SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
మిస్త్రీ జిగ్నేశ్కు అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత 72 గంటలు చాలా కష్టంగా గడిచాయి.
జిగ్నేశ్, అతని కుటుంబం, తమ మేనకోడలు (22) గురించిన సమాచారం కోసం ఈనెల 12 నుంచి అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారు. ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించిన 242 మందిలో ఆమె ఒకరు.
డీఎన్ఏ పరీక్ష తర్వాత 72 గంటల్లో ఆమె మృతదేహాన్ని అప్పగిస్తామని మొదట అధికారులు చెప్పారు. అయితే, రోజులు గడిచినా ఘటనా స్థలంలో ఇంకా కొన్ని మృతదేహాలను వెతుకుతుండటంతో, గుర్తించడానికి సమయం పట్టొచ్చని జిగ్నేశ్కు చెప్పారు అధికారులు.
“మా అమ్మాయి అవశేషాలు ఇంకా దొరక్కపోతే ఎలా? ఇలా వేచి ఉండటం మమ్మల్ని బాధిస్తోంది” అని జిగ్నేశ్ అన్నారు.
జిగ్నేశ్ వ్యాఖ్యలపై స్పందించడానికి అధికారులు నిరాకరించారు. అయితే, సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖ అధికారులు బీబీసీతో చెప్పారు. వారు తమ పేరు చెప్పడానికి ఇష్టపడలేదు.


ఫొటో సోర్స్, Reuters
హాస్టల్పై పడిన విమానం
మరోవైపు, విమానం కూలిన ప్రదేశంలో మెడికల్ కాలేజీ హాస్టల్ కూడా ఉండటంతో అందులోని విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు, పలువురు మరణించారు.
కేంద్ర ప్రభుత్వం ఘటనపై విచారణకు ఆదేశించింది. ఇప్పటివరకైతే విమాన ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.
ఆసుపత్రికి వెళితే.. డీఎన్ఏ పరీక్షలు చేసి మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించడానికి వైద్యులు వేగంగా పనిచేస్తున్నారు. కానీ, జిగ్నేశ్ వంటి కుటుంబాలకు, వేచి ఉండటం బాధగా ఉండవచ్చు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
వైద్యులు ఏం చేస్తున్నారు?
చాలావరకు మృతదేహాలు కాలిపోవడంతో వాటిని ఎలా గుర్తిస్తున్నారు, ఈ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయనే విషయంపై అధికారులు స్పందించారు.
“ఇక్కడ ఎలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి. ప్రతి కుటుంబానికి వారి బంధువుల శరీరాలే అందేలా చూడాలి” అని గాంధీనగర్లోని డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్సెస్ డైరెక్టర్ హెచ్పీ సంఘ్వి అన్నారు.
“డీఎన్ఏ పరీక్షకు సమయం పడుతుంది, పేలుడు కారణంగా చాలామంది డీఎన్ఏ దెబ్బతినే ప్రమాదముంది ” అని ఆయన చెప్పారు.
ఫోరెన్సిక్ దంత వైద్యుడు జైశంకర్ పిళ్ళై మాట్లాడుతూ.. తన బృందం దంతాలను కూడా చెక్ చేస్తోందని, బాగా కాలిపోయిన శరీరాల నుంచి డీఎన్ఏ సేకరించడానికి ఇదే ఏకైక మార్గం కావచ్చని అన్నారు.
‘మాటలు రావడం లేదు’
మృతదేహాల కోసం నిరీక్షణ, కుటుంబాలను కుంగదీస్తోంది. చాలామంది మీడియాతో మాట్లాడటానికి ఇష్టపడలేదు.
తమ ఆప్తులకు సంబంధించి “మిగిలి ఉన్న శరీరభాగాలను” ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు.
“మేం ఏమీ చెప్పలేం, మాటలు రావడం లేదు” అని పోస్ట్ మార్టం రూమ్ బయట తన కుటుంబంతో కలిసి ఎదురు చూస్తున్న ఒక మహిళ బీబీసీతో అన్నారు.
బీజే మెడికల్ కాలేజీలో ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న హాస్టల్ వార్డులను అధికారులు ఖాళీ చేయించారు. విమానం ఢీకొన్న క్యాంటీన్తో సహా నాలుగు వార్డులను ఇప్పటికే ఖాళీ చేయించారు.
సమీప హాస్టల్ బ్లాక్లలోని విద్యార్థులు కూడా వెళ్లిపోతున్నారు.
“ఒక వార్డులో ముగ్గురు మాత్రమే ఉన్నారు. మిగిలిన వారు ఇంటికి వెళ్లిపోయారు. వీళ్లు కూడా వెళ్లిపోతారు. వారంతా దిగాలుగా ఉన్నారు. ఆ రోజు ఘటన వారిని తీవ్రంగా కదిలించింది” అని పేరు చెప్పడానికి ఇష్టపడని హాస్టల్ విద్యార్థి ఒకరు చెప్పారు.

‘మా సోదరుడు అదృశ్యమయ్యాడు’
కార్తీక్ కలవాడియా తన సోదరుడు మహేశ్ వస్తున్నట్లు విమాన ప్రమాదానికి దాదాపు 30 నిమిషాల ముందు విన్నారు.
మహేశ్ తన భార్యకు ఫోన్ చేసి “నేను ఇంటికి వస్తున్నాను” అని చెప్పారు. కుటుంబీకులతో ఆయన చెప్పిన చివరి మాటలు అవే.
గుజరాతీ చిత్ర పరిశ్రమలో మహేశ్ మ్యూజిక్ ప్రొడ్యూసర్. ఆ రోజు పని ముగించుకొని ఇంటికి బయలుదేరారు మహేశ్. ఆయన ప్రయాణించే మార్గం పైనుంచే విమానం వెళ్లింది. ఆయన ఫోన్ చివరి లొకేషన్ బీజే మెడికల్ కాలేజీ నుంచి కొన్ని వందల మీటర్ల దూరంలో చూపించిందని బీబీసీతో చెప్పారు కార్తీక్. ప్రమాదం జరిగినప్పటి నుంచి మహేశ్ ఆచూకీ కనిపించడం లేదు.
దీంతో, మహేశ్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసి, సివిల్ ఆసుపత్రిని చాలాసార్లు సందర్శించింది. కానీ ఇప్పటికీ ఆయన జాడ దొరకలేదు.
“ఆసుపత్రిలో నా సోదరుడి వివరాలు లేవు. మేం అతని స్కూటర్ వెతకడానికి ప్రయత్నించాం. అది కూడా దొరకలేదు. అతను అదృశ్యమైనట్లు అనిపిస్తుంది” అని కార్తిక్ అన్నారు.
ప్రమాద దర్యాప్తు సరైన దిశలో జరుగుతోందని పౌర విమానయాన కార్యదర్శి ఎస్.కె. సిన్హా మీడియాతో అన్నారు. ఈ దర్యాప్తులో తన సోదరుడి జాడ దొరుకుతుందేమోనని కార్తిక్ ఆశాభావం వ్యక్తంచేశారు.
ఇంతియాజ్ అలీ సయీద్తో గురువారం రాత్రి బీబీసీ మాట్లాడింది. తన సోదరుడు జావేద్, ఆయన భార్య, వారి ఇద్దరు పిల్లలు చనిపోయారనే విషయాన్ని తాను నమ్మలేకపోతున్నానని ఆయన చెబుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)