SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్ను 1979 నుంచి పాలిస్తున్న ఇస్లామిక్ పాలనను బలహీనపరిచే లక్ష్యంతో 200కు పైగా యుద్ధ విమానాలు , యుద్ధ నౌకలతో దాదాపు 5,000 టార్గెట్లపై ఇజ్రాయెల్, అమెరికా దాడి చేశాయి.
ఈ దాడుల్లో 1,000 మందికి పైగా మరణించారు, ఫిబ్రవరి 28న తెహ్రాన్లోని ఒక పాఠశాలపై జరిగిన బాంబు దాడిలో మరణించిన దాదాపు 100 మంది బాలికలు కూడా వీరిలో ఉన్నారు.
ఈ దాడులు తెహ్రాన్, కోమ్, తబ్రీజ్, మినాబ్ వంటి ఇతర ప్రధాన నగరాల్లోనూ తీవ్ర నష్టం కలిగించాయి.
అయితే, విశ్లేషకుల దృష్టిని ఆకర్షించిన ముఖ్యమైన అంశం ఒకటుంది.
ఇరాన్ను బలహీనపరచాలని ఇజ్రాయెల్, అమెరికా ప్రయత్నించినప్పటికీ, ఇరాన్ నియంత్రణలో ఉన్న వ్యూహాత్మక ప్రదేశం మాత్రం సురక్షితంగా ఉంది. అదే ఇరాన్ తీరానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖార్క్ ద్వీపం.

కేవలం 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ ప్రదేశమే, ఇరాన్ ప్రపంచానికి ఎగుమతి చేసే చమురులో 90 శాతం ట్యాంకులు, ఇతర సరఫరాలకు ప్రధాన కేంద్రం.
“ఇరాన్ మనుగడకు ఇది చాలా కీలకం. కానీ అమెరికా, ఇజ్రాయెల్ రెండూ దానిపై దాడి చేసినా లేదా నష్టం కలిగించినా ఇంధనపరంగా అది సరిదిద్దుకోలేని విషయమవుతుందని భావిస్తున్నా” అని చాథమ్ హౌస్కు చెందిన మిడిల్ ఈస్ట్ వ్యవహారాల నిపుణులు నీల్ క్విలియం బీబీసీకి చెప్పారు.
ఫొటో సోర్స్, Getty Images
హార్ముజ్ జలసంధి మూసివేయడంతో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అంతటి కీలకమైన ప్రదేశంపై దాడి చేయడం మరింత క్లిష్టమైనదని, వ్యూహాత్మకంగానూ అంత మంచిది కాదని క్విలియ్ అంటున్నారు.
అమెరికా ఇప్పటివరకు, ఇరాన్ చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకునే దిశగా ముందుకు సాగలేదని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ కొన్ని ప్రదేశాలపై దాడి చేసినప్పటికీ, ప్రస్తుత సంఘర్షణలో చమురు క్షేత్రాల జోలికి వెళ్లలేదు.
“ఇరాన్ ప్రపంచంలోనే నాల్గో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు. చమురు ధరలు ఇప్పటికే రికార్డు స్థాయికి చేరుకున్నాయి, ఈ దాడులు మొదలుపెట్టినప్పుడు వాషింగ్టన్ ఊహించని పరిణామం ఇది” అని క్విలియం అన్నారు.

చారిత్రక ఖార్క్ ద్వీపం
పర్షియన్ సామ్రాజ్యం నాటి నుంచే, అంటే 2,000 ఏళ్లకు ముందే ఈ చిన్న దీవి గల్ఫ్లో వ్యూహాత్మకంగా కీలకపాత్ర పోషించింది.
సహజ నీటి వనరుల కారణంగా, ఈ ప్రాంతంలో ఆహారం, ఇతర ఉత్పత్తుల వాణిజ్య మార్పిడికి కొంతకాలం పాటు ఇదొక ముఖ్యమైన ఓడరేవుగా మారింది.
ఇది 16వ, 17వ శతాబ్దాలలో పోర్చుగీస్, డచ్ పాలనలో ఉంది. ఆ సమయంలో నెదర్లాండ్స్ ఆధ్వర్యంలో నడిచే వాణిజ్య నౌకాశ్రయంగా దీని పేరు మరింత స్థిరపడింది.
20వ శతాబ్దంలో ఈ దీవిలో భారీ భద్రత కలిగిన జైలును ఏర్పాటు చేశారు. ఇరానియన్ తీరానికి దగ్గరగా ఉన్న ఈ దీవి వద్ద సముద్రం లోతుగా ఉంటుంది. తీరప్రాంత జలాలతో పోలిస్తే ఇక్కడి జలాలు చమురు ట్యాంకర్ల రాకపోకలకు అనువుగా ఉన్నాయి.
1950లలో షా మొహమ్మద్ రెజా పహ్లావి పాలనలో హైడ్రోకార్బన్ నిల్వ, పంపిణీ కేంద్రం నిర్మాణం మొదలైంది. కొద్దికాలంలోనే ఇది ప్రధాన ఎగుమతి కేంద్రంగా మారింది.
నిజానికి, ఈ దీవి మౌలిక సదుపాయాల్లో కొంతభాగం అమెరికా కంపెనీలకు చెందినది. 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం వరకు వారు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించారు.
ఫొటో సోర్స్, Getty Images
ఖార్క్ దీవిలోని మౌలిక సదుపాయాలు దేశ ఇంధన పరిశ్రమలో కీలకంగా పనిచేస్తున్నాయని ఇరాన్ హైడ్రోకార్బన్స్ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇరాన్ మూడు ప్రధాన సముద్ర చమురు క్షేత్రాలైన అబూజర్, ఫోరౌజాన్, దోరూద్ నుంచి ముడి చమురు ఈ టెర్మినల్కు చేరుతుంది. సముద్రం అడుగున ఉన్న పైపులైన్ల ద్వారా చమురును అక్కడికి తరలిస్తారు. ఇక్కడే ముడి చమురును ఎగుమతి కోసం ప్రాసెస్ చేస్తారు.
ఈ టెర్మినల్ ద్వారా రోజుకు సుమారు 1.3 మిలియన్ బ్యారెళ్ల చమురు వెళుతుందని అంచనా. ఇక్కడ నిల్వ సామర్థ్యం 18 మిలియన్ బ్యారెళ్లు.
ఇంధన మార్కెట్లో దీని ప్రాముఖ్యత కారణంగా, అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడుల్లో దీనిని లక్ష్యంగా చేసుకోలేదు. అయితే, 1980లలో ఇరాక్తో ఘర్షణ సమయంలో దీనిని లక్ష్యంగా చేసుకున్నారు.
వ్యూహాత్మక స్థానం
ఖార్క్ దీవి చమురు ఎగుమతి కేంద్రంగా మారిన నాటినుంచి తెహ్రాన్కు వ్యూహాత్మక కేంద్రంగా మారింది.
“అమెరికాకు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంటంటే, ఇరాన్ చమురును మార్కెట్ నుంచి తొలగించలేదు లేదా దాని మౌలిక సదుపాయాలకు కోలుకోలేని నష్టాన్ని కలిగించలేదు” అని క్విలియం అన్నారు.
ప్రస్తుతం బ్యారెల్ ధర 120 డాలర్ల (సుమారు రూ. 9,960)వద్ద ఉందని, ఖార్క్ ద్వీపంపై దాడి జరిగితే అది 150 డాలర్ల (సుమారు రూ. 12,500) వరకు పెరిగే అవకాశం ఉందని క్విలియం అభిప్రాయపడుతున్నారు.
“అదే జరిగితే, ఇప్పట్లో ఈ ధరలు తగ్గే అవకాశం లేదు” అని ఆయన అన్నారు.
‘ఈ ద్వీపంపై దాడి చేయకుండా, స్వాధీనం చేసుకోవాలని పెంటగాన్ సలహాదారులు సూచించారు. వారు(ఇరాన్) చమురును అమ్మలేకపోతే, పాలన కొనసాగించడానికి డబ్బు ఉండదు అని సలహాదారులలో ఒకరు సూచించారు’ అని బ్రిటిష్ వార్తాపత్రిక ది గార్డియన్ పేర్కొంది.
అయితే, ముందుగా పరిగణించవలసిన అంశాలు చాలా ఉన్నాయని క్విలియం చెబుతున్నారు.
దీన్ని స్వాధీనం చేసుకోవడానికి పదాతి దళాలను ఉపయోగించడం మాత్రమే కాకుండా, అక్కడ అభివృద్ధి చేయాల్సిన ప్రాజెక్ట్ భవిష్యత్తుపై పడే ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
ఫొటో సోర్స్, Getty Images
“అమెరికా ఏం చెప్పిందంటే.. ఇరాన్ ప్రస్తుత పాలనను అంతమొందించి, ప్రజాస్వామ్య స్థాపన. కానీ అది విజయవంతం కావాలంటే, ఖార్క్ దీవి సక్రమంగా పనిచేయడం అవసరం” అని క్విలియం వివరించారు.
కానీ, ఈ నేపథ్యంలో, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల నడుమ ఈ దీవిపై దాడి జరిగే అవకాశం లేదని కూడా విశ్లేషకులు చెప్పలేకపోతున్నారు.
“ఇప్పటివరకు, ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ఖార్క్ ద్వీపంపై దాడి చేయడానికి ధైర్యం చేయలేదు. అందులో పెద్దగా లాజిక్ లేకపోయినా, ఇటీవలి నెలల్లో జరిగిన పరిణామాలను చూస్తే దాడి జరగదని చెప్పలేం” అని ఆయన అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)


