SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Bhumi Chauhan
- రచయిత, భార్గవ్ ప్రతీక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
-
13 జూన్ 2025
భూమి చౌహాన్. 30 ఏళ్ల ఈ మహిళ గురువారం తాను ఎక్కకాల్సిన విమానం తప్పిపోయినందుకు చాలా బాధపడ్డారు. ఆమె ప్రయాణించాల్సిన విమానం 242 మంది ప్రయాణికులతో లండన్కు బయల్దేరి, కూలిపోయిన ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్. ఈ విమానం అహ్మదాబాద్లో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది.
ఈ విమానాన్ని అందుకునేందుకు చౌహాన్ గుజరాత్లోని తన సొంతపట్టణం అంకాలేశ్వర్నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించారు.
”మేం అహ్మదాబాద్కు సకాలంలోనే చేరుకున్నాం. కానీ నగరంలో ట్రాఫిక్ కారణంగా విమానాశ్రయానికి ఐదునిమిషాలు ఆలస్యంగా చేరాను. దీంతో బోర్డింగ్కు నన్ను అనుమతించలేదు” అని చౌహాన్ బీబీసీకి చెప్పారు.
”ముందు నేను చాలా బాధపడ్డాను. నా టిక్కెట్ డబ్బులు పోయాయి, నా ఉద్యోగం కూడా పోతుంది అని బాధపడ్డా. కానీ డబ్బులు పోతే పోయాయి. ప్రాణాలు దక్కాయి అని ఇప్పుడనిపిస్తోంది” అని ఆమె అన్నారు.


ఫొటో సోర్స్, Bhumi Chauhan
‘ఆలస్యంగా వచ్చానని బోర్డింగ్కు అనుమతించలేదు’
భూమి మొదట యూకేలో చదువుకోవడానికి వెళ్లారు. తరువాత బ్రిస్టల్లో పనిచేసే బ్యాంకు ఉద్యోగితో రెండేళ్ల క్రితం ఆమెకు పెళ్లయింది.
”నేను యూకేలో చదువుకోవడానికి వెళ్లి పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాను. పెళ్లయిన రెండేళ్ల తరువాత నా స్వగ్రామం అంకాలేశ్వర్కు వచ్చాను. నెలన్నరగా ఇక్కడే ఉంటున్నాను. సెలవులు అయిపోయిన తరువాత తిరిగి బయల్దేరాను” అని ఆమె చెప్పారు.
ట్రాఫిక్లో చిక్కుకుపోయినప్పుడు ఫ్లైట్ స్టేటస్ను ఆన్లైన్లో గమనిస్తూనే ఉన్నానని భూమి చెప్పారు.
కానీ ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత ఆమెను బోర్డింగ్కు అనుమతించలేదు.
”నేను ఆలస్యంగా వచ్చానని ఎయిర్ ఇండియా సిబ్బంది చెప్పారు. బోర్డింగ్ పూర్తయిపోయిందని చెప్పడంతో విమానం ఎక్కలేకపోయాను” అని భూమి బీబీసీకి చెప్పారు.
”నేను ఎంతో బతిమాలాను. నా ఉద్యోగం, టిక్కెట్ డబ్బులు పోతాయని చెప్పాను. కానీ ఎవరూ పట్టించుకోలేదు. కనీసం టిక్కెట్ డబ్బులు అయినా తిరిగి ఇవ్వమని కోరాను. కానీ వారు తిరస్కరించారు. దీంతో చేసేదేమీ లేక వెనుదిరిగాను. దారి మధ్యలో టీ తాగుతున్నప్పుడు విమానం కూలిపోయిందని తెలిసింది” అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Bhumi Chauhan
‘ట్రాఫిక్కే కాపాడింది’
”టీ తాగడం కోసం ఆగాం. టిక్కెట్ డబ్బులు ఎలా వెనక్కి తెచ్చుకోవాలనే విషయంపై ట్రావెల్ ఏజెంట్తో మాట్లాడుతున్నాం. అప్పుడే మేం ఎక్కాల్సిన విమానం కూలిపోయిందని అంకాలేశ్వర్నుంచి ఫోన్ వచ్చింది. ప్రాణాలు దక్కాయని మేం వెంటనే గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకున్నాం.అహ్మదాబాద్ ట్రాఫిక్కే నా ప్రాణాలు కాపాడింది” అని భూమి వణుకుతున్న గొంతుతో చెప్పారు.

‘టేకాఫ్ అయిన 30 సెకన్ల తర్వాత ..’
లండన్ కు చెందిన బోయింగ్ 787-8 విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ వాసులు, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు, ఒక కెనడియన్ ఉన్నారు. ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు.
ప్రమాదానికి గల అధికారిక కారణాలు తెలియరాలేదు. మొత్తం మృతుల సంఖ్యను ధృవీకరించలేదు, కానీ 204 మృతదేహాలను వెలికితీశామని స్థానిక పోలీసు చీఫ్ బీబీసీతో చెప్పారు.
అయితే చనిపోయినవారందరూ విమానంలోని వారేనా, లేక విమానం కూలిపోయినప్పుడు దగ్గరలో ఉన్నవారు కూడా మృతుల్లో ఉన్నారా అనే విషయాన్ని ధ్రువీకరించలేదు.
ఈ ప్రమాదంలో ఓ బ్రిటీష్ జాతీయుడు ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు. విమానం టేకాఫ్ అయిన ముప్పై సెకన్ల తర్వాత పెద్ద శబ్దం రావడం, విమానం కూలిపోవడం, వెనువెంటనే జరిగిపోయిందని ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ కుమార్ రమేష్ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS