SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, US Department of Defence
హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌక ‘దేనా’పై అమెరికా జలాంతర్గామి జరిపిన టార్పెడో దాడిలో మరణించిన 84 మంది ఇరాన్ నావికుల మృతదేహాలను వారి స్వదేశానికి శుక్రవారం తరలించనున్నట్లు శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మార్చి 4న, శ్రీలంక దక్షిణ తీరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఐరిస్ దేనా మునిగిపోయిన సమయంలో అందులో 130 మంది నావికులు ఉన్నట్లు భావిస్తున్నారు.
గాలే నేషనల్ హాస్పిటల్ ఫ్రీజర్లలో భద్రపరిచిన మృతదేహాలను ఇరాన్కు పంపేందుకు శుక్రవారం ఉదయం పోలీసు భద్రతా ఏర్పాట్ల మధ్య మత్తల రాజపక్స అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించారు.


రక్షించిన నావికులు శ్రీలంకలోనే…
అమెరికా టార్పెడో దాడి తర్వాత శ్రీలంక నౌకాదళం రక్షించిన 32 మంది ఇరాన్ నావికులు తమ దేశంలోనే ఉంటారని శ్రీలంక తెలిపినట్లు ఏఎఫ్పీ వార్తాసంస్థ పేర్కొంది.
ఆసుపత్రిలో ఉన్న 84 మంది ఇరాన్ నావికుల మృతదేహాలను ఇరాన్ రాయబార కార్యాలయానికి అప్పగించాలని శ్రీలంకలోని గాలే నగర మేజిస్ట్రేట్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
టార్పెడో దాడి తర్వాత అమెరికా రక్షణ శాఖ విడుదల చేసిన వీడియోలో, నౌకపై దాడి అనంతరం దాని వెనుక భాగం పైకి లేచి, ఆ తర్వాత పేలిపోవడం కనిపించింది.
ఇరాన్ యుద్ధనౌక మునిగిపోయిన కొద్దిసేపటికే అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ మాట్లాడుతూ, ఆ ఇరాన్ యుద్ధనౌక ‘నిశ్శబ్ద మరణం’ పొందిందని వ్యాఖ్యానించారు.
దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పందిస్తూ, ఇరాన్ తీరానికి 2 వేల మైళ్ల దూరంలో, సముద్రంలో అమెరికా దారుణ హింసాకాండకు పాల్పడిందని, దీనికి “అమెరికా పశ్చాత్తాపపడక తప్పదు” అని ఆయన హెచ్చరించారు.
విశాఖ తీరంలో సైనిక విన్యాసాల అనంతరం తిరిగివెళ్తున్న ఐరిస్ దేనాపై అమెరికా దాడి చేసింది.
అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఈ యుద్ధ నౌక మునిగిపోవడం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఒక్కసారిగా తీవ్రతరం కావడానికి సంకేతంగా నిలిచింది.
ఆ తర్వాత నుంచే ఇరాన్ అమెరికాతో మిత్రపక్షాలుగా ఉన్న గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకొని మిడిల్ ఈస్ట్ అంతటా ప్రతీకార దాడులను ప్రారంభించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)



