SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
చేపల కూర నాన్వెజ్ ప్రియులకు నోరూరించే డిష్.. సముద్రపు చేపలు, మంచినీటి చేపలు.. ఇలా ఎన్నో రకాలు అందుబాటులో ఉంటాయి.
మటన్, చికెన్ కంటే చేపల్లో కొవ్వు తక్కువ ఉంటుందన్న వాదనలతో ఈ మధ్యకాలంలో చేపలను చాలామంది ఇష్టంగా తింటున్నారు.
అయితే చేపలతో వచ్చిన సమస్య అందులోని ముళ్లు.
తినాలని ఎంత ఇష్టం ఉన్నా ముళ్లు ఉంటాయన్న భయంతో కొందరు చేపల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటారు.
చేప ముక్కలో చిన్నపాటి ముల్లు తినే టైంలో గొంతులో నుంచి కడుపులోకి వెళ్తే పెద్ద ప్రమాదమేమీ ఉండదు. కానీ, అదే చిన్న ముల్లు గొంతులో ఇరుక్కున్నా.. లేదంటే పెద్దసైజు ముల్లు కడుపులోకి వెళ్లి ఎక్కడో పేగుకు గుచ్చుకున్నా ఇబ్బందే.


ఫొటో సోర్స్, Getty Images
చికిత్స ఉంటుందా?
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన 54 ఏళ్ల జంపా మంగమ్మ ఇటీవల చేపల కూరతో భోజనం చేయగా, ఆమెకు అన్నవాహిక నుంచి చేప ముల్లు లోపలికి వెళ్లి గుండెకు సమీపంలో చేరింది.
ఆమె తీవ్ర ఇబ్బంది పడుతూ కాకినాడ అపోలో ఆస్ప్రతికి వెళ్లగా, అక్కడి వైద్యులు వివిధ పరీక్షలు నిర్వహించి, చేప ముల్లు గుండె దగ్గర చొచ్చుకుని ఉండటం గమనించారు.
అయితే దీనికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకుండా, ఛాతీ ఎముకలకు నష్టం కలిగించకుండా శస్త్ర చికిత్స చేశారు.
తొడల దగ్గర నుంచి గొట్టం ద్వారా ట్రేవర్ ప్రొసీడర్ అనే విధానంలో చికిత్స చేసి పేషెంట్ గుండె వద్ద ఇరుక్కున్న చేప ముల్లును తొలగించామని ఆపరేషన్ చేసిన వైద్యులు శివరామకృష్ణ, నాగేశ్వరరావు, వంశీ చైతన్య మీడియాకి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
మెదక్లోనూ ఇలాంటి ఘటనే..
ఆ మధ్యన మెదక్ జిల్లా టేక్మాల్కు చెందిన సాయిలు అనే యువకుడు కూడా చేపల కూరతో భోజనం చేసే క్రమంలో ముల్లు మింగేశాడు. ముల్లు కూడా జీర్ణమవుతుందని భావించినా.. అలా జరగలేదు.
చాలారోజులు ఆ ముల్లు అతన్ని ఇబ్బంది పెట్టింది. దాంతో మెదక్లోని ఓ నర్సింగ్హోం డాక్టర్ ఆపరేషన్ చేసి సాయిలు కడుపులో చిక్కుకుపోయిన ఆ చేప ముల్లును తొలగించారు.
ఇలా చాలామంది చేపల ముల్లు పొరపాటున గొంతులోనో, కడుపులోనో గుచ్చుకుని ఇబ్బంది పడిన ఘటనలు వింటుంటాం.
ఈ నేపథ్యంలో చేపల ముల్లు గొంతులో గుచ్చుకోకుండా ఏం చేయాలి. ఎలా తినాలి?
పొరపాటున గుచ్చుకుంటే ఏం చేయాలనేది విజయవాడలోని ప్రభుత్వాసుపత్రి సర్జన్, ఇంచార్జ్ ప్రొఫెసర్ డాక్టర్ కల్యాణి బీబీసీతో మాట్లాడారు.
”చేపలు తినేటపుడు జాగ్రత్తగా ముల్లు తీసేసి తినడం మంచిది. డాక్టర్లుగా మేం అదే సూచిస్తాం. చేప ముల్లు గొంతు వద్ద గుచ్చుకుంటే ఎండోస్కోపీ చేసి తీస్తారు. గొంతు నుంచి కిందకి వెళ్తే, ఎక్స్రే తీసి ఎక్కడుందో చూసి సర్జరీ చేసి తొలగిస్తారు. విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో ఇలాంటి కేసులు ఇటీవలి కాలంలో రాలేదు” అని డాక్టర్ కల్యాణి అన్నారు.
”చేప ముల్లు అన్నవాహిక నుంచి చొచ్చుకుని బయటకు వస్తే చాలా ప్రమాదం. ఛాతీ మొత్తం ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదముంది. దీన్ని మీడియాస్టినైటిస్ అంటారు. ఇలాంటి పరిస్థితి రాకుండా చేపల కూరతో భోజనం చేసే ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది” అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ముల్లు శరీరంలో కరగదా?
”చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే భయపడాల్సిన పని లేదు, వాటిని సులభంగానే బయటకు తీసేయవచ్చు. అలాగే అన్నవాహికలోకి వెళ్లినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే అన్నాశయంలో ఉండే ఆమ్లాలు చేపల ముల్లును సులభంగా కరిగించేస్తాయి. అన్నవాహిక నుంచి బయటకు వస్తేనే ఇబ్బంది” అని విజయవాడ నర్సింగ్హోం, పోలిక్లినిక్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ ఎంఆర్ఎస్ హరిహరన్ బీబీసీతో చెప్పారు.
”ఇంటర్మీడియేట్ చదువుతున్న యువతికి గొంతులో చేప ముల్లు గుచ్చుకుంటే మా క్లినిక్లో ఎండోస్కోపీ ద్వారా తీసేశాం” అని ఆయన అన్నారు.
‘ఇన్ఫెక్షన్కు దారితీయొచ్చు’
డాక్టర్ హరిహరన్ కొన్ని సూచనలు చేశారు.. ‘చేపల ముల్లు గొంతులో చిక్కుకుంటే పొట్ట మీద గట్టిగా ఒత్తాలి. దీంతో గాలితో పాటు ముల్లు కూడా బయటకు వస్తుంది.
ఒక్కోసారి సోడా తాగితే కాస్త ప్రయోజనం ఉంటుంది. సోడాలో ఉండే వాయువు గొంతులో ఒత్తిడి తెస్తుంది, ఫలితంగా ముల్లు బయటకు వస్తుంది’ అన్నారు.
ఈ ఇంటి చిట్కాల వల్ల ప్రయోజనం లేకుంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.
”ఒక్కోసారి చేప ముల్లు ఇన్ఫెక్షన్కూ దారి తీయొచ్చు. బాక్టీరియల్ స్కిన్ ఇన్ఫెక్షన్ లేదా ఆస్టియోమైలిటిస్ (ఎముక ఇన్ఫెక్షన్) లేదా సెప్టిసిమియా (రక్త ఇన్ఫెక్షన్) వంటి సమస్యలు రావొచ్చు. అయితే ఇవి అరుదైన సందర్భాల్లో మాత్రమే వస్తాయి” అని డాక్టర్ హరిహరన్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)