SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
25 మార్చి 2026, 11:47 IST
చదివే సమయం: 4 నిమిషాలు
ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం షేర్ మార్కెట్ నుంచి ముడి చమురు, బంగారం, వెండి, రూపాయి వరకు అన్నిటి విలువలు, ధరల్లో భారీ అస్థిరతకు కారణమవుతోంది.
గడచిన నెలరోజుల్లో సెన్సెక్స్ పడిపోయింది. ముడిచమురు ధరలు దాదాపు 60శాతం పెరిగాయి. డాలర్తో రూపాయి మారకం విలువ కనిష్ఠ స్థాయికి చేరుకుంది.
కొన్నిరోజుల క్రితం బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. మార్కెట్ భారీగా పతనమయింది.
‘సురక్షిత పెట్టుబడిగా’ భావించే బంగారం ధరలు ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన వెంటనే ఒక్కసారిగా పెరిగాయి. కానీ ఆ ధరలు ఇప్పుడు భారీగా పడిపోయాయి.
అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ సంక్షోభం నాలుగోవారంలో ప్రవేశించిన తర్వాత బంగారం, వెండి ధరల్లో భారీ పతనం నమోదయింది. 40 ఏళ్లలో ఒక వారంలో అతిపెద్ద పతనం ఇదే.

ఫొటో సోర్స్, Getty Images
ధరలు ఎందుకు పడుతున్నాయి?
యద్ధం ప్రారంభమైన తర్వాతి నుంచి బంగారం ధరలు 15శాతం కంటే ఎక్కువ తగ్గాయని రాయిటర్స్ నివేదిక తెలిపింది.
జనవరి 20న బంగారం ధర ఔన్స్కు 5,591డాలర్ల అత్యధిక స్థాయికి చేరింది. ఆ తర్వాత దాదాపు 20శాతం పడిపోయింది.
ఇండియన్ బులియన్ జ్యుయెలర్స్ అసోసియేషన్ వెబ్సైట్ ప్రకారం మార్చి 24న 10గ్రాముల బంగారం ధర రూ. లక్షా 39 వేలు ఉంది.
బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు పడిపోవడానికి అనేక కారణాలున్నాయి. తొలి కారణం యుద్ధ పరిస్థితుల్లో చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరగొచ్చనే భయం.
ఇలాంటి పరిస్థితిలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఎక్కువకాలం వడ్డీరేట్లను అధికంగా ఉంచొచ్చు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు బంగారంపై ఆకర్షణ తగ్గుతుంది.
సాధారణంగా యుద్ధాలు వంటివి వచ్చినప్పుడు బంగారం ధర పెరగాలి. ఎందుకంటే దాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా జరుగుతోంది. ఈ నెలలో బంగారం ధరలు 20శాతం పడిపోయాయి. వెండి ధలు 32శాతం కంటే ఎక్కువగా తగ్గాయి.
1983 తర్వాత బంగారం, వెండి ధరల్లో ఇది అతిపెద్ద పతనం. వెండి అత్యధిక స్థాయి నుంచి 40శాతం పడిపోయింది.
45ఏళ్లలో ఓ నెలలో బంగారం ఇంత స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి.
ఫొటో సోర్స్, Getty Images
ఈ అనిశ్చితి ఇంకా ఎంతకాలం?
”పతనం తర్వాత బంగారం, వెండి ధరలు కొంత కోలుకోవడం కనిపించింది. కానీ ఇప్పుడు ప్రతిదీ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఏ దిశగా వెళ్తాయన్నదానిపై ఆధారపడి ఉంది. హార్మూజ్ జలసంధి తెరవడంపై ఉన్న అనిశ్చితితో ద్రవ్యోల్బణం ముప్పు ఎక్కువగా ఉంది” అని బులియన్ ట్రేడింగ్ కంపెనీ ఆగ్మోంట్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ రేనిశా చైనాని అన్నారు.
”ఇటీవల బంగారం, వెండి అమ్మకాలు నగదు కోసం జరిగాయి. మార్జిన్ కాల్స్ను తీర్చేందుకు పెట్టుబడిదారులు లాభం ఇచ్చే ఆస్తులను అమ్ముతున్నారు. ఇది దీర్ఘకాలిక మార్పు కాదు. తాత్కాలిక విషయం మాత్రమే” అని చైనాని తెలిపారు.
బంగారం ధర అత్యధిక స్థాయి నుంచి 30శాతం కంటే ఎక్కువగా పడిపోయిందని ఇండియా బులియన్ అండ్ జ్యుయెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ కొఠారీ అన్నారు. చమురు ధరలు క్రమబద్ధమయ్యేవరకు, హార్మూజ్ జలసంధి సమస్య పరిష్కారమయ్యేవరకు బంగారం, వెండిపై ఒత్తిడి కొనసాగుతుందని తెలిపారు.
”బంగారం ధర పడినప్పుడు చైనా వంటి దేశాలు కొనుగోలు చేస్తాయి. గత శుక్రవారం, సోమవారం కూడా చైనా బంగారం కొనుగోలు చేసింది.
”ముడి చమురు ధరలు పెరగడం వల్ల వెండి ధర పడిపోయింది. యుద్ధం ముగిసిన తర్వాత మాత్రమే వెండి ధర మళ్లీ పెరగొచ్చు” అని పృథ్వీరాజ్ కోఠారీ అన్నారు.
బంగారం, వెండి ధరలు పడిపోవడానికి మరో కారణం లాభాల స్వీకరణ. ఈ రెండింటి ధరలు చాలా ఎక్కువ పెరిగి ఉండడంతో ఆ పెరుగుదలను నిలబెట్టుకోలేకపోయాయి.
బంగారం నుంచి స్థిరమైన ఆదాయం రాదు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గితే బంగారం ధర పెరగొచ్చు. కానీ వడ్డీరేట్లు పెరిగితే ఆకర్షణ తగ్గుతుంది. షేర్ మార్కెట్లో నష్టాలను భర్తీచేసుకోవడానికి కూడా ఇన్వెస్టర్లు బంగారం అమ్ముతున్నారు
2025వ సంవత్సరంలో వెండి ధర 170శాతం పెరిగింది. తర్వాత ఈ ఏడాది జనవరిలో వెండి ధర 74శాతం పెరిగింది.
మార్చిలో ఇప్పటి వరకు వెండి ధరలు 20శాతం తగ్గాయని మనీ కంట్రోల్ తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)



