Home LATEST NEWS telugu తాజా వార్తలు కర్నూలు సమీపంలో లేజర్ ఆయుధంతో విమానాన్ని, డ్రోన్లను పేల్చేసిన డీఆర్‌డీవో.. అమెరికా, రష్యా, చైనా సరసన...

కర్నూలు సమీపంలో లేజర్ ఆయుధంతో విమానాన్ని, డ్రోన్లను పేల్చేసిన డీఆర్‌డీవో.. అమెరికా, రష్యా, చైనా సరసన భారత్

3
0

SOURCE :- BBC NEWS

కర్నూలు, ఆంధ్రప్రదేశ్, డీఆర్‌డీవో, లేజర్ వెపన్స్

ఫొటో సోర్స్, x.com/DRDO_India

లేజర్ టెక్నాలజీతో అనుమానిత డ్రోన్లు, శత్రు క్షిపణులను ధ్వంసం చేసే వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినట్లు భారత్ ప్రకటించింది.

కర్నూలు సమీపంలో నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్‌లో ఈ ప్రయోగాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) ఏప్రిల్ 13న నిర్వహించింది.

భవిష్యత్ ”స్టార్ వార్స్ టెక్నాలజీ”గా పిలుస్తున్న లేజర్ టెక్నాలజీ వెపన్స్‌ను తయారు చేసుకున్న అతి కొద్ది దేశాలలో భారత్ ఒకటిగా నిలిచింది.

”హైపవర్ టెక్నాలజీ వినియోగంలో ఇది ఆరంభం మాత్రమే” అని ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత డీఆర్డీవో చైర్మన్ సమీర్ వి.కామత్ ప్రకటించారు.

దీనిపై డీఆర్డీవో మాజీ ఛైర్మన్ జి.సతీశ్ రెడ్డి బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘భారత్ చేసిన ఈ ప్రయోగం రక్షణ రంగపరంగా ఎంతో కీలకమైంది’’ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు
డీఆర్‌డీవో, క్షిపణి, డ్రోన్లను కూల్చే ఆయుధం

ఫొటో సోర్స్, x.com/DRDO_India/status

ఏమిటీ సాంకేతికత..?

సాంకేతికత పెరుగుతున్న కొద్దీ యుద్ధరీతులు మారుతున్నాయి. మిసైల్స్ వినియోగానికి బదులుగా డ్రోన్ సాంకేతికతతో యుద్ధాలు జరుగుతున్నాయి.

యుక్రెయిన్-రష్యా యుద్ధంలో ఇప్పటికే డ్రోన్ దాడులు పెద్దసంఖ్యలో జరిగినట్లుగా స్పష్టమవుతోంది.

భవిష్యత్తులో యుద్ధాల సమయంలో డ్రోన్ దాడులను అడ్డుకునేందుకు అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చుకోవడం ప్రతి దేశానికి అవసరంగా మారింది.

ఇందుకు హైపవర్ లేజర్, హైపర్ మైక్రోవేవ్ వంటి సాంకేతికతలను ఉపయోగించి ఆయుధాలు సమకూర్చుకోవడంపై ప్రయోగాలు చేస్తున్నాయి.

ఈ క్రమంలో లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ (డీఈడబ్య్లూ)ఎంకే -II(ఎ)ను డెవలప్ చేసింది డీఆర్డీవో.

ప్రస్తుత తరుణంలో డ్రోన్ దాడులను సమర్థంగా ఎదుర్కోవాలంటే, యాంటీ డ్రోన్ వ్యవస్థలు సిద్ధం చేసుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పారు సతీశ్ రెడ్డి.

డీఆర్డీవో ప్రయోగించిన లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ ఎంతో శక్తిమంతమైనదని అన్నారు.

భూమిపై నుంచి పనిచేసే లేజర్ డైరెక్టర్ ఎనర్జీ వెపన్‌ను డీఆర్డీవోలోని సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (చెస్) ఆధ్వర్యంలో పరీక్షించారు.

ఇందులో లేజర్ కిరణాలతో మానవ రహిత విమానాన్ని (యూఏవీ) కాల్చి వేసి… కూల్చివేసినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్‌’ లో విడుదల చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి

X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

డీఆర్‌డీవో, లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్

ఫొటో సోర్స్, x.com/DRDO_India/status

భారత్‌కు ఉన్న స్టార్ వార్స్ సామర్థ్యాలలో ఇదొకటని డీఆర్డీవో చైర్మన్ సమీర్ వి.కామత్ ప్రకటించారు.

హైపవర్ లేజర్ డీఈడబ్ల్యూ సాంకేతికత కలిగిన దేశాల్లో భారత్ నాలుగు లేదా ఐదో స్థానంలో ఉంటుందని సమీర్ వి.కామత్ ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.

”అమెరికా, రష్యా, చైనాల దగ్గర ఈ టెక్నాలజీ ఉంది. ఇజ్రాయెల్ కూడా అభివృద్ధి చేసుకుంటోంది” అని చెప్పారాయన.

తేలికపాటి మానవ రహిత విమానాలనే కాకుండా డ్రోన్లు, హెలికాప్టర్లను కూడా పూర్తిగా డీఈడబ్ల్యూ సాయంతో కూల్చివేయవచ్చని డీఆర్డీవో ప్రకటించింది.

డీఆర్‌డీవో, లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్

ఫొటో సోర్స్, x.com/DRDO_India

2019 నుంచి ‘లేజర్’ ప్రయోగాలు

ఈ తరహా లేజర్ వెపన్ టెక్నాలజీని 2019లోనే అభివృద్ధి చేసింది డీఆర్డీవో.

అయితే, అప్పట్లో రెండు కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించేందుకు వినియోగించగా.. ప్రస్తుతం 30 కిలోవాట్ సామర్థ్యంతో కూడిన లేజర్ ఆయుధంతో 4-5 కిలోమీటర్ల రేంజ్ లక్ష్యాలను ఛేదించే వీలుంటుంది.

”ఈ లేజర్ సాంకేతికత డ్రోన్లను స్ట్రక్చురల్‌గా నాశనం చేయడంతో పాటు వాటిల్లోని సర్వైలెన్స్ సెన్సర్లను పనిచేయకుండా చేయగలదు.” అని డీఆర్డీవో ప్రకటించింది.

మానవ రహిత విమానాలు, డ్రోన్లు నిర్దేశిత రేంజ్‌లోకి వచ్చాకే లేజర్ టెక్నాలజీ వెపన్స్ పనిచేస్తాయని డీఆర్డీవో ఆర్ అండ్ డీ మాజీ చీఫ్ కంట్రోలర్, నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ చాన్స్‌లర్ డాక్టర్ డబ్ల్యూ.సెల్వమూర్తి బీబీసీతో చెప్పారు.

”డ్రోన్లు లేదా మానవ రహిత విమానాలు లక్ష్యాల వద్దకు వస్తున్న క్రమంలో భూమికి దగ్గర్లోకి రావాలి. అలా నిర్దేశిత రేంజ్‌లోకి వచ్చాక లేజర్ టెక్నాలజీ వాడి వాటిని కాల్చివేయవచ్చు.” అని చెప్పారాయన.

దూరంగా ఉంటే లేజర్ కిరణాల ప్రభావం తక్కువగా ఉంటుందని వివరించారు.

ప్రస్తుతం లేజర్ కిరణాలను చల్లబరిచే సాంకేతికతపై డీఆర్డీవోతో కలిసి అమిటీ యూనివర్సిటీ పనిచేస్తోంది.

యాంటీ డ్రోన్ సిస్టమ్ అభివృద్ధి చేసిన దేశాల్లో భారత్ కూడా ఒకటిగా నిలిచిందని జి.సతీశ్ రెడ్డి చెప్పారు.

”దేశ రక్షణ వ్యవస్థకు లేజర్ టెక్నాలజీ వెపన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగంతో లేజర్ టెక్నాలజీ వెపన్ సామర్థ్యం మరింత పెరిగింది” అని చెప్పారు.

డీఆర్‌డీవో, లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్

ఫొటో సోర్స్, DRDO

హైపవర్ లేజర్ వెపన్స్ తయారీపై దృష్టి

ప్రస్తుతం డీఆర్డీవో మరింత ‘హై పవర్’ లేజర్ వెపన్స్ తయారీపై కృషి చేస్తోంది. 20 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే 300 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన లేజర్ వెపన్స్ తయారు చేస్తోంది.

ఇదొక నిరంతర ప్రక్రియగా ఆయన అభివర్ణించారు.

మరోవైపు, క్షిపణులతో పోల్చితే లేజర్ బేస్డ్ సొల్యూషన్స్‌కు ఖర్చు తక్కువ అవుతుందని చెప్పారు సెల్వమూర్తి.

”క్షిపణుల తయారీ ఖరీదైన వ్యవహారం. లేజర్ కిరణాల వ్యవస్థ తక్కువ ఖర్చులోనే అయిపోతుంది.” అని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS