Home జాతీయ national telgu తెలంగాణ: ‘భూ భారతి’ ‘ధరణి’ సమస్యలను తీరుస్తుందా?

తెలంగాణ: ‘భూ భారతి’ ‘ధరణి’ సమస్యలను తీరుస్తుందా?

3
0

SOURCE :- BBC NEWS

తెలంగాణ భూ భారతి, ధరణి, కాంగ్రెస్ ప్రభుత్వం, భూ వివాదాలు

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణలో భూముల చుట్టూ ఎన్నో చిక్కుముళ్లు. ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రయత్నించే కొద్దీ, కొత్తవి పుట్టుకొస్తున్నాయి. గతంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడూ అదే జరుగుతోందని రెవెన్యూ నిపుణులు చెబుతున్నారు.

తెలంగాణలో గతంలో ఉన్న ధరణి చట్టాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం దాని స్థానంలో భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చింది.

ఈ ఏడాది ఏప్రిల్ 14 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చిందని ప్రకటించిన ప్రభుత్వం తొలుత దీన్ని 4 మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసింది. ఇప్పుడు రాష్ట్రమంతటా అమలు చేసే ప్రయత్నాల్లో ఉంది. ఈమేరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది.

ధరణి స్థానంలో భూభారతిని తీసుకువచ్చి సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదని రెవెన్యూ నిపుణులు చెబుతున్నారు.

అయితే, త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
తెలంగాణ భూ భారతి, ధరణి, కాంగ్రెస్ ప్రభుత్వం, భూ వివాదాలు

ఫొటో సోర్స్, Dharani

ధరణిలో 100కుపైగా సమస్యలు

రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్వోఆర్)-1971 చట్టాన్ని రద్దు చేసి, 2020 నవంబరు 2న కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకువచ్చింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. దీనిని ధరణి చట్టంగా పిలిచారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ధరణి చట్టాన్ని రద్దు చేసి, దానిస్థానంలో ఆర్వోఆర్-2025 చట్టాన్ని తీసుకువచ్చింది. దీన్ని భూభారతిగా పిలుస్తున్నారు.

ధరణిలో 33 మాడ్యూళ్లు ఉండగా, వాటి స్థానంలో భూభారతిలో 6 మాడ్యుళ్లు (దరఖాస్తు విధానాలు) తీసుకువచ్చారు. గతంలో ఒక మాడ్యుల్ బదులు మరో మాడ్యుల్ లో దరఖాస్తు చేసుకుంటే ప్రతిసారి రైతులు 1200 రూపాయలు కట్టాల్సి వచ్చేది. ఇప్పుడా అవసరంలేదని ప్రభుత్వం చెబుతోంది.

అయితే, తెలంగాణలో వివిధ రకాల భూములు ఉండటంతో ఈ 6 మాడ్యుళ్లు ఎంతవరకు సరిపోతాయనే సందేహాలు ఉన్నాయి.

ధరణి రాకమునుపు భూ యజమాని పేరు, ఖాతా నంబరు, సర్వే నంబరు, అనుభవదారు లేదా పట్టాదారు పేరు, భూమి స్వరూపం, విస్తీర్ణం.. ఇలా 32 కాలమ్స్ తో పహాణి నిర్వహించేవారు.

ఇప్పుడు 11 కాలమ్స్‌తో పహాణీ తీసుకువస్తున్నట్లుగా ప్రకటించింది ప్రభుత్వం.

ధరణి రాక ముందు 76 రకాల భూ సమస్యలు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. వాటికి పరిష్కారం లభిస్తుందని చెప్పింది. ధరణి వచ్చాక సమస్యలు తీరకపోగా, అదనంగా 45 రకాల సమస్యలు వచ్చినట్లుగా గుర్తించినట్లుగా న్యాయవాది సునీల్ కుమార్ చెప్పారు.

”ధరణి కింద దాదాపు 20 రకాల కొత్త సమస్యలు వచ్చాయని హైకోర్టు చెప్పింది. అవి కాకుండా మరో 25 సమస్యలు ఉన్నట్లుగా గుర్తించాం.” అని చెప్పారాయన.

తెలంగాణ భూ భారతి, ధరణి, కాంగ్రెస్ ప్రభుత్వం, భూ వివాదాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫీజులు వెనక్కి ఇవ్వని ప్రభుత్వం

ధరణి కింద భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, గిఫ్ట్ డీడ్, వారసత్వ బదిలీ, జీపీఏ వంటివి చేయాలనుకుంటే నిర్దేశిత ఫీజులు చెల్లించాల్సి ఉండేది.

ఏప్రిల్ 14న భూభారతి చట్టం వచ్చేవరకు ధరణి కింద దరఖాస్తులు తీసుకున్నారు. అయితే, ధరణి అమల్లో ఉన్నప్పుడు ఏదైనా అనుకోని కారణంతో స్లాట్ రద్దు చేసుకుంటే ఫీజు వెనక్కి ఇవ్వాలనే రూలు ఉండేది. కానీ, ఈ ఫీజులు వెనక్కి ఇవ్వడంలో గతంలో అంతులేని జాప్యం జరిగేది. ఇప్పుడు భూ భారతి వచ్చినా సరే, గతంలో చెల్లించిన ఫీజులు వెనక్కి ఇవ్వలేదు.

మరో సమస్య, సాదా బైనామాలది. తెలంగాణలో సాదా బైనామాల ద్వారా భూముల బదలాయింపు హక్కులు రాసుకున్నవి ఎక్కువ.ఇలా సాదా బైనామాల కింద 9.24లక్షల కింద దరఖాస్తులు వచ్చాయి. ఇవ్వన్నీ ధరణి ఉన్నప్పుడు నుంచే పెండింగులో ఉన్నాయి. వీటి పరిష్కారానికి ఇంకా ఆర్డీవోలకు అధికారాలు ఇవ్వకపోవడంతో, ఇంకెంతకాలం వేచి చూడాలనే ఆందోళన భూ యజమానుల్లో ఉంది.

సెక్షన్ 6 కింద సాదా బైనామాలను పరిష్కరించే అవకాశం భూ భారతిలో ఉంది.

”ఇప్పటికే ఉన్న సాదా బైనామాలకు పరిష్కారం చూపించాలి. కొత్తగా దరఖాస్తులు తీసుకోవడం లేదు. కొత్తగా దరఖాస్తులకు భూ భారతిలో అవకాశం లేకపోవడం ఇబ్బందిగా మారింది.” అని మాజీ జాయింట్ కలెక్టర్ సురేష్ పొద్దార్ బీబీసీతో చెప్పారు.

భూముల వివాదాలు పరిష్కరించే ఉద్దేశంతోనే భూ భారతి తీసుకువచ్చామన్నారు తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి.

‘హక్కులున్న భూములను కూడా ధరణిలో నిషేధిత జాబితాలో పెట్టారు. భూ భారతి వచ్చాక చట్టంలో అనేక మార్పులు చేసి హక్కుల భూముల విషయంలో స్పష్టత ఇచ్చే వెసులు బాటు కల్పించాం. తహసీల్దారు, ఆర్డీవో, కలెక్టర్ వరకు అనుమతులు ఇచ్చి పరిష్కరానికి మార్గం చూపించాం.” అని చెప్పారు కోదండరెడ్డి.

తెలంగాణ భూ భారతి, ధరణి, కాంగ్రెస్ ప్రభుత్వం, భూ వివాదాలు

ఫొటో సోర్స్, x.com/mkodandareddy

ధరణి రికార్డులు తాత్కాలికంగా కొనసాగింపు

గతంలో ధరణి ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్లు, బదిలీలు, గిఫ్ట్ డీడ్ సహా వివిధ మాడ్యుల్స్ కింద పెట్టుకున్న అర్జీలు అలాగే ఉండిపోయాయి.వీటిని పరిష్కరించకుండా అధికారులు కొత్తగా రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు తీసుకుంటున్నారు .

ఆయా దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందా.. లేదా వాటి స్థానంలో కొత్తగా దరఖాస్తు చేసుకోవాలా.. అనే విషయాన్ని ప్రభుత్వం ఎక్కడా స్పష్టం చేయలేదు.

భూ భారతి సెక్షన్ 4 ప్రకారం ధరణి రికార్డులు తాత్కాలికంగా కొనసాగుతాయని ఉంది.

భూముల రీ సర్వే చేసి కొత్త రికార్డులు తయారు చేయడం, ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్‌తో కార్డుల్లో తప్పులు సవరించడం, ఎవరైనా తప్పులు ఉన్నాయని గుర్తిస్తే దరఖాస్తు చేసుకోవడం, కొత్తగా రికార్డుల తయారీ.. ఈ నాలుగు ఆప్షన్ల ప్రకారం కొత్తగా రికార్డులు తయారు చేసే వరకు తాత్కాలికంగా ధరణి రికార్డు కొనసాగుతుందని భూ భారతి చట్టంలో చెప్పింది ప్రభుత్వం.

అయితే, ఇది ఎంతకాలంపాటు కొనసాగుతుందనేది స్పష్టత ఇవ్వలేదు.

”భూ భారతి పేరుతో కొత్త చట్టం తీసుకువచ్చామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ధరణి ప్రకారమే రికార్డులు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు” అని సురేష్ పొద్దార్ అన్నారు.

అయితే, కొద్ది రోజులపాటు వేచి చూస్తే భూభారతి చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని, అప్పుడు సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)