Home LATEST NEWS telugu తాజా వార్తలు కడబంతి వరకు కన్నీళ్లను అదుపు చేసుకున్న కోహ్లీ, ఆర్‌సీ‌బీతో అంత అనుబంధం ఎందుకంటే…

కడబంతి వరకు కన్నీళ్లను అదుపు చేసుకున్న కోహ్లీ, ఆర్‌సీ‌బీతో అంత అనుబంధం ఎందుకంటే…

9
0

SOURCE :- BBC NEWS

విరాట్ కోహ్లీ, ఆర్‌సీబీ, ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

నిరీక్షణ… 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ…చాంపియన్ అయ్యేందుకు నంబర్ వన్ ఆటగాడు నిరీక్షించిన సమయం ఇది.

2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైనప్పుడు మొదలైన ఈ ఎదురుచూపు, 2025 జూన్ 3తో ముగిసింది.

2025 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ శశాంక్ సింగ్ చివరి ఓవర్ రెండో బాల్‌కు బౌండరీ మిస్సయిన తర్వాత, ఆర్‌సీబీ విజయం దాదాపు ఖాయమనిపించింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ తడిసిన కళ్లు ఇప్పటిదాకా అసంపూర్ణంగా ఉన్న కల నెరవేరుతున్న కథను చెప్పడం మొదలయింది.

అక్కడినుంచి ఒక్కో బంతీ అయిపోయేకొద్దీ ఆర్‌సీబీ విజయం ఖాయమవుతూ వచ్చింది. విరాట్ కోహ్లీ భావోద్వేగం తీవ్రస్థాయికి చేరింది.

తడిచిన కళ్లను కొన్నిసార్లు అతను కనపడకుండా ఉంచేందుకు ప్రయత్నించాడు. కొన్నిసార్లు అతను తల పైకెత్తి ఆకాశం వంక చూశాడు. పంజాబ్ కింగ్స్‌ను ఆరు పరుగుల తేడాతో ఆర్‌సీబీ ఓడించిన వెంటనే విరాట్ కోహ్లీ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

మైదానంలో మోకాళ్లపై కూర్చున్న కోహ్లీ చేతుల్లో ముఖాన్ని దాచుకున్నాడు. ఈ విజయంతో భావోద్వేగానికి గురయ్యాడు. ఇలాంటి రోజును చూడగలనని అనుకోలేదని కోహ్లీ చెప్పాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
విరాట్ కోహ్లీ, ఆర్‌సీబీ, ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

2008 నాటి వేలంలో కోహ్లీని దక్కించుకున్న ఆర్‌సీబీ

టీమిండియాకు ఆడకముందే ఆర్‌సీబీ విరాట్ కోహ్లీని వేలంలో దక్కించుకుంది.

ఆర్‌సీబీ మొదటిసారి చాంపియన్ కాగానే ఈ విజయం అభిమానులది, జట్టుదని విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు.

”నా యవ్వనం, నా సమయం, నా అనుభవం వెచ్చించాను. ఈ రోజు గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. చివరి బంతి అయిపోగానే నేను భావోద్వేగానికి గురయ్యా” అని కోహ్లీ అన్నాడు.

”ఏం జరిగినప్పటికీ నేను ఈ జట్టుతోనే ఉన్నా. నేను మరోలా ఆలోచించిన క్షణాలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ నేను ఈ జట్టుతోనే ఉన్నా. నా హృదయం, ఆత్మ బెంగళూరుతోనే ఉన్నాయి. ఐపీఎల్ ఆడినంత కాలం ఈ జట్టుతోనే ఉంటా” అని కోహ్లీ చెప్పాడు.

ఈ విజయం తన కెరీర్‌లో అత్యుత్తమ క్షణాల్లో ఒకటని కోహ్లీ అన్నాడు.

”ఇవాళ నేను పసిబిడ్డలా నిద్రపోతాను. వేలం తర్వాత చాలా మంది మమ్మల్ని ప్రశ్నించారు. కానీ, నిర్ణయాలపట్ల మేం సంతృప్తితో ఉన్నాం. నా గురించి ఇప్పటికే చాలా మాట్లాడారు. ఈ విజయం బెంగళూరు కోసం” అని కోహ్లీ అన్నాడు.

విరాట్ కోహ్లీ, ఆర్‌సీబీ, ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

తొలిసీజన్‌లో రూ.20 లక్షలకు విరాట్ కోహ్లీని దక్కించుకున్న ఆర్‌సీబీ

కోహ్లీ నాయకత్వంలో 2008 అండర్-19 వరల్డ్ కప్‌ను భారత్ గెలుచుకుంది. అప్పుడే కోహ్లీ వెలుగులోకొచ్చాడు.

అప్పటికి అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం లేకపోయినప్పటికీ తొలి సీజన్‌లో ఆర్‌సీబీ కోహ్లీకి రూ. 20లక్షలు ఇచ్చి సొంతం చేసుకుంది.

తొలి సీజన్ వేలం గురించి ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ ప్రస్తావించాడు.

”వేలం జరిగినప్పుడు మేం మలేసియాలో ఉన్నాం. 20లక్షల రూపాయలకు మమ్మల్ని ఫస్ట్ క్లాస్ క్రికెటర్లలా కొనుగోలు చేశారు. అప్పుడు మా ఆనందానికి అవధులు లేవు. మాకు 20 లక్షలొచ్చాయి. దాని వెనక భావోద్వేగం ఉంది” అని విరాట్ కోహ్లీ అన్నాడు.

ఆ తర్వాత ఐపీఎల్‌లో గానీ, అంతర్జాతీయ క్రికెట్‌లో గానీ విరాట్ కోహ్లీ వెనుతిరిగి చూసుకోలేదు.

ఐపీఎల్ తొలి సీజన్‌లో కోహ్లీ పెద్దగా రాణించలేదు. 13 మ్యాచుల్లో 165 పరుగులు మాత్రమే చేశాడు.

కానీ 2010 నాటికీ కోహ్లీ ఆట తీరు బాగా మెరుగయింది. ఆ సీజన్‌లో తొలిసారి కోహ్లీ 300కు పైగా పరుగులు చేశాడు.

విరాట్ కోహ్లీ, ఆర్‌సీబీ, ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

2011లో ఆర్‌సీబీ కెప్టెన్‌గా కోహ్లీ

2011లో విరాట్ కోహ్లీ రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ అయ్యాడు. ఆ ఏడాది కోహ్లీ అద్భుతంగా రాణించాడు.

16 మ్యాచుల్లో కోహ్లీ 557 పరుగులు చేశాడు. ఆ ఏడాది రెండోసారి ఆర్‌సీబీ ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది.

కానీ ఫైనల్‌లో ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఆర్‌సీబీ ఓటమి పాలైంది.

అనేక సంవత్సరాల నిరాశ తర్వాత 2016లో సరికొత్త అంకితభావంతో కోహ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఆ ఒక్క సీజన్‌లోనే కోహ్లీ చాలా రికార్డులు సృష్టించాడు.

16 మ్యాచుల్లో విరాట్ కోహ్లీ 973 పరుగులు చేశాడు. నాలుగు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు సాధించాడు. ఆర్‌సీబీ మూడోసారి ఫైనల్‌కు చేరింది.

కానీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం ఎనిమిది పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఫైనల్‌లో ఓడించింది. మళ్లీ విరాట్ కోహ్లీ కల నెరవేరలేదు.

విరాట్ కోహ్లీ, ఆర్‌సీబీ, ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

నెరవేరిన 18 ఏళ్ల కల

ఏళ్లు గడిచే కొద్దీ, కోహ్లీ బ్యాట్ పరుగుల వరద పారించింది. కానీ టైటిల్ గెలుపొందడం సంగతి పక్కన పెడితే ఈ సీజన్‌కు ముందు కోహ్లీ టీమ్ కనీసం ఫైనల్‌కు కూడా చేరుకోలేకపోయింది.

ఆర్‌సీబీని చాంపియన్‌గా నిలపలేకపోయానన్న అసంతృప్తితో కోహ్లీ 2023 సీజన్‌కు ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.

కానీ, ఆర్‌సీబీని చాంపియన్‌ని చేయడానికి అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు.

ఐపీఎల్ సీజన్‌లలో 2023లో 639 పరుగులు, 2024లో 741 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో 8వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.

ఈ ఏడాది కూడా ఆర్‌సీబీని చాంపియన్‌ని చేయడానికి విరాట్ కోహ్లీ అన్ని ప్రయత్నాలు చేశాడు.

15 మ్యాచుల్లో కోహ్లీ 657 పరుగులు చేశాడు. ఎట్టకేలకు కోహ్లీ 18ఏళ్ల కల నెలవేరింది.

విరాట్ కోహ్లీ, ఆర్‌సీబీ, ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

కోహ్లీ 18 ఏళ్లుగా జట్టుతో ఉండడం గొప్ప విషయం: మాల్యా

‘‘ఆర్‌సీబీని ఏర్పాటుచేసినప్పుడు బెంగళూరు ట్రోఫీని గెలవాలన్నది నా కల. యువ ఆటగాడిగా ఉన్నప్పుడు విరాట్ కోహ్లీని ఎంపిక చేసింది నేనే. అది నా అదృష్టం. 18 ఏళ్లగా అతను ఆర్‌సీబీతో ఉండడం నిజంగా గొప్ప విషయం’’ అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ యజమాని విజయ్ మాల్యా అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS