Home LATEST NEWS telugu తాజా వార్తలు ‘ట్రంప్ నమ్మదగ్గ వ్యక్తేనా?’ – యూరప్‌లో ఎదురైన ఈ ప్రశ్నకు జైశంకర్ ఏం చెప్పారు?

‘ట్రంప్ నమ్మదగ్గ వ్యక్తేనా?’ – యూరప్‌లో ఎదురైన ఈ ప్రశ్నకు జైశంకర్ ఏం చెప్పారు?

13
0

SOURCE :- BBC NEWS

జైశంకర్

ఫొటో సోర్స్, ANI

12 జూన్ 2025, 12:11 IST

సుంకాలు, వాణిజ్య ఒప్పందాలు, భారత్, పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణలు వంటి విషయాలపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలు భారత్‌కు అసౌకర్యంగా మారినట్టుగా భావిస్తున్నారు.

భారత్, పాకిస్తాన్ సైనిక ఘర్షణను నిలిపివేయడంలో అమెరికా పాత్ర ఉందనే ప్రకటనలపై ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. ఇది భారత విదేశాంగ విధాన వైఫల్యమంటూ విమర్శలు గుప్పించాయి.

ఈ విషయంపై యూరోపియన్ వార్తాపత్రిక ఒకటి, యూరప్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను ప్రశ్నించింది.

‘అమెరికాతో సంబంధాలు భారత్‌కు చాలా కీలకం. కానీ, ఇవి ప్రత్యేకంగా ఏ ఒక్క వ్యక్తికో సంబంధించినవి కావు.’ అని జైశంకర్ సమాధానమిచ్చారు.

భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య ఒప్పందాల గురించి చర్చించేందుకు జైశంకర్ యూరప్ వెళ్లారు. ఇరుపక్షాలూ ఒక ఒప్పందానికి వచ్చినట్టు చెబుతున్నారు.

భారత్-యూరోపియన్ యూనియన్ తొలి వ్యూహాత్మక చర్చల ముగింపును తెలియజేస్తూ జైశంకర్ మంగళవారం ఒక ట్వీట్ చేశారు.

”రక్షణ, సముద్ర భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం , సైబర్, ఏఐ, అంతరిక్ష రంగాల విషయంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి నిర్మాణాత్మక చర్చ జరిగింది. ఇండో-పసిఫిక్, యూరప్, పశ్చిమాసియాలలో పరిస్థితులపైనా మా అభిప్రాయాలను పంచుకున్నాం.” అని జైశంకర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి

X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ట్రంప్ విశ్వసనీయతపై జైశంకర్ ఏమన్నారు?

యురాక్టివ్ అనే వెబ్‌సైట్ జైశంకర్‌ను ఇంటర్వ్యూ చేసింది. ఈ వెబ్‌సైట్ యూరోపియన్ యూనియన్ విధానాలపై దృష్టి సారిస్తుంటుంది.

ఈ ఇంటర్వ్యూలో ”మీరు డోనల్డ్ ట్రంప్‌ను నమ్ముతారా?” అని జైశంకర్‌ను ప్రశ్నించారు.

” దానర్థం ఏమిటి?” అని జైశంకర్ అడిగారు.

”ట్రంప్ తాను చెప్పేమాటపై నిలబడతారా? భారత్ తన సంబంధాలను లోతుగా బలోపేతం చేసుకోవాలనుకునే భాగస్వామి ఆయనేనా?” అని జర్నలిస్టు ప్రశ్నించారు.

”మా ప్రయోజనాలకు అనుగుణంగా ప్రతి సంబంధాన్ని కొనసాగించడమే మా లక్ష్యం. అమెరికాతో సంబంధాలు మాకు చాలా ముఖ్యం. ఇది ‘ఎక్స్’ అనే వ్యక్తితోనో లేదా వై అనే అధ్యక్షుడితోనో ముడిపడి ఉండవు.” అన్నారు.

చెప్పాలంటే, ఈ ఏడాది జనవరిలో ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి, సుంకాల విషయంలో భారత్‌ను పదేపదే లక్ష్యంగా చేసుకున్నారు. భారత్‌ను పలుసార్లు ‘టారిఫ్ కింగ్’ గానూ వర్ణించారు.

అమెరికా నుంచి భారత వలసదారులను బహిష్కరించడం నుంచి అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన సమయంలో ట్రంప్ ప్రకటనల వరకు ప్రతిదీ వివాదాస్పదమైంది.

భారత్-పాకిస్తాన్ మధ్యలో ఇటీవల నెలకొన్న ఘర్షణ సమయంలో కాల్పుల విరమణ గురించి ట్రంప్ సోషల్ మీడియా ద్వారా ముందుగా ప్రకటించడంపై వివాదం చోటు చేసుకుంది.

రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు తానే కారణమనే ఘనతను కూడా ట్రంప్ తీసేసుకున్నారు.

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై ఏప్రిల్ 22న దాడి జరిగిన తర్వాత, పాకిస్తాన్ లోపల దాగి ఉన్నటెర్రరిస్టుల స్థావరాలపై భారత్ మే 6-7 తేదీల మధ్యరాత్రిన వైమానిక దాడులు చేసింది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

నాలుగు రోజుల తర్వాత మే 10న ‘రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.’ అని డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.

ఆ తర్వాత వెంటనే ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరుతో చేపట్టిన సైనిక చర్యను నిలిపివేస్తున్నట్లు భారత్ తెలిపింది.

అయితే, అమెరికా పాత్రపై మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు.

వాణిజ్యాన్ని నిలిపివేస్తానని హెచ్చరించిన తర్వాతే కాల్పుల విరమణకు రెండు దేశాలు ఒప్పుకున్నాయని ట్రంప్ చేసిన ప్రకటనను జైశంకర్ ధ్రువీకరించలేదు.

డచ్ మీడియా హౌస్‌కు చెందిన జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జైశంకర్, ”కాల్పుల విరమణ గురించి భారత్-పాకిస్తాన్ మధ్యలో నేరుగా చర్చలు జరిగాయి. ముందుగా కాల్పుల విరమణ పాకిస్తాన్ పాటించి, ఆ విషయాన్ని వారి జనరల్ మా జనరల్‌కు తెలియజేయాలని చెప్పాం. జరిగింది అదే. ఈ విషయాన్ని మేం అమెరికా సహా అందరికీ స్పష్టం చేేశాం’’ అని చెప్పారు.

జైశంకర్

ఫొటో సోర్స్, @DrSJaishankar

భారత్ సందేశం ప్రజలకు ఎందుకు చేరడం లేదు?

పహల్గాం దాడి తర్వాత జరిగిన పరిణామాలను రెండు అణ్వాయుధ దేశాల మధ్య జరిగిన దెబ్బకు దెబ్బ చర్యగా అంతర్జాతీయ మీడియా చూపించిందని, భారతదేశ సందేశం ప్రజలందరికీ ఎందుకు చేరడం లేదని జైశంకర్‌ని యురాక్టివ్ జర్నలిస్టు ప్రశ్నించారు.

”ఒకప్పుడు ఒసామా బిన్ లాడెన్ అనే వ్యక్తి ఉండేవారు. పశ్చిమ ప్రాంతానికి పక్కనే ఉన్న పాకిస్తాన్ సైనిక పట్టణంలో ఎన్నో ఏళ్ల పాటు ఆయన సురక్షితంగా నివసించారు. ఇది కేవలం భారత్, పాకిస్తాన్ మధ్య సమస్యగా ప్రపంచం చూడకూడదని నేను కోరుకుంటున్నా. ఇది టెర్రరిజానికి చెందిన విషయం. ఈ టెర్రరిజం తిరిగి వచ్చి, మిమ్మల్ని కూడా వెంటాడుతుంది.” అని అన్నారు.

బ్రస్సెల్స్‌ పర్యటనలో పాకిస్తాన్‌ను ‘టెర్రరిస్తాన్’గా వర్ణించారు భారత విదేశాంగ మంత్రి.

జైశంకర్

ఫొటో సోర్స్, Getty Images

‘టెర్రరిస్తాన్‌’

బ్రస్సెల్స్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ” ఇది రెండు దేశాల మధ్య ఘర్షణ కాదు. కానీ, ఉగ్రవాద కార్యకలాపాలు, ముప్పుకు స్పందన. దీన్ని భారత్-పాకిస్తాన్‌‌ల సమస్యగా భావించవద్దు. భారత్‌, టెర్రరిస్తాన్‌ ఘర్షణగా చూడాలని అభ్యర్థిస్తున్నా.” అని చెప్పారు.

భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ తర్వాత ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చాయి. కానీ, సింధు జలాల ఒప్పందాన్ని వెనక్కి తీసుకున్న విషయంలో మాత్రం భారత్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ట్రంప్ భారత్‌కు సమస్యలు సృష్టిస్తున్నారా?

డోనల్డ్ ట్రంప్ రెండోసారి వైట్‌హౌస్ పగ్గాలు చేపట్టిన తర్వాత, భారత్‌కు సమస్యలు సృష్టించేలా పలు ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.

ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే, రెసిప్రొకల్ టారిఫ్ (పరస్పర సుంకాలు)ను ఎత్తిచూపుతూ భారత్‌పై దాడికి దిగారు. భారత్‌లోని అత్యధిక సుంకాలు అన్యాయమని అన్నారు.

జనవరిలో ట్రంప్‌తో భారత ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడినప్పుడు, అమెరికా రక్షణ పరికరాలను భారత్ ఎక్కువగా కొనాలని ట్రంప్ డిమాండ్ చేశారు.

న్యాయమైన విధానంలోనే అమెరికా, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం జరగాలని అన్నారు.

ప్రధాని మోదీ అమెరికా వెళ్లాలని నిర్ణయించుకోవడానికి ముందు, ఫిబ్రవరి తొలి వారంలో అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని చెబుతున్న కొంతమంది వలసదారులను అమెరికా సైనిక విమానంలో భారత్‌కు పంపారు. ఇలా పంపే సమయంలో వారి చేతులకు సంకెళ్లు వేశారు.

అమెరికా, చైనా మధ్యలో వాణిజ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత, చైనాలో పనిచేస్తున్న పశ్చిమ దేశాల కంపెనీలు అక్కడి నుంచి తరలివచ్చి తమ దగ్గర ఉత్పత్తి ప్రారంభిస్తాయని భారత్ భావించింది.

కానీ ఏప్రిల్ 2న అన్ని దేశాలపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్, భారత్‌పై 26 శాతం టారిఫ్ వేస్తున్నట్లు తెలిపారు.

యాపిల్ తన ఐఫోన్లను భారత్‌లో తయారు చేయాలనుకుంటే, చేసుకోవచ్చని.. కానీ ఈ టెక్ కంపెనీ సుంకాలు లేకుండా అమెరికాలో తన ఉత్పత్తులను అమ్మడానికి వీలు లేదని ట్రంప్ హెచ్చరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS