపై చాలా లోతుగా గాయం ఉంది. అప్పటికి బాలిక పరిస్థితి నిలకడగానే ఉంది. కానీ, ఆమె శ్వాసనాళంపై రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ చేయాల్సిన అవసరం ఏర్పడింది” అని ఎస్‌కేఎంసీహెచ్ సూపరింటెండెంట్ కుమారి విభ బీబీసీకి తెలిపారు.

ఎస్‌కేఎంసీహెచ్‌లో శ్వాసనాళ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ సౌకర్యం లేదు. దీని కోసం, ఎయిమ్స్ పట్నాలోని ఈఎన్‌టీ విభాగాన్ని సంప్రదించింది ఆసుపత్రి.

“ఈఎన్‌టీ విభాగంలో శ్వాసనాళం రీకన్‌స్ట్రక్షన్ చేసే వైద్యుడు సెలవులో ఉన్నాడు. దీంతో, మే 31న బాలికను పట్నా మెడికల్ కాలేజీ (పీఎంసీహెచ్)కు రిఫర్ చేశాం. అక్కడ ఆమె రాత్రంతా బతికే ఉంది” అని సూపరింటెండెంట్ విభ అన్నారు.

‘ఆసుపత్రిలో మమ్మల్ని తరిమికొట్టారు’

పట్నా మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కి రిఫర్ చేయడంతో, బాలికను అక్కడికి తీసుకెళ్లారు.

బాలిక బాబాయ్ బీబీసీతో మాట్లాడుతూ “మేం మా అమ్మాయితో ఒంటి గంట తర్వాత అక్కడికి చేరుకున్నాం. ఆసుపత్రి వాళ్లు మమ్మల్ని నాలుగు గంటలు పరిగెత్తించారు. బాలికను ఆ వార్డు, ఈ వార్డు అంటూ తిప్పించారు. అమ్మాయిని ఎస్‌కేఎంసీహెచ్‌లో బాగానే చూశారు కానీ, ఇక్కడ (పీఎంసీహెచ్) ఏర్పాట్లు లేవు. మా కూతురు రాత్రంతా ఇబ్బంది పడుతూనే ఉంది. మేం మా పాప దగ్గరకు వెళ్లినప్పుడల్లా గార్డు మమ్మల్ని తరిమికొట్టేవాడు. ఉదయం ఆమెను చూసినప్పుడు తన గొంతు, నోటి నుంచి రక్తం కారుతోంది. మా బిడ్డ చనిపోయింది” అని అన్నారు.

ఈ విషయంపై పీఎంసీహెచ్ సూపరింటెండెంట్ ఐఎస్ ఠాకూర్‌తో బీబీసీ మాట్లాడింది.

“మే 31న నేను సెలవులో ఉన్నాను. డాక్టర్ అభిజీత్ కుమార్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. పేషెంట్ రిజిస్ట్రేషన్ మధ్యాహ్నం 1:23 గంటలకు పూర్తయింది. ఆమెను 3:36 గంటలకు గైనకాలజీ విభాగంలో చేర్చారు” అని ఠాకూర్‌ అన్నారు.

అడ్మిషన్ ఆలస్యం కావడానికి గల కారణం గురించి అడిగినప్పుడు “ముజఫర్‌పూర్‌లోని పీఐసీయూలో చిన్నారి ఉండటంతో, కుటుంబీకులు ఆమెను మొదట పీడియాట్రిక్స్ విభాగానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించిన తర్వాత, ఈఎన్‌టీ (చెవి, ముక్కు, గొంతు) విభాగానికి పంపారు. మాకు ఈఎన్‌టీలో ఐసీయూ లేకపోవడంతో ఆమెను గైనకాలజీ విభాగంలోని ఐసీయూలో ఉంచారు. వైద్యులు బాలికను మొత్తం పరీక్షించారు. ఆ చిన్నారి అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అంబులెన్స్‌లో ఉంది. బెడ్ దొరకలేదనే ఆరోపణలు నిరాధారమైనవి” అని ఠాకూర్ తెలిపారు.

బాలిక రిఫరల్ గురించి పీఎంసీహెచ్ అడ్మినిస్ట్రేషన్‌కు తెలియదా?

ఈ ప్రశ్నకు ఐఎస్ ఠాకూర్ స్పందిస్తూ “ఎస్‌కేఎంసీహెచ్‌ మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. బాలిక పరిస్థితి విషమించింది. సాయంత్రం 6:15 గంటలకు ఆమె ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. మేం రాత్రంతా కష్టపడ్డాం కానీ, బాలికను రక్షించలేకపోయాం” అని చెప్పారు.

ప్రభుత్వంపై విమర్శలు

మే 31న బాలికను చేర్చుకోవడంలో ఆలస్యం కావడంతో బిహార్ కాంగ్రెస్ నాయకులు ఆసుపత్రికి వెళ్లారు.

ఘటనపై ఆర్జేడీ సహా వామపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి శరవత్ జహాన్ ఫాతిమా ముజఫర్‌పుర్‌లో బాలికను పరామర్శించారు.

“ఆ బాలికను విమానంలో తరలించి చికిత్స అందించాలని డిమాండ్ చేశాం. కానీ, వాళ్లు బాలికను అలాగే ఉంచారు ఎందుకంటే, ప్రధాని నరేంద్ర మోదీ మే 29, 30 తేదీల్లో బిహార్‌కు వస్తున్నారు” అని ఆరోపించారు.

బీజేపీ అధికార ప్రతినిధి అనామిక సింగ్ పటేల్ మాట్లాడుతూ “బాలిక మరణం దురదృష్టకరం. నేను కూడా ఒక ఆసుపత్రిని నడుపుతున్నాను. ఆసుపత్రిలో బెడ్ పొందడమనేది సమయం తీసుకునే ప్రక్రియ. మా ప్రభుత్వంలోని వ్యక్తులు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు” అని తెలిపారు.

“ఈ సంఘటన దురదృష్టకరం. నిందితుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. దోషులపై చట్టపరమైన చర్యలు ఉంటాయి” అని జేడీయూ ప్రతినిధి అంజుమ్ అరా అన్నారు.

సీఎం నితీష్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుంటూ‌ ఆర్‌జేడీ ఎక్స్‌లో పోస్టు పెట్టింది.

“పీఎంసీహెచ్‌లో అడ్మిట్ కావడానికి అత్యాచార బాధితురాలు బయట గంటల తరబడి వేచి ఉంది. కానీ ఈ వ్యవస్థ ఒక్క అంగుళం కూడా కదలలేదు. కుర్చీ బాబూ.. ఆసుపత్రుల పేరుతో నిర్మిస్తున్న పెద్ద భవనాల చుట్టూ గందరగోళం, అవినీతి, దుష్ప్రవర్తన, వనరుల కొరత ఉంటే దాని వల్ల ఉపయోగం ఏంటి?” అని ఆ పోస్టులో రాసింది.

బిహార్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులలో నిర్వహణాలోపాలున్నట్లు గతంలో కూడా వార్తలు వచ్చాయి. పట్నాలోని ఎన్ఎంసీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల రోగి కాలి వేళ్లను ఓ ఎలుక కొరికింది. అంతేకాదు, అదే ఆసుపత్రిలో నవంబర్ 2024లో ఒక మృతదేహం నుంచి కన్ను అదృశ్యమైంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS