Home జాతీయ national telgu ‘ది లాస్ట్ ఫోటోస్ ఆఫ్ హోమ్’: బరువెక్కిన గుండెతో తెహ్రాన్‌ను వీడుతున్నామంటూ ప్రజల భావోద్వేగ పోస్టులు

‘ది లాస్ట్ ఫోటోస్ ఆఫ్ హోమ్’: బరువెక్కిన గుండెతో తెహ్రాన్‌ను వీడుతున్నామంటూ ప్రజల భావోద్వేగ పోస్టులు

4
0

SOURCE :- BBC NEWS

తెహ్రాన్

ఫొటో సోర్స్, Social media

సోఫాలు ఖాళీగా ఉన్నాయి. కొన్నింటి ముందు సర్దిన సూట్ కేసులు ఉన్నాయి. మూసిన కర్టెన్ల ముందు పూలకుండీలు, అలంకరణ సామాగ్రి, దిండ్లు అందంగా అమర్చి ఉన్నాయి.

‘‘ది లాస్ట్ ఫోటో ఆఫ్ హోమ్” అనే భావోద్వేగమైన ట్రెండ్ పర్షియన్ మాట్లాడే సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతోంది. ప్రజలు తాళం వేసి తమ ఇంటిని,నగరాన్ని విడిచిపోతూ తీసిన చివరి ఫోటోలను షేర్ చేస్తున్నారు.

ఇరాన్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడులు కొనసాగిస్తుండటంతో, తమ ఇల్లు మిగులుతుందో లేదో తెలియని అనిశ్చితిలో రాజధాని తెహ్రాన్‌లోని అనేకమంది ట్రాఫిక్‌జామ్స్‌, పెట్రోల్ బంకు వద్ద క్యూలను దాటి నగరం విడిచిపోతున్నారు.

”నాకు ప్రియమైనవారికి చెందిన జ్ఞాపకాలను,అవసరమైన కొన్ని వస్తువులను ప్యాక్ చేసుకున్నాను. నా మొక్కలకు నీళ్లు పోసి రోడ్డు మీదకి వచ్చాను. ఇకపై తిరిగి వస్తానో, రానో తెలియని ఈ పరిస్థితిలో ఇంటిని విడిచి వెళ్లడం గుండెను బరువెక్కిస్తోంది” అని ఒకరు రాశారు.

”మా ఇంట్లో ఎప్పుడూ ఇంతటి బాధను అనుభవించలేదు. ఎప్పటికైనా తిరిగి వస్తామో రాలేమో తెలియదు” అని మరోకరు రాశారు.

ఒక సోషల్ మీడియా యూజర్… కంప్యూటర్, హెడ్‌ఫోన్స్ ఉన్న తన పని ప్రదేశపు ఫోటోను పోస్ట్ చేసి ఇలా రాశారు: “నేను నా సంపాదన కోసం ఎంతో కష్టపడ్డా. నిద్రలేని రాత్రులు, జుట్టు తెల్లబడిపోయేంతలా కష్టపడి సంపాదించిన వస్తువులకు వీడ్కోలు పలికాను. నేను తిరిగి వచ్చినప్పుడు అవి ఇక్కడే ఉంటాయనకుంటున్నాను.”

“యూనివర్శిటీలో చదువుకుని, ఇక్కడే పనిచేయానే కలలతో రాజధానికి వచ్చాను” అని కోటిమంది ప్రజలు నివసించే తెహ్రాన్‌కు ఎందుకు వచ్చింది మరొక యూజర్ రాశారు.

“నేను కష్టపడి ప్రేమతో నా ఇంట్లో ఒక్కో వస్తువూ అమర్చాను. అందమైన నాఈ ప్రదేశానికి ఏదో ఒకరోజు తిరిగి రావాలనే ఆశతో మౌనంగా వీడ్కోలు చెప్పాను.” ఆయన అన్నారు.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

ఇజ్రాయెల్ మొదట్లో అణు కేంద్రాలు, ఉన్నత స్థాయి వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంది. కానీ ఇప్పుడు నివాస ప్రాంతాలపై కూడా దాడులు చేస్తోంది.

ఇరాన్ విడిచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్‌ సోమవారం నాడు ఆదేశించకముందే.. చాలా ముంది ప్రజలు ఈ ప్రాంతం వదిలి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు.

ఉత్తర తెహ్రాన్‌లోని ఒక పెద్ద ప్రాంతాన్ని, నగరంలోని కొన్ని భాగాలను వెంటనే ఖాళీచేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం స్థానికులను హెచ్చరించింది.

ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపిన నాల్గవ రోజున ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 224 మంది మరణించారు. ఇజ్రాయెల్ నగరాలపై తెహ్రాన్ ప్రతీకార క్షిపణి దాడులు చేయగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇజ్రాయెల్ మొదట్లో ఇరాన్‌లోని అణు, సైనిక స్థావరాలు, ఉన్నత స్థాయి అధికారులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. కానీ ఆ తర్వాత నివాస ప్రాంతాలతో సహా రాజధానిపై అనేకసార్లు బాంబులు కురిపించింది. ఇది స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది.

ఇరాన్

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్ ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా బీబీసీ జర్నలిస్టులు ఆ దేశం లోపల నుంచి రిపోర్ట్ చేయలేకపోతున్నారు. కానీ కొంతమంది ఇరానియన్లు బీబీసీని సంప్రదించి తమ అనుభవాలను పంచుకున్నారు.

వృద్ధ తల్లిదండ్రులు, చిన్న పిల్లలు, వైద్య అవసరాల కోసం లేదంటే మరోదారిలేక.. అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నామని కొంతమంది నివాసితులు చెప్పారు.

“నేను గర్భవతిని, చిన్న పాప కూడా ఉంది.. ఇంతటి ట్రాఫిక్‌ నుంచి నేను ఎలా బయటపడాలి? అంతేకాకుండా నేను కష్టపడి సంపాదించిందంతా ఇక్కడే ఉంది… నేను ఎక్కడికెళ్లాలి?” అని ఒక మహిళ బీబీసీతో అన్నారు.

మరో మహిళ… తాను ఒంటరిగా ఉన్నానని, 800 కిలోమీటర్లు ప్రయాణించి షిరాజ్‌లోని తన కుటుంబం దగ్గరకు వెళ్లాలనుకుంటున్నానని చెప్పారు. “నాకు కారు ఉంది కానీ అందులో ప్రయాణించడానికి సరిపడా ఇంధనం లేదు. ఒకవేళ మధ్యలో ఏదైనా ఇబ్బంది తలెత్తి ఆగిపోతుందని భయం” అని ఆమె చెప్పారు.

తెహ్రాన్ నుంచి బయలుదేరిన స్నేహితులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారని ఆమె అన్నారు.

“సాధారణంగా 10-12 గంటలు పట్టే ప్రయాణానికి వారికి 20 గంటలు పట్టింది. బస్సు టిక్కెట్లు కూడా అందుబాటులో లేవు.” అని ఆమె చెప్పారు.

“నాకు 40 ఏళ్లు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. నేను ఎక్కడికీ వెళ్ళను, ఇక్కడే ఉంటాను” అని ఇంకో మహిళ బీబీసీకి తెలిపారు.

“నిజం చెప్పాలంటే, నేను ఎక్కడికో వెళ్ళి, తిరిగి వచ్చి, నాశనమైపోయిన నా జీవితం గురించి ఆలోచించేంత ఓపిక నాకు లేదు. నేను అలిసిపోయాను. ఇన్నేళ్లుగా కోవిడ్, ద్రవ్యోల్బణం ఇలా ప్రతిసారి ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఇప్పుడు ఉన్న స్థితికి రావడానికి చాలా కష్టపడ్డాను. ఇదంతా నాశమైపోతుంది అన్నప్పుడు.. ఏం జరిగినా సరే.. నేను, నా పిల్లలు మా ఇంట్లో ఉండడమే నాకిష్టం. ఎందుకంటే మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టే శక్తి నాకు లేదు.” అని ఆమె అన్నారు.

దేశం బయట నివసిస్తున్న లక్షలాది మంది ఇరానియన్లు కూడా ఈ దుస్థితికి బాధపడుతున్నారు. ఇంటర్‌నెట్ కనెక్షన్ కాసేపు ఉంటే మరికాసేపు ఉండడంలేదు. ఆ పరిస్థితుల్లో కూడా తమ ఆత్మీయులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు.

” ఉన్న ఊరిని వదిలి వలస వెళ్లిపోవాలంటే ఇంటిపై బెంగ పట్టుకుంటుందని మేం అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు యుద్ధం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఇంటికి దూరంగా ఉండడం వల్ల వచ్చే నిజమైన బాధేంటో తెలుస్తోంది” అని ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ రాశారు.

కొంతమంది ప్రవాస ఇరానీయన్లు తమ బంధువులను ఎంతగా బతిమాలినప్పటికీ, వారు ఆ ప్రాంతం వదిలి రావడానికి నిరాకరించారని చెప్పారు.

ఇలాంటి పోస్ట్‌లకు స్పందనగా…”కొంతమంది దగ్గర డబ్బు లేదు. మరికొందరికి ఎక్కడికీ వెళ్ళాలో తెలీదు. మమ్మల్ని వెళ్లిపొమ్మని చెప్పకండి.” అని రాజధాని నివాసి ఒకరు రాశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)