SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, ANI
అప్డేట్ అయ్యింది ఒక గంట క్రితం
కశ్మీర్లో తీవ్రవాద దాడిని తీవ్రంగా పరిగణించిన భారత్ ప్రతి చర్యలు ప్రారంభించింది.
ప్రధాని మోదీ నేతృత్వంలో సుమారు రెండు గంటల పాటు జరిగిన భద్రతపై కేబినెట్ కమిటీ(సీసీఎస్) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆ వివరాలు వెల్లడించారు.
భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని తక్షణం తాత్కాలిక నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు నిలిపివేసేంతవరకు ఇది అమలవుతుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
పాకిస్తాన్ పౌరులను భారత్లోకి అనుమతించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో పాకిస్తానీయులకు జారీచేసిన ప్రత్యేక వీసాలు వెంటనే రద్దవుతాయి. ప్రత్యేక వీసా కింద భారత్లో ఉన్న పాకిస్తానీయులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలి.
దిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో ఉన్న రక్షణ, సైనిక, నేవీ, వైమానిక సలహాదారులు వారం రోజుల్లోనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అలాగే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఉన్న భారత హైకమిషన్ కార్యాలయంలో ఉన్న ఇదే హోదా గల భారత ఉద్యోగులను వెనక్కు పిలిపిస్తోంది.
పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న అటారీ చెక్పోస్ట్ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్ వైపు నుంచి సరైన పత్రాలతో వెళ్లినవారు కూడా ఈ ఏడాది మే 1 లోపు తిరిగి రావాలి.


ఫొటో సోర్స్, Getty Images
పహల్గాం దాడికి బదులు తప్పదు: రాజ్నాథ్ సింగ్
అంతకుముందు.. పహల్గాం దాడికి త్వరలో బదులు ఉంటుందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
”ఉగ్రవాదాన్ని భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదు” అని రాజ్నాథ్సింగ్ అన్నారు. కాల్పులను ”పిరికిపంద చర్య”గా అభివర్ణించారు.
ఈ దాడికి పాల్పడినవారిని, తెర వెనుక ఉన్నవారిని ఎవరినీ వదిలిపెట్టబోమని దేశానికి హామీ ఇస్తున్నామని రాజ్నాథ్ అన్నారు.
మరోవైపు పహల్గాం దాడిలో తమ దేశానికి ఎలాంటి ప్రమేయం లేదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు.
ఈ దాడిని భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వదేశీ తిరుగుబాటుగా వర్ణించిన ఆయన, దాడికి పాకిస్తాన్ను నిందించడం చాలా తేలికని అన్నారు.
అనుమానితుల ఊహాచిత్రాల విడుదల
పహల్గాం కాల్పుల అనుమానితుల చిత్రాలను భద్రత సంస్థలు విడుదల చేశాయి. కాల్పుల్లో ముగ్గురు పాల్గొన్నట్టు భద్రతాదళాలు అనుమానిస్తున్నాయని పీటీఐ తెలిపింది.
ఈ ముగ్గురిని అసిఫ్ ఫాజి, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించామని అధికారులు చెప్పారు.
అసిఫ్ పాజిని మూసాగా, సులేమాన్ షాను యూనస్గా, అబు తల్హాను అసిఫ్గా పిలుస్తారని అధికారులు తెలిపారు.
కాల్పులనుంచి తప్పించుకున్నవారు ఇచ్చిన సమాచారం ఆధారంగా అనుమానితుల స్కెచ్లను గీయించినట్లు అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
‘మహిళల జోలికి వెళ్లలేదు’
”గత 15 ఏళ్లగా ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని, దాడులు చేయడం కొత్త వ్యూహంలా ఉంది” అని గతంలో కశ్మీర్ ఉత్తర కమాండ్కు నేతృత్వం వహించిన రిటైర్డ్ జనరల్ డీఎస్ హూడా బీబీసీతో చెప్పారు.
తుపాకులతో అడవుల్లోనుంచి వచ్చిన నలుగురు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
కాల్పులు జరిగిన బైసరన్ ప్రాంతానికి కాలినడకన కానీ, గుర్రాలపై కానీ వెళ్లడానికి మాత్రమే అవకాశముంది.
పహల్గాంకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతానికి వాహనాల్లో వెళ్లలేం.
కాల్పుల్లో గాయపడ్డవారిని గుర్రాలపై తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు.
భద్రతబలగాలు సంఘటనాస్థలానికి వెళ్లేలోపే కాల్పుల్లో పాల్గొన్నవారంతా తప్పించుకుపోయారు.
పర్యాటకుల్లో పురుషులపైనే కాల్పులు జరిపారు. మహిళల జోలికి వెళ్లలేదు. కాల్పులకు పాల్పడ్డవారు ముస్లింలు కానివారిని లక్ష్యంగా చేసుకున్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అయితే దాడిలో స్థానిక ముస్లిం వ్యాపారి ఒకరు చనిపోయారు.
”మహిళల జోలికి వెళ్లలేదు. మగవారిపై బుల్లెట్లు కురిపించారు” అని ఓ మహిళ ఏఎఫ్ఫీ న్యూస్ ఏజెన్సీతో చెప్పారు.
ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తున్నవారు చాలా వీడియోల్లో కనిపించారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ తన భర్తను రక్షించాలని కోరుతూ ఓ మహిళ అడుగుతున్న వీడియోలో వెనక చాలా మృతదేహాలు కనిపిస్తున్నాయి.