SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు కనిపిస్తున్నాయి. దేశంలో 2,710 యాక్టివ్ కేసులు నమోదైనట్లు శనివారం ఆరోగ్యశాఖాధికారులు వెల్లడించారు.
దేశంలో అత్యధిక యాక్టివ్ కేసులు కేరళ (1,147), ఆ తరువాత స్థానాల్లో మహారాష్ట్ర, దిల్లీ ఉన్నట్లు తెలిపారు.
మహారాష్ట్ర ప్రజారోగ్య శాఖ ప్రకారం, రాష్ట్రంలో ప్రస్తుతం 425 యాక్టివ్ కరోనా కేసులు ఉండగా, మే 19 నుంచి కరోనా కారణంగా 9 మంది చనిపోయారు.
కరోనాతో గతంలో లక్షల సంఖ్యలో ప్రజలు మరణించారు. కరోనా ముప్పు నుంచి తప్పించుకోవడానికి దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పెద్ద సంఖ్యలో ప్రజలు టీకా తీసుకున్నారు.
గతంలో అంటే, 2022 వరకు మనం తీసుకున్న టీకాలు ఇప్పుడు వ్యాపిస్తున్న కరోనా కొత్త వేరియంట్పై ప్రభావవంతంగా పనిచేస్తాయా?
కొత్త వేరియంట్ కారణంగా కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందా? ఇలాంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.
అసలు కరోనా కొత్త వేరియంట్ ఏంటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం.


ఫొటో సోర్స్, Getty Images
కరోనా కొత్త JN.1 వేరియంట్ ఏమిటి?
ప్రస్తుతం సింగపూర్, హాంకాంగ్లలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. వీటిలో చాలా వరకు కరోనా జేఎన్.1 వేరియంట్ కేసులని పరీక్షల్లో తేలినట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.
జేఎన్.1 వేరియంట్ కొత్తది కాదు. ఇది గతంలో వ్యాపించిన ఒమిక్రాన్కు సబ్ వేరియంట్.
జేఎన్.1 వేరియంట్ గురించి తెలుసుకోవడానికి ప్రొఫెసర్ సంజయ్ రాయ్ని బీబీసీ ప్రతినిధి చందన్ జజ్వాడే కలిసి మాట్లాడారు. సంజయ్రాయ్ కోవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీ మూడు దశల్లో పాల్గొన్న ప్రధాన పరిశోధకుడు. ఆయన దిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్గా ఉన్నారు.
”జేఎన్.1 వేరియంట్ను గుర్తించి ఏడాది గడిచింది. ఇది కొత్త వైరస్ కాదు. ఇది తీవ్రమవుతుందా? లేదా? అనే విషయంపై మా దగ్గర పూర్తి సమాచారం ఉంది. జేఎన్.1 వేరియంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు చూసిన దాని ప్రకారం ఇది మామూలు జలుబు తరహాలో తేలికపాటిది. అంతకంటే కంటే కూడా బలహీనమైనదిగా చెప్పొచ్చు” అని బీబీసీకి సంజయ్ రాయ్ వివరించారు.
ఈ కొత్త వేరియంట్ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై మేం నిపుణులను సంప్రదించాం.
“ఒమిక్రాన్ కంటే జేఎన్.1 తేలికపాటిది. అయితే, ఈ వేరియంట్ త్వరగా వ్యాపిస్తుంది. ఒక వ్యక్తికి ఈ ఇన్ఫెక్షన్ సోకితే అతని నుంచి చాలా త్వరగా ఇతరులకు వ్యాపిస్తుంది. కానీ, భయపడాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇప్పటికే ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వారు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. కరోనా లక్షణాలు కనిపించిన వారు ఇతరులకు దూరంగా ఉండాలి” అని బీబీసీతో నాగ్పూర్ ప్రభుత్వ వైద్య కళాశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అవినాష్ గవాండే చెప్పారు. కరోనా సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్లో అవినాష్ సభ్యుడు.

ఫొటో సోర్స్, Getty Images
మునుపటి టీకా ప్రభావవంతంగా ఉంటుందా?
రెండేళ్ల క్రితం కరోనా ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆ సమయంలో కరోనా నుంచి రక్షణ కోసం ప్రజలకు కోవాగ్జిన్, కోవిషీల్డ్ అనే రెండు రకాల టీకాలు విస్తృతంగా ఇచ్చారు. కొంతమంది స్పుత్నిక్ టీకాను కూడా తీసుకున్నారు.
మరి రెండేళ్ల కిందట తీసుకున్న టీకా, ప్రస్తుత వేరియంట్కూ పనిచేస్తుందా?
రెండు డోసుల వ్యాక్సిన్తో పాటు బూస్టర్ డోస్ తీసుకున్న వారికి కచ్చితంగా కొంత ప్రయోజనం ఉంటుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహారాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ అవినాష్ భోండ్వే అన్నారు.
”టీకా వేయించుకున్నంత మాత్రానా కరోనా రాదు అని చెప్పలేం. కానీ, కరోనా సోకితే లక్షణాలు తేలికపాటివిగా ఉంటాయి. టీకా రెండు డోసులతో పాటు బూస్టర్ డోస్ తీసుకున్న వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి చాలా కాలం పాటు ఉంటుంది. కేవలం ఒకే డోసు, లేదా రెండు డోసుల టీకా తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తి తగ్గవచ్చు. కరోనా టీకాలతో కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది” అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
గతంలో ఇచ్చిన టీకాలు, ప్రస్తుత వేరియంట్పై పనిచేయవని డాక్టర్ అవినాష్ గవాండే భావిస్తున్నారు.
”ఏటా కరోనా టీకాలు వేయించుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం ప్రతి ఏడాది కొత్త టీకాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఇవే టీకాలు కొత్త వేరియంట్లపై పనిచేయవు.ఏడాది క్రితం ఇచ్చిన ఇన్ఫ్లూయెంజా టీకా, మరుసటి ఏడాదికి ఎలాగైతే పనికి రాదో కరోనా టీకాలు కూడా అంతే. కానీ, కొంతమందికి గతంలో తీసుకున్న టీకా ద్వారా కొంత రోగనిరోధక శక్తి ఉంటే అది ఈ వేరియంట్కు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది” అని ఆయన వివరించారు.
అయితే, పరిశోధనా ఖర్చు ఎక్కువగా ఉండటం కారణంగా కొత్త వ్యాక్సిన్ను రూపొందించడం సాధ్యం కాదని అవినాష్ భోండ్వే అంటున్నారు.
”ఇన్ఫ్లూయెంజా వైరస్ పూర్తిగా పరివర్తన చెందుతుంది. కాబట్టి దానికి ఏటా కొత్త టీకా విడుదల చేస్తారు. కరోనాలో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఇన్ఫ్లూయెంజాలో ఇలా జరుగదు. అందుకే, కరోనాకు గతంలో ఇచ్చిన టీకాలు కొంత ప్రయోజనం చేకూరుస్తాయి” అని ఆయన అంటున్నారు.
అయితే, మరింత శక్తిమంతమైన కరోనా వేరియంట్ పుట్టుకొస్తే ఈ రోగనిరోధక శక్తి కొనసాగుతుందా లేదా అనే సందేహాలను ఆయన లేవనెత్తారు.

ఫొటో సోర్స్, Getty Images
కరోనా కొత్త వేవ్ వస్తుందా?
ఈ కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కరోనా కొత్త వేవ్ వస్తుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఈసారి కొత్త వేవ్ వచ్చే అవకాశం తక్కువగా ఉందని డాక్టర్ అవినాష్ గవాండే అభిప్రాయపడ్డారు. దీని వెనుక మూడు కారణాలు ఉన్నాయని ఆయన అన్నారు.
”మొదటిది, మన దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు టీకాలు తీసుకున్నారు. అందువల్ల, కనీసం కొంతమందికైనా కొత్త వేరియంట్తో పోరాడేందుకు కొంత రోగనిరోధక శక్తి ఉంటుంది.
రెండోది, ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, దీని తీవ్రత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువ మందికి సోకినా త్వరగానే నయం అవుతుంది.
మూడోది, ఒక వ్యక్తి ఈ వేరియంట్ బారిన పడినప్పటికీ, తీవ్రత తక్కువగా ఉన్నందున వారికి కరోనా వచ్చినట్లు కూడా తెలియకపోవచ్చు” అని ఆయన వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS